కాశీ ప్రయాణానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ!
హిందువుల ప్రధాన దైవక్షేత్రంగా పేరొందిన కాశీ ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదిగా భావిస్తారు చాలామంది. అలాంటివారికోసం ఐఆర్సీటీసీ ఓ మంచి ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వారణాసికి ఐదురోజుల టూర్కుగానూ పదిహేను వేల రూపాయలలోపే ప్యాకేజీని అందిస్తోంది. కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు, పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించాలనుకునేవారు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. నిజంగా, కాశీకి వెళ్లాలనుకునే భక్తులకు ఇది గొప్ప శుభవార్తనే చెప్పాలి.
ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'మహాలయ పిండ దాన్' పేరుతో రైల్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఐదు రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో వారణాసి, ప్రయాగ్ సంగం, గయ ప్రాంతాలను చుట్టేయవచ్చు. 2022 సెప్టెంబర్ 15న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు వారణాసి టూర్ (Varanasi Tour) సాధారణ ప్యాకేజీ ధర రూ.14,485 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.18,785. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, హోటల్లో వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటి సౌకర్యాలను కల్పించారు.
ప్రయాణం ఇలా సాగుతుంది..!
ఐఆర్సీటీసీ టూరిజం 'మహాలయ పిండ దాన్' టూర్ మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున సికింద్రాబాద్లో రైలు బయలుదేరుతుంది. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్లో రైలు ఎక్కొచ్చు. రెండో రోజు వారణాసి చేరుకుంటారు. గంగా నదిలో స్నానాలు, సైట్సీయింగ్, కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి, కాళ భైరవ ఆలయాల సందర్శన ఉంటుంది.
సాయంత్రం సంధ్యా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి. మూడో రోజు ఉదయం వారణాసి నుంచి ప్రయాగ్రాజ్ బయలుదేరాలి. నాలుగో రోజు ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. త్రివేణి సంగంలో స్నానాలు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తి పీఠ్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత శృంగవెన్పూర్ బయల్దేరాలి. రామాయణానికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించొచ్చు. ఆ తర్వాత గయ బయల్దేరాలి. ఐదో రోజు గయ చేరుకుంటారు. అక్కడ విష్ణుపాద ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత బోధగయకు బయలుదేరాలి. ఆ తర్వాత గయ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు పర్యాటకులు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు అనేక టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.