స్వామి వివేకానందుడు దేశంలోని పుణ్య క్షేత్రాలన్నీ దర్శించాలని, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల జీవన నాడిని తెలుసుకోవాలని కాలినడకన దేశాటన సాగిస్తాడు. అలా చేస్తూ చేస్తూ .. ఆయన కాశీ నుండి కన్యాకుమారి చేరుకుంటాడు. వివేకానందుడు కన్యాకుమారి ఒడ్డుకు చేరుకొని అక్కడ ఉన్న పెద్ద బండరాయి వరకు ఈత కొట్టుకుంటూ చేరుతాడు. ఇప్పడు అదే బండరాయి వివేకానంద రాక్ మెమోరియల్ గా ప్రసిద్ధి కెక్కింది.
హిందూ మహాసముద్రం లో ఉన్న వివేకానంద మెమోరియల్ రాక్ గార్డెన్ తమిళనాడులోని కన్యాకుమారి ఒడ్డున కలదు. ఇక్కడికి వెళ్ళడానికి ఫెర్రీ సౌకర్యం కలదు. ఉదయం 8 నుండి సాయత్రం 4 వరకు మాత్రమే ఫెర్రీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇది సముద్ర తీరం నుండి 200 మీటర్ల దూరంలో, సముద్రంలో ఒక పెద్ద రాయిపైన కలదు.
ఇది కూడా చదవండి : సౌత్ ఇండియాలో సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు !
దూరం నుంచి వివేకానంద రాక్ వ్యూ
చిత్ర కృప : Bhawani Gautam
రాక్ మెమోరియల్ వెనక కధనం
శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి వివేకానంద తనకు కాళికాదేవిపైన భక్తి ప్రేరణతో తపస్సు చేయుటకు కన్యాకుమారి ఒడ్డుకు చేరి, సముద్రంపై ఉన్న రాయిని ఈదుకుంటూ చేరుకుంటాడు. అక్కడ మూడు రాత్రుళ్లు, మూడు పగళ్లు ధ్యానంలో కూర్చొన్నాడని ప్రతీతి.
వివేకానంద రాక్ మెమోరియల్ ను 1970 లో బ్లూ మరియు రెడ్ గ్రానైట్ రాళ్ళ తో నిర్మించారు. దీనిని రాక్ ఐలాండ్ లో శిఖరం పై సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఈ ప్రదేశం సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణం లో కలదు. మెమోరియల్ రెండు రాళ్ళ పై నిలబడి వుంటుంది. ఐలాండ్ నుండి 500 మీటర్ల ఎత్తున వుంటుంది.
మెమోరియల్ ఎంట్రెన్స్
చిత్ర కృప : Nikhil B
వివేకానంద రాక్ మెమోరియల్ భవనం లో వివేకానందుడి విగ్రహాన్ని పర్యాటకులు చూడవచ్చు. ఈ మెమోరియల్ లో రెండు మండపాలు, శ్రీ పద మండపం మరియు వివేకానంద మండపం వుంటాయి. శ్రీపాద మండపం కన్యాకుమారి చే ఆశీర్వదించబడిన శ్రీపాద పరాయి అనే పవిత్ర ప్రదేశంలో వుంటుంది.
వివేకానంద మండపము ప్రధాన ద్వారములకు రెండు ప్రక్కలా నల్లరాతి ఏనుగులు, దూలములపై సాంప్రదాయక చిహ్నమైన గజపూర్ణ కుంభం చెక్కినారు. మండపములోని గదులలో శ్రీ రామకృష్ణ పరమహంస , శ్రీ శారదాదేవి యొక్క సజీవం అనిపించే చిత్ర పటములు కలవు. ధ్యాన మందిరంలో ఓం గుర్తును ప్రణవ పీఠంపై ప్రతిష్టించబడినది. ఇక్కడ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రకృతి అందాలను చూసి ఆనందించవలసిందే..!
విద్యుద్దీపకాంతుల్లో వివేకానంద మెమోరియల్
చిత్ర కృప : Nomad Tales
వివేకానంద మండపం 4 భాగాలు అంటే సభ మండపం, ధ్యాన మండపం, ముందు ప్రవేశం మరియు ముఖ మండపం గా వుంటుంది. ధ్యాన మండపం ఒక మెడిటేషన్ హాల్. దీనిలో పర్యాటకులు ధ్యానం చేయవచ్చు.
తిరువల్లువార్ విగ్రహం
వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే 2000 వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం ప్రఖ్యాత తమిళ కవి తిరువళ్ళువార్ విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ విగ్రహం ఎత్తు సుమారు 133 అడుగుల ఎత్తు ఉంటుంది. వి గ్రహం యొక్క బేస్ సుమారు 38 అడుగులు, బేస్ పై పెట్టిన విగ్రహం ఎత్తు 95 అడుగులు. ఈ విగ్రహం ఆసియా లోని ఎత్తైన విగ్రహంగా పేరొందింది.
తిరువల్లువార్ విగ్రహం
చిత్ర కృప : Ilakkiaraj S
చూడవలసినవి: వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కన్యాకుమారి నుండి ఫెర్రీ సౌకర్యం కలదు.
కన్యాకుమారి లో చూడదగ్గ ప్రదేశాలు
కన్యాకుమారి ఇండియాకు దక్షిణాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం. ఇక్కడ సందర్శించటానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కుమారి అమ్మన్ టెంపుల్, వత్త కొట్టాయి ఫోర్ట్, గాంధీ మ్యూజియం, పద్మనాభపురం పాలెస్, కన్యాకుమారి బీచ్ మొదలైనవి ప్రధానంగా చూడదగ్గవిగా ఉన్నాయి.
గాంధీ మ్యూజియం
చిత్ర కృప : telugu native planet
వివేకానంద రాక్ మెమోరియల్ ఎలా చేరుకోవాలి ?
కన్యాకుమారి ఒడ్డు నుండి రాక్ మెమోరియల్ చేరుకోవటానికి ఫెర్రీ సౌకర్యం కలదు. గురువారం తప్ప, మిగితా అన్ని దినాలలో రాక్ మెమోరియల్ తెరిచే ఉంచుతారు.
- క్లిక్ : కన్యాకుమారి ఎలా చేరుకోవాలి ?