రద్దీగా ఉండే ముంబై నగరజీవితం నించి చక్కటి ఆటవిడుపుని అందించే లోనావాలా మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధ పర్వత ప్రాంతం. సముద్ర మట్టానికి 625 మీటర్ల ఎత్తున ఉండే ఈ పర్వత ప్రాంతం అద్భుతమైన సహ్యాద్రి శ్రేణిలో భాగమై, 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒప్పారుతోంది. లోనావాలా పూణే నించి 64 కిలోమీటర్లు, ముంబై నించి 89 కిలోమీటర్ల దూరంలో ఉంది.
‘గుహలు’ అని అర్ధం వచ్చే లోనావ్లి అనే సంస్కృత పదం నించి లోనావాలాకు ఆ పేరు వచ్చింది. లోనావాలా అనే పదాన్ని, రాతి నించి చెక్కిన విశ్రామ స్థలం అని అర్ధం వచ్చే ‘లోన్’ అని; వరుస అనే అర్ధంవచ్చే ఆవళి అని రెండు భాగాలుగా విభజించవచ్చు. పురాతనకాలంలో ఇప్పటి లోనావాలాని యాదవ రాజులూ పరిపాలించారు, తరువాత మొఘలాయిలు చేజిక్కించుకుని ఈ ప్రాంతపు వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి చాలాకాలంపాటు దీన్ని తమ పాలనలోనే ఉంచుకున్నారు. 1871 లో బాంబే గవర్నర్ గా పనిచేసిన సర్ ఎల్ఫిన్ స్టన్ దట్టమైన అడవిగా ఉండి, కేవలం కొద్దిమంది మాత్రమే నివాసం ఉంటున్న లోనావాలాను కనుగొన్నాడు.
నగరంలోని రణగొణ ధ్వనులకు దూరంగా ఏడాది పొడవునా ఉండే అకలుషితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే లోనావాలా ఆరోగ్య కేంద్రంగా కూడా ప్రసిద్ది పొందింది. దేశవిదేశాల నించి అసంఖ్యాకులైన యాత్రికులను లోనావాలా ఆకర్షిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
సహ్యాద్రికి ఆభరణం
సహ్యద్రికి ఆభరణంగా పిలువబడే లోనావాలా పర్వహతారోహకులకు మంచి యాత్ర స్థలం. అది కాకుండా ఇక్కడ చాలా చారిత్రక కోటలు, పురాతన గుహలు, నిర్మలమైన సరస్సులు ఉన్నాయి. హాయిగొలిపే ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా యాత్రీకులను స్వాగతిస్తుంది. ఒకవైపు దక్కన్ పీఠ భూమిని, మరోవైపు కొంకణ్ తీరాన్ని అందంగా చూపిస్తుంది లోనావాలా. ఈ అందమైన దృశ్యాలు చూడటానికి వర్షాకాలానికి మించిన సమయం ఏముంటుంది! జాలువారే జలపాతాలు, పరచుకున్న పచ్చదనంతో ప్రకృతి ఇక్కడ చాలా రమణీయంగా ఉంటుంది.
మీరు ఒక ప్రశాంతమైన సాయంత్రం గడపాలి అనుకు౦టే, పావనా, వలవాన్, తుంగర్లి సరస్సులు లేదా తుంగర్లీ జలాశయం సందర్శించండి. మీరు పర్వతారోహణ లేదా పురాతన భారతీయ నిర్మాణాలను ఇష్టపడే వారైతే తుంగ్, తిలోనా, లోహ ఘడ్(ఆసక్తికరంగా లోహ గృహం అనే పదం నించి పుట్టింది) కోటలను చూడండి. కర్జాత్ వద్ద మాలిక్ అహ్మద్ చేజిక్కించుకున్న తుంగ్ కోట తన సహజసిద్ధమైన బలానికి ప్రసిద్ది పొందింది.
ఎత్తైన, పచ్చటి చెట్లుగల రైవుడ్ పార్క్ లోనావాలాలో పెద్ద ఉద్యానవనం. ఇక్కడి విశాలమైన మైదానంలో ఆడుకోవడాన్ని పిల్లలు ఇష్టపడతారు. సరదాలు పంచే మరో ప్రదేశం శివాజీ ఉద్యాన్.
అయితే, మీరు ప్రకృతి వ్యాహ్యాళికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం రాజమాచి అభయారణ్యం ఉత్తమం. రాజమాచి పాయింట్ నించి అదే పేరుగల శివాజీ మహారాజు నిర్మించిన ప్రసిద్ధ కోటను, చుట్టూ ఉండే లోయను చక్కగా చూడవచ్చు. ఇక్కడ ఉన్పుడు ప్రసిద్ధ వాఘ్ జాయి చూడటం మరువకండి, అలాగే లోనావాలా లో ప్రత్యేకంగా తయారయ్యే చిక్కీ అనే గట్టి మిఠాయిని కూడా రుచిచూడండి.
మీ ఇంద్రియాలను చల్లబరిచే చల్లటి వాతావరణం ఉండే అక్టోబర్ నించి మే నెల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం. అయితే చాలా మంది లోనావాలాను వర్షాకాలంలోనే చూడడానికి ఇష్టపడతారు. ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా, హాయిగొలిపే వాతావరణం లోనావాలా సొంతం. ఈ పర్వత ప్రాంతం అందించే ఆనందాన్ని అందుకోవడానికి మీ బట్టలు సర్దుకుని ఇక్కడికి వెంటనే ప్రయాణం కట్టండి.
నగరం నుంచి ఉత్తమమైన ఆటవిడుపు
ముంబై, పూణేల నించి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉండే లోనవాలాకు వాయు, రైలు, రోడ్డు మార్గాలద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. ముంబై, పూణేలను కలిపే రైలు మార్గంలో ఇది ప్రధాన స్టేషన్. ముంబై, పూణే రోడ్డు రహదారిలోనూ, ఎక్స్ ప్రెస్ రహదారిలోనూ కూడా లోనావాలా తగులుతుంది. మీరు విమానంలో వచ్చేట్టైతే, లోనావాలాకు దగ్గరి విమానాశ్రయం పూణే.
చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కలుషితం కాని గాలి లోనావాలాను మంచి విహార కేంద్రంగా తయారుచేసాయి. పర్యాటకులు జలపాతాల వెంట నడుస్తూ, పచ్చిక బయళ్ళలో సేద తీరుతూ లేదా లోనావాలా చుట్టుపక్కల పర్వతారోహణ చేస్తూ కాలక్షేపం చేయవచ్చు. లోనావాలాలో చాలామంది రెండో ఇల్లు కొనుక్కుని నగర జీవితానికి దూరంగా విహార స్థలంగా మార్చుకుంటున్నారు. ఈ స్వర్గపు తునకకి చేరేదాకా మీరు ఏం కోల్పోతున్నారో మీకు తెలీదు.