మహారాష్ట్ర లోని సతారా జిల్లా 10500 చ.కి.మీ.లవిశాలమైన విస్తీర్ణంలో నెలకొని వుంది. దీనికి పడమటి వైపున రత్నగిరి, తూర్పున సోలాపూర్, దక్షిణాన సాంగ్లి వున్నాయి. ఈ జిల్లా ఏడు వైపులా కొండలతో చుట్టుకుని వుండడం వల్ల దీన్ని సతారా అంటారు – అంటే సుమారుగా ఏడు కొండలు అని అర్ధం. జరందేశ్వర్, యవతేశ్వర్, అజింక్యతర, కిట్లిచా దొంగార్, సజ్జనగడ, పెధ్యాచా భైరోబా, నడ్కిచా దొంగార్ ఆ ఏడు కొండల పేర్లు.
చారిత్రిక వైభవం :
సతారా తొలుతగా రాష్ట్రకూట వంశస్తుల చేత పాలించబడింది. తర్వాత చాళుక్యుల చేత, అనంతరం మౌర్య రాజుల చేత పాలించబడింది. ముస్లిం దండయాత్రల తర్వాత సతారా జిల్లా 17 శతాబ్దంలో మరాఠా రాజ్య౦లొ ప్రధాన నగరం గా వుండేది.
మూడో ఆంగ్ల-మరాఠా యుద్ధంలో గెలిచాక బ్రిటిష్ వారు సతారాను మరాఠాల నుంచి చేజిక్కించుకుని రాజ ప్రతాప సింహుడికి దాని నిర్వహణ బాధ్యత అప్పచెప్పారు. సతారా అటు తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీ లో భాగమైంది.
సతారా భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా వుండేది.
మీరిక్కడ వున్నప్పుడు మర్చిపోకూడనివి ఏమిటి?
సతారా జిల్లాలో ఆశ్చర్య పరిచే గుళ్ళు, కోటలూ వున్నాయి. భోజ రాజు నిర్మించిన అజింక్యతార కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ. 3000 అడుగుల ఎత్తున్న ఈ కోట దండెత్తి వచ్చే శత్రువుల నుంచి రక్షణ కల్పించేది. ఈ కొండ పై నుంచి సతారా నగరం మొత్తాన్ని చక్కగా చూడవచ్చు. ఈ కోట లో మంగళా దేవి అద్భుతమైన గుడి చూడవచ్చు.
వసోతా కోట, సజ్జనగడ కోట మరాఠా నిర్మాణ శైలిలో నిర్మించిన మరో రెండు కోటలు. వాస్తు ప్రేమికులు ఈ కోటల వైభవాన్ని ఇష్టపడతారు.
గారే గణపతి గుడి, భైరోబా గుడి, కృష్ణేశ్వర్ గుడి, భవానీ దేవి గుడి, అభయంకర విష్ణు దేవాలయం సతారా లోని ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని. కోటేశ్వర శివాలయం సుమారు 500 ఏళ్ళ నాడు 16వ శతాబ్దంలో నిర్మించారు.
కౌస్ సరస్సు, కౌస్ మైదానం ఈ ప్రాంతంలోని రెండు అబ్బురపరిచే పాయింట్లు. ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిన వివిధ జాతుల మొక్కలు, మూలికలు ఇక్కడ దొరుకుతాయి. ఈ సరస్సు సతారాకు ప్రధాన జల వనరు. వర్షాకాలంలో జలపాతం పూర్తి ఊపుతో ఉన్నప్పుడు ఇక్కడి తోసేగర్ జలపాతాలు చూసి తీరాల్సిందే.
పోవై నాకా లో ఛత్రపతి శివాజీ అరుదైన విగ్రహం నిర్మించారు – ఇలాంటిది దేశంలో ఇదొక్కటే.
కండి పేడే అని పిలువబడే ఇక్కడి మిఠాయి రుచి చూడకపోతే పాపం చేసినట్లే. ఒకసారి రుచి చూస్తె, దాని కోసం మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు.
మరి కొన్ని అదనపు వాస్తవాలు
వేసవి లో సతారా చాలా వేడిగా వుండడంతో పర్యాటకం నెమ్మదిస్తుంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవడంతో యాత్రికులు హోటల్ గదుల్లోనే వుండిపోవాలి. ఈ వేడి నుంచి ఉపశమనం కలిగించే వర్షాకాలం మరింత హాయిగా వుంటుంది. మీరు వర్షాలను ఇష్టపడితే, సతారా ప్రాంతంలోని అందాలను చూడ్డానికి వర్షాకాలం అనువైన సమయం. శీతాకాలం ఈ మండే ఎండల నుంచి బోలెడంత తెరిపినిస్తుంది. వాతావరణం చల్లగా వుంది, పరిసరాలు గాలి వీస్తూ వుంటాయి. అన్ని కాలాల్లోకీ ఈ శీతాకాలం ఈ నగర సందర్శనకు అనువైన కాలం.
పూణే, ముంబై, రత్నగిరి లాంటి నగరాలకు దగ్గరగా వుండడం వల్ల సతారా వాయు, రైలు రోడ్డు మార్గాల ద్వారా అన్ని ప్రధాన నగరాలకు కలపబడి వుంది. విమానంలో రావాలంటే పూణే దగ్గరి విమానాశ్రయం. సతారా లోని రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాల నుంచి వచ్చే రైళ్లతో బాగా కలపబడి వుంది. మీరు ఈ నగరానికి వాహనంలో వెళ్ళాలనుకుంటే పూణే-బెంగళూరు రహదారి లేదా ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే ద్వారా సౌకర్యవంతంగా చేరుకోవచ్చు.
సతారా గత వైభవ చిహ్నాలతో అలరారుతుంది. అచ్చమైన పర్యాటకుడికి కోటల సందర్శన, వ్యాహ్యాళి, అభయారణ్య సందర్శన – ఇలా అన్ని అవకాశాలు ఇస్తుంది సతారా. ఒకప్పుడు మరాఠాల రాజధానిగా భాసిల్లిన సతారా ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. మన ఘన గత చరిత్ర తెలుసుకోవడానికి ఇక్కడ తప్పక పర్యటి౦చండి.