పురాణ గాధలతో నిండిన కటీల్ పట్టణం కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలో ప్రధానమైన శక్తి పీఠం. నందిని నది ఒడ్డున ఉన్న దుర్గ పరమేశ్వరీ ఆలయం దేశంలో చాల మంది యాత్రీకులను ఆకర్షిస్తుంది.
ఈ ప్రాంతం వెనుక చరిత్ర
పురాతన కాలంలో, అరుణాసుర అనే పేరుగల అసురుడి చేష్టల వల్ల ఈ ప్రాంతం కరువులో కూరుకు పోయింది.
తీవ్ర ధ్యానంలో ఉన్న జాబాలీ అనే ముని, తన మనోనేత్రంతో ప్రజలు బాధలు పడటం చూసాడు. వారిపై జాలితో బాధల నించి బైటికి వచ్చే మార్గాన్ని అన్వేషించాలని నిశ్చయించుకున్నాడు. ఒక యజ్ఞం చేయ తలపెట్టి కామధేనువు కోసం దేవేంద్రుడిని అనుమతి కోరాడు. కామధేనువు వరుణలోకం వెళ్లినందువల్ల ఆమె పుత్రిక నందినిని తీసుకు వెళ్ళవలసిందిగా చెప్పాడు ఇంద్రుడు.
నందిని పొగరుగా భూమ్మీద పాపాత్ములు వుంటారని, అక్కడ ఎప్పటికీ అడుగు పెట్టానని, అందు చేత అతనితో వెళ్లనని తెగేసి చెప్పింది. ప్రజల బాధలు ఆమెకి తెలిపి, ఆమె రావడం వల్ల వాళ్ళ బాధలు తగ్గుతాయని వివరించి రావలసిందిగా ముని ఆమెను బ్రతిమాలాడు. ఆమె వినకపోవడంతో ఆగ్రహించిన జాబాలి ఆమెను భూమ్మీద నదిగా పుట్టమని శపించాడు. భీతిల్లిన నందిని తనను అనుగ్రహించి శాప విమోచనం చెప్పమని అడిగింది. ముని ఆమెను దుర్గా దేవి ని పూజించమనీ, ఆవిడే ఆమెను రక్షిస్తుందని చెప్పాడు.
నందిని మొర ఆలకించి దుర్గా దేవి ప్రత్యక్షమైంది. ముని శాపం ప్రకారమే నందిని భువిలో నదిగా ప్రవహించమని దుర్గా దేవి చెప్పింది. ఆమెకు శాప విమోచనం చేయడానికి తానె ఆమె కూతురుగా పుడతానని మాటిచ్చింది.
అప్పుడు నందిని కటీల్ లోని కనకగిరి మీదుగా నదిగా ప్రవహించింది. ఈ నది ఒడ్డున జాబాలి ముని యజ్ఞం చేశాక, వర్షాలు కురిసి ప్రజలకు సుఖ సమృద్దులు చేకూరాయి.
మరిన్ని పురాణ గాధలు :
ఈ లోగా అరుణాసురుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వరాలు పొంది బలం బాగా పెంచుకున్నాడు. రెండు కాళ్ళ జంతువు వల్ల గాని, నాలుగు కాళ్ళ జంతువు వల్ల గానీ, ఎలాంటి ఆయుధం వల్ల గాని అతను చావడని బ్రహ్మ వరమిచ్చాడు. ఈ వర గర్వంతో అరుణాసురుడు దేవతలను ఓడించి, చాల దుర్మార్గాలకు ఒడిగట్టాడు. దేవతలు సహాయం కోసం దుర్గా దేవి ని ప్రార్ధించారు.
దుర్గా దేవి అరుణాసురుడి ముందు ఒక అందమైన స్త్రీ గా ప్రత్యక్షమైంది. మోహితుడై ఆమెను వెంబడించాడు ఆ రాక్షసుడు. తానెవరో దుర్గా దేవి చెప్పే సరికి అరుణాసురుడు ఆమెను చంప బోయాడు. ఇంతలో ఆమె శిలగా మారిపోగా, అందులోంచి తేనెటీగల దండు బయటకు వచ్చి అతన్ని విపరీతంగా కుట్టి చంపాయి. రెండు లేక నాలుగు కాళ్ళ జంతువుల వల్ల లేదా ఆయుధం వల్ల అతనికి చావు లేక పోవడంతో అమ్మవారు ఈ విధంగా చేసింది.
దేవతలప్పుడు భ్రమరాంబికను (భ్రమరాల రాణి) తన సత్వ, శుభ రూపం లోకి రావాలని ప్రార్ధించారు. అప్పుడు ఆ దేవత నందిని నది మధ్యలో ఒక అందమైన రూపంలో ప్రత్యక్షమై, నందిని కి కూతురుగా పుడతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆవిడ ప్రత్యక్షమైన ద్వీపా౦శాన్ని కటీల్ అంటారు. సంస్కృతంలో కటి అంటే మధ, ఇల అంటే భూమి. కటి – ఇల ఇప్పుడు, నది మధ్య భాగం కావడం తో కటీల్ ఐపోయింది -
దుర్గా అమ్మవారి విగ్రహ౦ ప్రతిష్టించి ఈ చిన్న ద్వీపం మీద గుడి నిర్మించారు.
ఇక్కడ జరిగే వేడుకలు
అందమైన ఆలయం, దాని చుట్టూ నది, పచ్చని మొక్కలతో నిండిన కొండలు వీటన్నిటి కలయికతో అది ఒక పవిత్ర స్థలంగా ఏర్పడింది.
ఏప్రిల్ లో ఎనిమిది రోజుల పాటు జరిగే మకర సంక్రమణ పర్వదినాలు, నవరాత్రి ఉత్సవాలు, నందిని నదిగా అవతరించిన మాఘ శుద్ధ పూర్ణిమ, వినాయక చవితి, కృష్ణ జన్మాష్టమి, కదిరు హబ్బ, లక్ష దీపోత్సవం లాంటి పండుగలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
ఇక్కడి ఆలయ ట్రస్ట్ అనేక విద్యా సంస్థలని నడుపుతుంది, అంతేకాక అన్నదానం, యక్షగానం లాంటి జానపద కళల నిర్వహణకు కూడా ప్రోత్సహిస్తుంది.