మనదేశంలో చరిత్ర కలిగిన పురాతన కోటలు చాలానే ఉన్నాయి. అలాంటి కోటలు వాటి అందాలతో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కోట పైనుంచి చూస్తే పాకిస్తాన్ అంతా కనపడుతుంది. కోటపై అడుగుపెట్టిన తర్వాత నిత్యం యుద్ధ వాతావరణం కనిపించే పొరుగుదేశమైన పాకిస్తాన్ను నేరుగా కళ్లతో చూడడమనేది ఒక్క ఈ ప్రాంతానికే సాధ్యమయిందని చెప్పొచ్చు.
పర్వతాల మధ్య ఉన్న ఈ కోటను చూడ్డానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. అదే జోధాపూర్లోని మెహరానాఘడ్ కోట. జోధాపూర్లో ఉన్న ఈ కోట ఢిల్లీలోని కుతుబ్మీనార్ కంటే ఎత్తులో ఉంది.
మనదేశం నుంచే పాకిస్తాన్ని చూద్దామా?!
ఈ పురాతన చరిత్ర కలిగిన కోట గురించి మరిన్ని విషయలు తెలుసుకుందాం.
రాజస్థాన్లోని జోధ్పూర్లో పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోటలో వేసే ప్రతి అడుగు జీవితంలో మరిచిపోలేని గొప్ప క్షణంగానే మిగిలిపోతుంది. మెహరాన్ గఢ్ కోట 120 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. అందుకే, దీనిని కుతుబ్మనార్ కంటే అతి ఎత్తయిన కోట అన్నారు. ఎత్తయిన బాల్కనీలతో విశాలమైన హాల్లు కలిగి ఈ కోటలో కింది భాగంలో సంగీత సాహిత్య విభావరి జరిగే సందర్భంలో కోట పై భాగంలోంచి మహారాణులు, రాచకన్యలు పరదాల చాటున వీక్షించేవారట! 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోట పైనుంచి చూస్తే పాకిస్తాన్ అంతా కనిపిస్తుంది. ఈ కోట లోపలికి వెళ్లిన వారిని వెతకడం చాలా కష్టం. అదే ఈ కోటలోని ప్రత్యేకత.
ఆకట్టుకునే నిర్మాణ శైలి..
సాంప్రదాయబద్ధంగా చెక్కిన ఈ మహాల్ నిర్మాణశైలిలో మరో ప్రత్యేకత ఏమిటంటే, మహాల్ పై భాగంలో గ్లాస్ బాల్స్ను అమర్చారు. అందుకే ఈ మహాల్లోకి ప్రవేశిస్తే అడుగడుగునా మన ప్రతిబింబం కనిపించడంతో తియ్యటి అనుభూతికిలోను కావొచ్చు. ఈ కోటలో గోడలు పదికిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కోట ఎత్తు 20 నుంచి 120 అడుగులు ఉంటుంది. ఈ కోటలో స్పైరల్ రోడ్లకు అనుసంధానంగా నాలుగు ద్వారాలు ఉన్నాయి. దారి మధ్యలో ఏడు అరక్షిత కోటలు ఉన్నాయి. కోటలోపల గ్రాండ్ మహాల్, అద్భుతంగా చెక్కబడిన తలుపులు, జలీదార్ కిటికీలను తిలకించవచ్చు. ఈ కోట లోపల అందమైన మోతీమహల్, ఫూల్మహాల్, షీషామహాల్ ఉన్నాయి. ఈ కోటకు చేరువలోనే మహారాజ మాన్ సిన్హ్ భార్య గుర్తుగా సతీమందిర్ కూడా ఉంది.
జరుపుకోవడం ఆనవాయితీ
ఇక్కడ ఏటా దసరా ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే, 2008 సెప్టెంబర్ 30న చాముండిదేవీ ఉత్సవాలలో భక్తజన సందోహం కిక్కిరిసి పోయింది. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో సుమారు రెండువందల నలభై తొమ్మిది మంది మరణించడం, నాలుగు వందలమందికి పైగా గాయపడడం చరిత్రలో మరిచిపోలేని విషాదాంతం.