కేరళ రాజధాని తిరువనంతపురం (పూర్వపు త్రివేండ్రం) దగ్గరలో ఉన్న ప్రసిద్ధ సముద్ర తీర పట్టణం కోవలం. అరేబియన్ మహా సముద్రానికి అభిముఖంగా ఈ పట్టణం నెలకొనిఉంది. తిరువనంతపురం ప్రధాన నగరానికి ఈ తీరం ఎంతో దూరంలో లేదు, నగరం నడిబొడ్డు నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అందమైన కోవలం తీరానికి చేరుకోవచ్చు.
‘కొబ్బరిచెట్ల తోపు’ అనే అర్ధం వచ్చే కోవలం అనే మలయాళ పదం నుంచి ఈ పేరు వచ్చింది. పుష్కలంగా కొబ్బరిచెట్ల తోపులున్న ఈ నగరానికి ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ‘భూమి మీద స్వర్గం’ గా పిలువబడే కాశ్మీర్ లాగా కోవలం ‘దక్షిణాది స్వర్గం’ గా పిలువబడుతుంది.
కోవలం సంస్కృతిక వారసత్వం
ఈ నగరానికున్న చరిత్ర దృష్ట్యా చరిత్ర ప్రేమికులు ఈ నగరాన్ని విరివిగా సందర్శిస్తారు. 1920 లలో ట్రావెన్కోర్ ను పరిపాలించిన మహారాణి సేతు లక్ష్మీ బాయి తనకోసం ఇక్కడ ఒక తీర విహారకేంద్రం నిర్మింప చేసుకున్నాక కోవలం మొదటిసారిగా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. హాల్సియన్ కాజిల్ గా పిలువబడే ఈ విహారకేంద్రం ఇప్పటికీ కోవలం లో ఉంది.
మహారాణి మేనల్లుడు, ట్రావెన్కోర్ మహారాజు ఈ తీర నగరాన్ని నిత్యం సందర్శించి స్థానిక కళలకు పోషకుడయ్యాక కోవలం మరోసారి ప్రాముఖ్యంలోకి వచ్చింది, అయితే, ట్రావెన్కోర్ సంస్థానానికి వచ్చే యూరోప్ దేశాల అతిధుల వల్ల ఈ నగరం బాగా ప్రసిద్ది పొందింది. 1930 లు వచ్చేసరికి యూరోప్ దేశాలనుండి వచ్చే యాత్రికులకు ఇది ప్రసిద్ధ తీర విహరకేంద్రం అయింది.
1970 ప్రాంతాలలో హిప్పీ లు తమ కార్యకలాపాలకు దీన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడంతో కోవలం చరిత్రలో ఒక ప్రధాన ఘట్టాన్ని చూసింది. శ్రీలంక లోని సిలోన్ కి వెళ్తున్న హిప్పీ యాత్రలో భాగంగా అనేకమంది హిప్పీలు దారిలో కోవలం లో దిగారు, స్దబ్దుగా చేపలు పట్టుకునేవారి స్థావరంగా ఉండే కోవలం హఠాత్తుగా పెద్ద పర్యాటక కేంద్రం అయిపొయింది. ఇప్పటికీ ప్రతి ఎడాదికీ, రెండేళ్లకీ ఈ నగరాన్ని సందర్శించే యూరోపియన్, ఇస్రాయలీ యాత్రికులు ఉన్నారు.
సముద్రతీరాల నగరం
ఈ నగరం అందం అంతా దాని తీరలలోనే ఉంది. మెల్లగా అలలు ఎగసిపడుతుండగా వెచ్చని ఇసుకమీద తీరం వెంబడి నడవడం జీవితంలో ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. “అందమైన వస్తువు ఎప్పటికీ ఆనందాన్ని ఇస్తుంది” అనే నానుడిని అర్ధం చేసుకోవాలంటే మీరు కోవలం లో బీచ్ లు చూడాల్సిందే. చిక్కటి పచ్చదనం, ప్రశాంతమైన నీలిరంగుల మిశ్రమం మీ హృదయానికి హత్తుకొనేంత అందంగా ఉంటుంది.
కోవలం లో మూడు ప్రధాన తీరాలు ఉన్నాయి. వీటిని చూడడానికి తెల్లవారుఝామున కానీ, బాగా సాయంత్రం గానీ వెళ్ళాలి – అలా అయితే ఇక్కడి అందమైన సూర్యోదయ, సూర్యస్తమయాలని మీరు ఆస్వాదించ గలుగుతారు. కోవలం లోని తీరాలలో ఉండే ఇసుక రంగు చాలా విశిష్టతతో కూడినది. ఇక్కడి ఇసుక కొద్దిగా నల్లగా ఉంటుంది. మోనజైట్, ఇల్మేనైట్ ల ఉనికివల్ల ఈ లక్షణం ఏర్పడిందంటారు.
ఈ మూడు తీరాలూ పక్కపక్కనే ఉండి 17 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగిఉన్నాయి. ఈ మూడు తీరాలను పెద్దపెద్ద రాళ్ళూ విభజిస్తాయి. ఒక తీరం నుండి మరోదానికి వెళ్ళేటపుడు యాత్రీకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాళ్ళు జారుడుగా ఉండడం వల్ల ఒక్క తప్పటడుగు కూడా మీ విహారయత్రను పాడుచేయగలదు. లైట్ హౌస్ తీరం, హవా తీరం, సముద్రా తీరం అనే మూడు తీరాలు ఉన్నాయి. కోవలం వెళ్ళినపుడు ఈ మూడు తీరాలను చూడాల్సిందే. ఎందుకంటే దేని అందం దానిదే.
ఈ మూడు తీరాలలో లైట్ హౌస్ బీచ్ అన్నిటికంటే పెద్దది. ఇక్కడ కురుమ్కల్ కొండమీద 35 మీటర్ల ఎత్తున్న లైట్ హౌస్ ఉండడం వల్ల ఈ తీరానికి ఆ పేరు వచ్చింది. రెండవ అతి పెద్ద బీచ్ హవా బీచ్ లో అర్ధనగ్న సూర్య స్నానాలు చేసేవారు కాబట్టి ఈ తీరానికి ఆ పేరువచ్చింది. ఈ తీరంలో ప్రధానంగా యూరోపియన్ స్త్రీలు అర్ధనగ్నంగా కనబడతారు. ఆసక్తికరమైనది ఏమిటంటే భారతదేశంలో అర్ధనగ్న సూర్యస్నానాలకు అవకాశం ఉన్న ఏకైక బీచ్ ఇది. అయితే, నగ్నంగా సూర్య స్నానం చేయడం ఈ తీరంలో ఇప్పుడు నిషేధించారు. ఇపుడు కేవలం ప్రైవేట్ విహారకేంద్రాలు మాత్రమే అర్ధనగ్న స్నానాలను, సూర్య స్నానాలను అనుమతిస్తున్నాయి, ఇందుకోసం వారు పెంచిన కొబ్బరి చెట్ల తోపులలోకి ఇతరులకు ప్రవేశం లేదు. లైట్ హౌస్ తీరానికి, హవా తీరానికి అత్యధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు.
తీరానికి ఉత్తర భాగంలో సముద్రా బీచ్ ఉంది. తొలినాళ్ళలో యాత్రికులు పెట్టిన వ్యవహార నామం సముద్రా తీరం. దురదృష్టవశాత్తూ ఇతర రెండు తీరాల లాగా దీనికి ఎక్కువ మంది యాత్రికులు రారు. అందువల్ల జాలర్లు ఈ తీరం వెంట చేపలు పడుతూ ఉంటారు.
కోవలం తీరం వెంట ఈ మూడూ కాక అశోక బీచ్ అనేపేరుతో ఇంకో తీరం కూడా ఉంది. సముద్రా తీరం లాగే ఇక్కడికీ ఎక్కువ మంది యాత్రికులు రారు. హనీమూన్ కి వచ్చేవారు, గోప్యత కోరుకునేవారు ఈ తీరం వెంట తిరుగుతూ కనపడతారు.
సెప్టెంబర్ నుండి మే వరకు ఈ తీరాలలో యాత్రికుల సందడి కనిపిస్తుంది.