కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటక లోని ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది పడమటి కనుమల మల్నాడు ప్రాంతంలో కర్నాటకలోని నైరుతి ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతం ప్రధానంగా పర్వతమయం. సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల నుండి 1715 మీ.ల ఎత్తువరకు ఉంటుంది. కూర్గ్ ను ఇండియాలోని స్కాట్ లాండ్ అంటారు. మరో రకంగా కర్నాటకలోని కాశ్మీర్ అని కూడా అంటారు. ఎల్లపుడూ పచ్చగా ఉండే అడవులు, లోయలు, మంచుపడే కొండ ప్రాంతాలు, విస్తారించిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్లు, నారింజ తోటలు, ఎత్తైన శిఖరాలు వేగంగా ప్రవహించే జలపాతాలు, దీనికి ఆ పేరు తెచ్చి పెట్టాయి. దక్షిణ భారత దేశంలో ప్రత్యేకించి దక్షిణ కన్నడ, హసన్ మరియు మైసూరు జిల్లాల వారు కేరళ లోని కన్నూర్ మరియు వయనాడ్ జిల్లాలవారు వారాంతపు సెలవులు వచ్చాయంటే చాలు ఈ ప్రదేశంలో విహరిస్తారు.
కూర్గ్ ప్రదేశ అందాలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. ఈ ప్రాంతం పడమటి కనుమలలోని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల అందాలను చూపిస్తుంది.
ఈ ప్రదేశానికి ఈ పేరు ఎలా వచ్చిందనేది చరిత్రపరంగా పరిశీలిస్తే....
కొడగుకు సంబంధించి అనేక కధలున్నాయి. కొంతమంది ఇక్కడి జాతులను కొడవ జాతులుగా కొడగు అనే పదం వారిప్రాంతానికి చెందిన క్రోధ దేశం అని చెపుతారు. మరి కొంతమంది కొడగు పదం కొడవ నుండి పుట్టిందని కొడ్ అనగా ఇవ్వటం అని అవ్వ అనగా తల్లి అని అంటే ఈ రేండూ చేరి ఇచ్చునటువంటి తల్లి కావేరీ దేవత ఈ ప్రాంతంలో నీరు ఇస్తోందని చెపుతారు. తర్వాతి కాలంలో కొడగు పదం ఇంగ్లీష్ భాషలోకి కూర్గ్ గా మారింది.
కూర్గ్ చరిత్ర పరిశీలిస్తే, ఇది సుమారుగా 8వ శతాబ్దానికి చెందినది. గంగ వంశ పాలకుల పాలనలో కలదు. వీరి తర్వాత పాండ్యులు, చోళులు, కదంబులు, చాళుక్యులు, చంగల్వలు కూడా దీనిని పాలించారు. క్రీ.శ.1174 లో హొయసల రాజులు దీనిని స్వాధానం చేసుకున్నారు. వారి తర్వాత విజయనగర రాజులు సుమారు 14వ శతాబ్దం మధ్య భాగంలో దీనిని పాలించారు. ఇక్కడి స్ధానిక నాయకులను నాయక్ లు అంటారు. 16 వ శతాబ్ది మధ్య భాగంలో ఈ ప్రాంతాన్ని లింగాయత్ రాజులు వశం చేసుకొని 19వ శతాబ్దం వరకు పాలించారు.
కూర్గ్ ప్రాంతం 1947 లో మనకు స్వాతంత్రం వచ్చేటంతవరకు బ్రిటీష్ పాలకుల స్వాధీనంలో ఉండేది. 1950 సంవత్సరంలో స్వతంత్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్ధీకరణ జరిగేటపుడు కూర్గ్ ను నేటి కర్నాటకలో చేర్చారు. కర్నాటకలో కూర్గ్ అతి చిన్న రాష్ట్రం. మూడు తాలూకాలు అంటే, మడికేరి, సోమవారపేట, విరాజ్ పేటలు మాత్రమే. కూర్గ్ కు మడికేరి జిల్లా ప్రధాన కేంద్రం.
పర్యాటకులకు స్వర్గం -
కూర్గ్ లో పర్యాటకులను ఆకర్షించే అనేక చారిత్రక చిహ్నాలు అంటే, ప్రదేశాలు, కోటలు, దేవాలయాలు, పార్కులు, జలపాతాలు మరియు శాంక్చురీలు కలవు. కూర్గ్ ప్రధాన ఆకర్షణలు అంటే, అబ్బే ఫాల్స్, ఇర్పు ఫాల్స్, మల్లలి ఫాల్స్, మడికేరి కోట, మడికేరి ప్యాలెస్, రాజాస్ సీట్, నలక్ నాడ్ ప్యాలెస్, మరియు గద్దిగె (రాజా సమాధులు)
కూర్గ్ లో ప్రాచుర్యాన్ని పొందిన మరికొన్ని ప్రదేశాలు, భాగమండల, టిబెట్ బంగారు దేవాలయం, ఓంకారేశ్వర దేవాలయం, తలకావేరి.
కూర్గ్ లో చెలవార జలపాతాలు, హారంగి డ్యామ్, కావేరి నిసర్గధామ, దుబరే ఏనుగుల శిక్షణా కేంద్రం, హొన్నమన కెరె, మండలపట్టి మరియు నాగర హోళే నేషనల్ పార్క్, దాని పక్కనే కల బండిపూర్ నేషనల్ పార్క్ లు కూడా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు.
ట్రెక్కింగ్, గోల్ఫ్, చేపలు పట్టుట, రివర్ ర్యాఫ్టింగ్ వంటి వాటికి ఎన్నో అవకాశాలు కలవు. ట్రెక్కింగ్ చేసే వారికి పుష్ఫగిరి హిల్స్, కోటిబెట్ట, ఇగ్గుతప్ప, నిషాని మోటి మరియు తడియాండ్రమోల్ ప్రదేశాలు అనుకూలం.
అప్పర్ బరాపోలే రివర్ లో అనేక నీటి క్రీడలు ఆడవచ్చు. చేపలు పట్టే ఆసక్తి కలవారికి కావేరీ నది వెనుక భాగమైన వలనూర్ ప్రసిద్ధి.
స్ధానిక సంస్కృతి మరియు ఇతర విశేషాలు
కూర్గ్ హిల్ స్టేషన్ దాని సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రసిద్ధి. హుట్టరి, మెర్కారా దసరా, కీల్ పోడు మరియు కావేరి సంక్రమణ వంటివి ఈ ప్రాంత ప్రజల పండుగలు. వివిధ స్ధానిక ఆహారాలు మాంసాహారంగా ఉండి దక్షిణ భరత వంటకాలలో ప్రసిద్ధి కెక్కాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో స్థానికులు 'స్టార్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ ' నిర్వహిస్తారు. ఈ పండుగలో వివిధ రకాల ఆహారాలు, లిక్కర్ వంటివి ఆరగించి సంగీత నృత్యాలతో ఆనందిస్తారు.
కూర్గ్ లో అనేక తెగలు కలవు. అవి ప్రధానంగా కొడవ, తుళు, గౌడ, కుడియాలు, బంటాలు మొదలైనవి. అయితే, ప్రజలలో చాలామంది కొడవ జాగి వారు. లేదా కూర్గీయులు. వీరు ఆతిధ్యానికి, ధైర్య సాహసాలకు పేరు గాంచిన వారు. కూర్గ్ ప్రాంతం అంతర్జాతీయంగా ఒక కాఫీ పంటల ఉత్పత్తి ప్రదేశంగా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో బ్రిటీష్ వారే కాఫీ తోటలను మొదలుగా పెంచారు. అరబికా, రోబస్తా వెరైటీలు కాఫీ సాగులో ప్రధానమైనవి. తేనె, యాలకులు, మిరియాలు, నారింజ ఉత్పత్తులకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి. కూర్గ్ దర్శించాలంటే, నవంబర్ నుండి ఏప్రిల్ వరకు అనుకూల సమయం. కూర్గ్ కు రోడ్డు మార్గం మాత్రమే కలదు. మంగుళూరు, హసన్, మైసూర్, బెంగుళూరు, కన్ననూర్ మరియు వయనాడ్ లకు రోడ్డు ద్వారా కలుపబడింది. కూర్గ్ కు సమీప రైలు స్టేషన్ మైసూరు. సుమారు 118 కి.మీ.ల దూరంలో కలదు. సమీప విమానాశ్రయం మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 168 కి. మీ. ల దూరంలో కలదు.