కర్నాటక లోని చిక్కమగళూరు జిల్లాలో కుద్రేముఖ్ ఒక పర్వత శ్రేణి. ఇది పడమటి కనుమలలో ఒక భాగంగా ఉంటుంది. కుద్రేముఖ్ ప్రాంతం బాగా ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్ కూడాను. పచ్చటి ప్రదేశాలు, దట్టమైన అడవులు కలిగి ఎంతో జీవ వైవిధ్యతకల ప్రాంతం. పచ్చటి ప్రదేశాల పర్యటన
కుద్రేముఖ్ నేషనల్ పార్క్ పడమటి కనుమల ప్రాంతంలో రక్షణ కల రెండవ ప్రదేశం. ఈ పార్క్ షుమారుగా 600 చ. కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్నో పచ్చిక బయళ్ళు, దట్టమైన పచ్చటి ప్రదేశాలు కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం ఏటా షుమారుగా 7000 మి.మీ. వర్షపాతం కలిగి ఉంటుంది. కనుక ఇక్కడి ప్రదేశాలలో నీటి నిల్వలు అధికంగా ఉంటాయి. నిరంతరం ప్రవహించే ఎన్నో వాగులు వంకలు కలిగి తుంగ, భద్ర మరియు నేత్రావతి నదులు ఏర్పడతాయి.
చల్లటి వాతావరణం, దట్టమైన పచ్చదనం, వివిధ రకాల చెట్లు కలిగి ఎన్నో జంతువులకు నిలయంగా ఉంటుంది. చిరుత, పులి, లేడి, ఉడుతలు, అడవి పందులు, ముళ్ళపందులు, అడవి ఎలుగుబంటి, ముంగీస మొదలైనవి సంచరిస్తూ ఉంటాయి. క్రూర జంతువులు, పులి, చారల పులి, నక్కలు, అడవి కుక్కల వంటివి కూడా అడవులలో సంచరిస్తాయి.
కుద్రేముఖ్ ను పర్యాటకులు ఎందుకు ఇష్టపడతారు? కుద్రేముఖ్ పట్టణ సమీపంలో అనేక సందర్శనా ప్రాంతాలున్నాయి. లక్ష్య డామ్, రాధా క్రిష్ణ మందిరం, గంగమూల కొండలు, హనుమాన్ గుండి జలపాతాలు వంటివి కలవు. హనుమాన్ గుండి జలపాతాలు 100 అడుగుల ఎత్తునుండి సహజ రాళ్ళ మధ్యనుండి ప్రవహిస్తాయి. కుద్రేముఖ్ సందర్శకులకు ఈ ప్రదేశం ఒక వినోద యాత్రా స్ధలంగా ఉంటుంది.
కుద్రేముఖ్ ప్రాంతం తన సహజ అందాలతో వివిధ రకాల ట్రెక్కింగ్ మార్గాలకు అనువుగా ఉంటుంది. అయితే ట్రెక్కింగ్ చేయకోరేవారు ముందుగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి. కుద్రేముఖ్ లో ట్రెక్కింగ్ లోబో ప్లేస్ నుండి మొదలవుతుంది. అడవిలో కుద్రేముఖ్ కొండ ఇక్కడినుండి మొదలవుతుంది. ఈ ప్రదేశం సైమన్ లోబో అనే వ్యక్తికి చెందినది. దాని యాజమాన్యం ఎంతోకాలం కిందటే మారినప్పటికి అతని పేరు కొనసాగుతోంది. వివిధ కొండ మార్గాలు, నీటి వాగులు, అటవీ అందాలు కన్నులకు విందు చేస్తూ ఉంటాయి.
ఈ ప్రాంత పర్యావరణం ఎంత మార్పు చెందినప్పటికి కుద్రేముఖ్ సందర్శన నేటికి ఎంతో ఆనందంగా ఉంటుంది. విశ్రాంతి పొందేందుకు ఎంతో గొప్ప ప్రదేశం. సాహస క్రీడలు చేయాలనుకునేవారికి అనువైన ప్రదేశంగా చెప్పాలి. ఒక్కసారి అటవీ శాఖ అనుమతులు పొందారంటే పర్యాటకులు, యాత్రికులు వారి కిష్టమైన రీతిలో సంచరించి తనివి తీరా సహజ అందాలను ఆస్వాదించవచ్చు.