హిందూ దేవాలయాలు చరిత్రప్రసిద్ధి గాంచినవి. అటువంటి దేవాలయాలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి. వీటి చరిత్ర ఘనం. వాటి కీర్తిపతాకాలు దేశమంతా వ్యాపించాయి. కొన్నేమో కనుమరుగవగా మరొకొన్ని నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 'దేవాలయాల రాష్ట్రం' గా ఖ్యాతికెక్కిన తమిళనాడు లో ఇటువంటిదే ఒక ఆలయం ఉంది. దీని రహస్యమే నేటి ఈ వ్యాసం.
ఇది కూడా చదవండి : తిరువత్తర్ - 108 దివ్య క్షేత్రాలలో ఒకటి !
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ కోన కన్యాకుమారి చేరువలో కేరళపురం అనే గ్రామం కలదు. ఇది ఒకప్పుడు కేరళ ట్రావెన్కోర్ వంశీయుల ఆధీనంలో ఉండేది. రాష్ట్రాలు ఏర్పడ్డాక కేరళలో ఉండవలసిన ఈ ప్రాంతం తమిళనాడులోకి వెళ్ళిపోయింది. కేరళపురం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది ముఖ్యంగా శివాలయాలకు. కేరళపురంలో చూడటానికి చారిత్రక కట్టడాలు, మతపర కేంద్రాలు ఉన్నాయి.
వినాయక దేవాలయం
కేరళపురం లో శివాలయాలతో పాటు పురాతన వినాయక దేవాలయం ఉంది. ఇది "శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ దేవాలయం" గా ప్రసిద్ధి చెందినది.
రంగుమారటం
దేవాలయంలో ప్రధాన దేవుడు, మూలవిరాట్టు ' వినాయకుడు'. ఈయన ఆరు నెలలకు ఒకసారి రంగుమారటం ఇక్కడి విశేషం.
ఆరు నెలలు
ఆరు నెలలు అంటే మర్చి నుండి ఆగస్టు వరకు (ఉత్తరాయణ కాలం) నల్లని రంగులో, ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు (దక్షిణాయణ కాలం) తెల్లని రంగులో వినాయకుడు ఉంటాడు.
చితకృప : Sshankar s.
విచిత్రం 1
ఇక్కడ ఇంకో విచిత్రం కూడా వుంది. అదేమిటంటే ఆలయ ప్రాంగణంలోని బావిలో కూడా నీళ్లు రంగు మారుతుంది. వినాయకుడు నల్లని రంగులో ఉన్నప్పుడు బావిలోని నీళ్లు తెల్లగా, వినాయకుడు తెల్లగా ఉన్నప్పుడు నీళ్లు నల్లగా మారుతాయట.
చితకృప :Pradam
విచిత్రం 2
అంతేకాదు, గుడి ఆవరణంలో ఉన్న మర్రిచెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం మొదలు పెడుతుందట.
చితకృప : Dinesh Valke
ఆలయ చరిత్ర
గుడి క్రీ.శ.12వ శతాబ్ది కాలం నాటిదని భావన. ఈ దేవాలయం నిర్మించిన చోట మొదట శివాలయం ఉండేది. అందుకే ఈ దేవాలయాన్ని " శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం" అని అంటారు.
చితకృప :Shareef Taliparamba
రాజు కథ
కేరళపురం రాజు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళతాడు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాలలో తడుస్తూ ఒక వినాయక విగ్రహం ఆయన కంట పడింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి ఇవ్వబోతే .. ఆ రాజే కేరళపురం రాజుకు ఇస్తూ, దానికి తోడు పచ్చల గణపతిని కూడా ఇస్తాడు. కేరళపురం రాజు ఆ రెండు విగ్రహాలను తన రాజ్యానికి తీసుకొని పోయి రాతి పీఠం పై ప్రతిష్టిస్తాడు. అయితే, తురుష్కుల దాడిలో పచ్చల గణపతి దొంగలింపడబడగా, ఇప్పుడున్న గణపతి విగ్రహం మాత్రం ఉంది.
చితకృప : Swaminathan
ఆలయ వర్ణన
గుడి యొక్క ప్రాకార గోడల మీద పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ వినాయకునికి ఉదయం, సాయంత్రం పూట అభిషేకాలు జరుగుతాయి. భక్తులు స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం.
చితకృప :Natesh Ramasamy
కేరళపురం ఆలయానికి ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం : కన్యాకుమారి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి 32 కి. మీ ల దూరంలో ఉన్న తుక్కలే (thuckalay) వరకు బస్సులు తిరుగుతాయి. అక్కడి నుండి సమీపాన ఉన్న కేరళపురం ఆలయం వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.
రైలు మార్గం : కన్యాకుమారి రైల్వే స్టేషన్ చేరుకొని, బస్సులలో లేదా టాక్సీ ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు.
వాయు మార్గం : గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లో దిగి కన్యాకుమారి వరకు బస్సులో ప్రయాణించి, అక్కడి నుండి కేరళపురం ఆలయానికి చేరుకోవచ్చు.
చితకృప :shankar s.