సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనికి “ఆఖరి శాంగ్రి లా” ( ది లాస్ట్ శాంగ్రి లా) , “ చిట్టి టిబెట్” ( లిటిల్ టిబెట్), “ చంద్ర ప్రదేశం” ( ది మూన్ ల్యాండ్), “ విరిగిన చంద్రుడు” ( ది బ్రోకెన్ మూన్) అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రధాన నగరం లెహ్ కాకుండా, ఇక్కడికి సమీపంలో అల్చి, నుబ్రా లోయ, హేమిస్, లమయురు, జంస్కర్ లోయ, కార్గిల్, పంగోంగ్ త్సో, త్శో కర్, త్సో మొరిరి లాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు, ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు. ఈ రాష్ట్రం లోని సాధారణంగా మాట్లాడే భాషలు లడఖి, పురిగ్, టిబెటన్, హిందీ మరియు ఇంగ్లీష్ .
ప్రపంచం లోనే రెండు ప్రముఖ పర్వత శ్రేణులైన కారకోరం మరియు హిమాలయాల నడుమ,సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్ల ఎత్తులో లడఖ్ కొలువుదీరింది. అదనంగా, సమాంతర శ్రేణులైన జంస్కర్, లడఖ్ పర్వత శ్రేణులు కూడా లడఖ్ లోయని చుట్టుముడుతున్నాయి. లడఖ్, నిజానికి, ఒక పెద్ద సరస్సులో మునిగిన ప్రదేశమని, ఏళ్ల పాటు జరిగిన వివిధ భౌగోళిక మార్పుల వల్ల ఇది లడఖ్ లోయ గా మారిందని నమ్ముతారు.
ఈనాడు జమ్మూ & కాశ్మీర్ లోని భాగమైన లడఖ్, 10 వ శతాబ్దంలో టిబెట్ రాజుల వారసులచే పాలించబడింది. ఈ హిమాలయ రాజ్య పాలన, సేంగ్గే నంగ్యాల్ రాజు కాలంలో 17వ శతాబ్దంలో పతాక స్థాయికి చేరుకుంది.
బౌద్ధం ఇక్కడి ప్రబలమైన మతం కావటం వల్ల, లడఖ్ ఆకర్షణల జాబితాలో బౌద్దారామాలు లేదా గొంపలు ప్రధానంగా చోటు చేసుకుంటాయి. హేమిస్ ఆరామం, శంకర్ గొంప, మాతో ఆరామం,షే గొంప, స్పితుక్ ఆరామం, స్టంకా ఆరామం ఈ ప్రదేశంలోని కొన్ని ముఖ్యమైన ఆరామాలు. ఇవి కాకుండా, తిక్సీ ఆరామం, త్సేమో ఆరామం కూడా దర్శనీయమైనవే.
గల్దన్ నమ్చోట్, బుద్ధ పూర్ణిమ, దోస్మోచే మరియు లోసార్, లడఖ్ లోని ఘనంగా జరుపుకునే పండుగలు. ఈ సమయంలో యాత్రికులు ఇబ్బడి ముబ్బడిగా ఇక్కడికి చేరుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే దోస్మోచే ఉత్సవం లో సన్యాసులు నృత్యం చేసి, పూజలు అందించి, క్రతువులు నిర్వహించి దురదృష్టాన్ని, దురాత్మలని ఈ ప్రదేశం నుంచి దూరంగా తరిమి కొడతారు. టిబెట్ బౌద్ధుల అత్యంత ముఖ్యమైన పండగలలో ఒకటైన శక దావా లో గౌతమ బుద్దుని జననం, అతని బౌద్ధత్వం, అతని భౌతిక శరీర మృతిని జరుపుకుంటారు. ఇది టిబెట్ క్యాలెండర్ నాల్గవ నెలలో , సాధారణంగా మే లేక జూన్ లలో, ఒక నెల రోజుల పాటు ఉంటుంది.
యాత్రికులు టాక్సీలను గానీ ,అద్దె బైక్ లనుగానీ ఉపయోగించి ఈ ప్రదేశంలో తిరగవచ్చు. ఇక్కడికి వచ్చే ప్రజలు, సౌకర్యంగా ఉంటుందని, సాధారణంగా స్వంత వాహనాల్లో వస్తారు. ఈ ప్రాంత ఉపరితలం ఎగుడు దిగుడులతో గరుకుగా ఉండటం వల్ల, యాత్రికులు వాహన విడి భాగాలను తీసుకుని వెళ్తే అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడతాయి. తుప్కాలు, సూప్ నూడుల్స్, మోమోలు, డంప్లింగులు వడ్డించే ఎన్నో భోజనశాలలు ఈ ప్రదేశంలో ఉన్నాయి.
పర్యాటకులు, మే మరియు సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా, లడఖ్ పర్యటనకు ప్రణాళిక తయారు చేయవచ్చు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు మించవు.