కచ్ అనగా సంస్క్రుతం లో ద్వీపము అని అర్ధం.పూర్వ కాలం లో "రణ్" లు గా పిలవబడే కచ్ ఎడారులు సముద్రంలోనికి ప్రవహించే ఇండస్ నది మూలంగా ముంపుకు గురయ్యాయి. అందువల్ల ఈ ప్రదేశం వేరు పడి నీటి తో నలుపక్కలా కప్పివేయబడటం వల్ల ద్వీపంగా ఏర్పడింది. 1819 లో వచ్చిన భూకంపం తెచ్చిన మార్పుల వల్ల ఇండస్ నది పశ్చిమ దిశగా ప్రవహించటం మొదలయ్యి ఈ "రణ్" ల లో ఉప్పు నీటి మేటలు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఈ "రణ్" లు చిత్తడి గా ఉండే ఉప్పు నీటి కయ్యలుగా ఏర్పడ్డాయి. వీటిల్లో వేసవి కాలం లో నీరు ఎండిపోవటం వల్ల మంచు వలే తెల్లగా మెరుస్తూ ఉంటాయి.
చరిత్ర
ఖాదిర్ ప్రాంతం నుండి తవ్వకాలలో వెలికితీయబడ్డ హరప్పా కళాక్రుతులు పురాతన భారతదేశంలో "కచ్" ఉండేదని నిరూపిస్తున్నాయి. ఈ కచ్ రాజ్యాన్ని సింధ్ రాజపుత్రులు ఆ తరువాత జడేజా రాజపుత్ర వంశానికి చెందిన ఒకటవ రాజా ఖేంగర్జి పరిపాలించారు. భుజ్ కచ్ రాజ్యానికి రాజధాని. 1741 లో మొఘలుల కాలంలో "లఖ్ పత్ జీ"కచ్ కు రాజుగా నియమితులయ్యారు. అప్పుడే ప్రసిద్ధి చెందిన "ఆయినా మహల్" నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడమైనది."లఖ్ పతి జి" కవులు,గాయకులు,న్రుత్య కారులని బాగా ఆదరించారు. ఈ సమయం లోనే కచ్ సాంస్క్రుతికం గా అన్నిరంగాలలో వర్ధిల్లింది.
1815 లో బ్రిటీషు వారు భుజియో దుంగార్ కొండని ఆక్రమించుకోవటంతో కచ్ బ్రిటీష్ రాజ్యంలో భాగమయ్యింది. "రంజిత్ విలాస్ ప్యాలెస్","విజయ్ విలాస్ ప్యాలెస్" బ్రిటీష్ హయాంలో కచ్ లో నిర్మించబడ్డాయి. కచ్ రాచరికపు రాష్ట్రం అవ్వడం వల్ల బ్రిటీష్ హయాంలో చాలా అభివ్రుద్ధి పనులు జరిగాయి. ఈ అభివ్రుద్ధి కచ్ స్వతంత్ర్య భారత దేశంలో భాగమయ్యేంతవరకూ కొనసాగింది.
"భౌగోళికత"
కచ్ ఎడారికి ఆవల వైపున జీవావరణంలో ముఖ్యమైన "బన్ని గడ్డి భూములు" ఉన్నాయి. కచ్ కి దక్షిణాన "కచ్ సంధి",పశ్చిమాన "అరేబియా సముద్రం" ఉన్నాయి. కచ్ తూర్పు ఉత్తర దిశలలో పెద్ద మరియు చిన్న ఎడారులు(రణ్ లు )ఉన్నాయి. ఈ రణ్ లు తడి భూములు. కచ్ లో ముఖ్య నౌకాశ్రయాలైన "కాండ్లా" మరియు "ముంద్ర" ఉన్నాయి. ఇవి "గల్ఫ్" మరియు "యూరోప్" కి సముద్ర మార్గం ద్వారా బాగా దగ్గర.
"సంస్క్రుతి"
కచ్ లో ఎక్కువగా "కుచ్చి" భాషని ఉపయోగిస్తారు. ఇంకా కొంతవరకూ "గుజరాతి","సింధి" మరియు "హింది" కూడా మాట్లాడతారు."కుచ్చి" భాష లిపి కనుమరుగవ్వడం వల్ల ప్రస్తుతం గుజరాతీ లిపి ఉపయోగిస్తున్నారు. కచ్ లో అనేక రకాల కులాలు,వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. కచ్ పక్కనే ఉన్న "మార్వార్","సింధ్" మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల నుండి వచ్చిన వలసదారులు కచ్ ప్రజలతో కలియడం వల్ల ఇన్ని రకాల వర్గాలు ఏర్పడ్డాయి.
ఇలాంటి అసాధారణ సాంస్క్రుతిక వైవిధ్యాన్ని,అసమానమైన భౌగోళిక పరిస్థితులని చూడటానికి ప్రతీ ఒక్కరూ తప్పక గుజరాత్ లోని ఈ ప్రదేశాన్ని సందర్శించాలి.