కనుచూపుమేర చుట్టూ మేటలు వేసిన ఇసుక దిబ్బలు.. మధ్యలో స్వచ్ఛమైన సరస్సును పెనవేసుకున్న ఓ పురాతన నగరం. వర్షాకాలం వచ్చిందటే, దేశవిదేశీ పర్యాటక ప్రేమికులు అక్కడికి వాలిపోతుంటారు. అదే బంగారు వర్ణపు ఇసుక రేణువుల సమ్మేళనం పుష్కర్. హొయలోలికించే ఒంటెల సఫారీకి కేరాఫ్ అడ్రస్గా పేరొందిన పుష్కర్ పర్యాటక విశేషాలు మీ కోసం..!
ఓ పురాతన నగరం.. పుష్కర్!
మన దేశంలోని పురాతన నగరాల్లో పుష్కర్ ఒకటి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 510 (1673 అడుగులు) మీటర్ల ఎత్తులో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో ఉన్న పుష్కర్ వర్షాకాలంలో ఎక్కువమంది పర్యాటకులని ఆకర్షిస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం.. దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుంటే ఇక్కడ మాత్రం ఒక మోస్తరుకు మించి వర్షపాతం నమోదు కాదు. పుష్కర్ సరస్సు చుట్టూ విస్తరించి ఉన్న ఈ నగర నిర్మాణం ఎప్పుడు మొదలైందన్నది చరిత్రకారులకు సైతం అంతుపట్టలేదు. ఉత్తర భారత దేశంలో ఉన్న హిందూ పవిత్ర తీర్థాలలో ఇదీ ఒకటి. ఈ నగరంలో అనేక హిందూ దేవాలయాల సముదాయాలు ఉన్నాయి. అయితే, కులమతాలకు అతీతంగా వర్షాకాలపు పర్యాటక ప్రదేశంగా పుష్కర్ పేరుగాంచింది.
తెన్నెల అందాలు..
పుష్కర్ని ఆనుకుని ఉన్న థార్ ఎడారిలో ఒంటె మీద ప్రయాణం కోసం ఎక్కువమంది సందర్శకులు ఆసక్తి చూపుతారు. అలా ఒంటె మీద సఫారీ చేస్తూ ఎడారి ఇసుక తెన్నెల అందాలను మనసారా ఆస్వాదించేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువైనది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆరావలి కొండ చరియల అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. ఒంటె సఫారీ సమయంలో అనుభవిజ్ఞులైన స్థానికులు సందర్శకులను నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇసుక తెన్నులపై వయ్యారుపోయే ఒంటెలపై ప్రయాణం అంటే జీవితంలో మరిచిపోలేని అనుభవమనే చెప్పాలి. పుష్కర్ ప్రాంతంలో ఏడాది పొడవునా సాగే సంతలు అదనపు ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. చుట్టుపక్కల పల్లెలనుంచి వచ్చే స్థానికుల వేషధారణ చూసేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. వరుసగా ఐదు రోజుల వరకూ సాగే సంతలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
సంత ప్రత్యేకం
దేశంలోనే అతి పెద్ద పెంపుడు జంతువుల సంతగా పేరొందిన ఈ సంతలో సుమారు యాభైవేలకుపైగా ఒంటెలను సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడకు తీసుకువస్తారు. చౌకైన ధరల్లో మేలు జాతుల రకాల ఒంటెలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఒంటెలను అలంకరించే పద్ధతి హైలేట్గా నిలుస్తుంది. వెండి పూసలతో ఒంటెలను అందంగా రెడి చేస్తారు. అందుకు అవసరమైన అలంకరణ వస్తువులు ఇదే సంతలో పదుల సంఖ్యలో ఏర్పాటు చేయబడే దుకాణాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ సంతల్లో జానపద నృత్యాలు, జానపద సంగీతం, గారిడీలు వంటి సాంస్కృతిక కార్య్రకమాలను తిలకిస్తూ ఆనందించవచ్చు. వీటితోపాటు ఒంటెలు, గుర్రాల పోటీలు అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. ఏటా ఆరువేల మంది వరకూ విదేశీ పర్యాటలకును ఈ సంతలు ఆకర్షిస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మరెందుకు ఆలస్యం.. మీ ఎడారి ప్రయాణాన్ని మొదలు పెట్టండి!