ట్రెక్కింగ్కు సిద్ధమయ్యేముందు ఈ విషయాలు మర్చిపోవద్దు!
కష్టతరమైన శిఖరాలను అధిరోహించడానికి కొందరు పర్యాటకులు నిత్యం ఉత్సాహంతో ఉంటారు. సాహసోపేతమైన క్రీడల్లో ట్రెక్కింగ్ ఒకటి. దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ, తగు జాగ్రత్తలు తీసుకుంటే మర్చిపోలేని అనుభూతి మీ సొంతం. అలా శిఖరాగ్రం చేరుకునే పర్వతారోహకుల ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. మన దేశంలో ట్రెక్కింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలుగా చాలానే ఉన్నాయి. అయితే, పచ్చదనంతో కూడుకున్న సుందరమైన ప్రకృతి వెనుక అపాయాలు పొంచి ఉంటాయి. అందుకే, ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవడం చాలా అవసరం. మరెందుకు ఆలస్యం ట్రెక్కింగ్ ప్రియుల సాహసయాత్రలో ఎలాంటి విషయాలు తప్పకుండా పాటించాలో చూద్దాం.
- ముఖ్యంగా సాహసయాత్రకు సిద్ధమైన ట్రెక్కింగ్ ప్రియులు శిఖరాలపైకి వెళ్లే సమయంలో బండలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తేమ ప్రాంతాల్లో నాచుపట్టి ఉండడం వల్ల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది. అంచేత వేసే ప్రతి అడుగు దృఢంగా ఉండాలి.
- ట్రెక్కీలు వెళ్లే మార్గంలో ఎండిపోయిన చెట్లు, బలంలేని రాళ్లు, విష సర్పాలు, తేళ్లు ప్రధాన సమస్య. పచ్చటి పచ్చిబీళ్ళలో అదే రంగులో సంచరించే విషసర్పాలు ఎక్కువగా తారసపడతాయి. ఇవి ట్రెక్కింగ్కు ఆటంకాలు కలిగిస్తాయి.
- ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఓ చిట్కా ఉంది. అది ఏంటంటే, మనిషి అడుగుల చప్పుడు వినిపిస్తే కొంతవరకూ క్రిమికీటకాలు, సర్పాలు దూరంగా వెళ్ళిపోతాయి. అంచేత చిన్నగా శబ్దాలు వచ్చే ట్రెక్కింగ్ షూ మార్గెట్లో అందుబాటులో ఉన్నాయి. సాహసయాత్రలో అవి వినియోగిస్తే లాభదాయకంగా ఉంటుంది.
- అలాగే, నీరు, ఆహార నిల్వల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎత్తయిన ప్రదేశాలలో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు, ట్రెక్కింగ్ సమయంలో శరీరంలోని నీరు చెమట రూపంలో ఎక్కువ శాతం బయటకు పోతుంది. ఎప్పటికప్పుడు తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉన్నంతవరకూ నీటిని ఎక్కువ మొత్తంలో తీసుకువెళ్లాలి.
- లగేజ్ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన వస్తువులను వీలైనంత వరకూ తీసుకువెళ్లకపోవడమే మంచిది. అధిక లగేజ్ కారణంగా గమ్యస్థానం చేరుకోకముందే మీ శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే, ఏ చిన్న అవసరమైన వస్తువూ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా ఫైర్ క్యాంపుల కోసం అవసరమైన థింగ్స్ విషయంలో మరింత అప్రమత్తత అవసరం.
- ఎండింగ్ పాయింట్ చేరుకునేవరకూ వెళ్లే మార్గం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగిన భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. అంచేత రూట్ మ్యాపు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి. అంచేత, టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా మాన్యువల్ మ్యాప్ను ఫాలో అవ్వాలి.
- ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవారు బృందాలుగా విడిపోవాలి. అలా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించేవారిని అనుసరించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బృందంలో చర్చలు జరుపుతూ ఉండాలి. మన దేశంలో ప్రధానంగా ఉత్తరాది పర్వతాల్లో ట్రెక్కింగ్ అనుభూతి కలకాలం గుర్తుండిపోతుంది. మరింకెందుకు ఆలస్యం మీరూ ట్రెక్కింగ్కు రెడీ అయిపోండి..!