భూతల స్వర్గం,తూర్పు వెనిస్ నగరం అని ప్రసిద్ధికెక్కిన శ్రీ నగర్ అందమైన కాశ్మీర్ లోయ లో ఉంది. జీలం నదీ తీరంలో ఉన్న ఈ నగరం, అందమైన సరస్సులు, పడవ-ఇళ్ళు, అసంఖ్యాకమైన మొఘల్ ఉద్యానవనాల కి పేరు మోసింది. శ్రీనగర్ అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక. శ్రీ అనగా సంపద. నగర్ అనగా నగరం. అందువలన, శ్రీనగర్ అంటే సంపద నగరం అనే అర్ధం వస్తుంది.
ఈ నగరం, అందంగా ఉండటమే కాక, మిక్కిలి చారిత్రక, ధార్మిక, పురాతత్వ ప్రాముఖ్యత ని కలిగి ఉంది. ఎన్నో పురాతన భవనాలు, ప్రాచీన ధార్మిక ప్రదేశాలు నగరం యొక్క ఉజ్వలమైన గతానికి నిలువెత్తు నిదర్శనాలు. క్రీ.పూ 3000 నుంచి 1500 మధ్య కాలానికి చెందిన నియోలిథిక్ యుగపు స్థిరనివాసం బుర్జాహాం అత్యంత చారిత్రక ప్రాధాన్యత ను సంతరించుకుంది. ఇక్కడి నుంచి సేకరించిన వస్తువులు శ్రీనగర్ లోని శ్రీ ప్రతాప్ సింగ్ సంగ్రహాలయం లో ఉంచబడినవి. ఈ సంగ్రహాలయం లో నియోలిథిక్-మెగాలిథిక్ యుగానికి చెందిన జంతు అస్తిపంజరాలు, బాణపు మొదళ్ళు, పరికరాలు, కుండలు ఉన్నాయి.
ఇక్కడ కనిపించే కొన్ని మసీదులు, గుళ్ళు సుమారు 1000 ఏళ్ళ కిందటివి. శంకరాచార్య ఆలయం, జ్యేష్టేశ్వర ఆలయం నగరం లోని వాసికెక్కిన దేవాలయాలు. జామా మసీదు, హజరత్బల్ మసీదు మరియు అఖుంద్ ముల్లా మసీదు ఇక్కడి ముఖ్యమైన మసీదులు మరియు ప్రసిద్ధికెక్కిన సందర్శనీయ స్థలాలు. నిషాత్ బాఘ్, షాలిమార్ బాఘ్, ఆచబల్ బాఘ్, చస్మా షాహీ మరియు పరీ మహల్ మొదలయిన మొఘల్ ఉద్యానవనాలు ప్రపంచం నలు మూలల నుంచి వేలాది మంది యాత్రికులను ఇక్కడికి రప్పిస్తున్నాయి. ఈ ఉద్యానవనాలు నగరం యొక్క సహజ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి.
శ్రీనగర్ లోని దర్శనీయ విశేషాలలో దాల్ సరస్సు, నాగిన్ సరస్సు, అంచర్ సరస్సు మరియు మనస్బల్ సరస్సు లాంటి సరస్సులు కూడా ఉన్నాయి. అసమానమైన ప్రకృతి సౌందర్యం మరియు మనోహరమైన పరిసరాలు ఈ సరస్సులని యాత్రికులకు ఆదర్శనీయమైన పర్యాటక ప్రదేశాలుగా చేస్తున్నాయి. కాశ్మీర్ లోయ లోని రెండవ అతి పెద్ద సరస్సు అయిన దాల్ సరస్సు “కాశ్మీర్ కిరీటంలో కలికితురాయి” అని పేరు పొందింది. దీనికి అందమైన హిమాలయాలు నేపథ్యం గా ఉంటాయి. శ్రీనగర్ సరస్సు ఒడ్డున లభ్యమయ్యే పడవ-ఇళ్ళకి మరియు షికారా (కలప పడవ సవారి) కి కూడా ప్రసిద్ధి. యాత్రికులు “షికారా”లో విహరిస్తూ మనోహరమైన పరిసరాలని వీక్షించవచ్చు.
డచిగాం వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం శ్రీనగర్ లోని మరొక ప్రసిద్ధి చెందిన సందర్శన స్థలం. 1951 లో “జాతీయ ఉద్యానవనం” గా ప్రకటించబడిన ఈ సంరక్షణ కేంద్రం సుమారు 141 చ.కీ.మీ ల మేర విస్తరించి ఉంది. హంగుల్ అనే పేరు గల అంతరించిపోతున్న ఎర్ర జింకలకి ఇది ఆవాసం. యాత్రికులు చిరుతపులులు, నలుపు మరియు గోధుమ ఎలుగుబంట్లు, కస్తూరి జింక మరియు పలు వలస పక్షులని కూడా ఇక్కడ చూడవచ్చు.
అందమైన దాల్ సరస్సు తీరం లో ఉన్న ఇందిరా గాంధీ తులిప్ ఉద్యానవనం కూడా ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణ. 70 జాతుల తులిప్ పుష్పాలు ఉన్న ఈ ఉద్యానవనం 90 ఎకరాలు విస్తీర్ణం లో ఉంది. ఏప్రిల్ 5 నుంచి 15 తారీఖుల మధ్య జరిగే వార్షిక తులిప్ ఉత్సవం మిక్కిలి జనాదరణ పొందింది. ఈ పండుగ కేవలం జాతీయ యాత్రికులనే కాక ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. సందర్శకులు స్థానిక వంటకాలు, జానపద నృత్యం ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు. యాత్రికులు, హస్త కళా వస్తువులు మరియు కేవలం ఈ రాష్ట్రం లోనే లభ్యమయ్యే ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కాశ్మీరీ తివాచీలు, పష్మినా శాలువలు, వుడుపులు, వస్త్రాలు కొనుక్కోవచ్చు. ఉత్సవం 7 గంటల నుండి సాయంత్రం 9 వరకు సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది.
ఈ నగరం ట్రెక్కింగ్ మరియు హైకింగ్ లాంటి సాహసోపేత చర్యలకి ప్రసిద్ధి చెందింది. శ్రీనగర్ నుంచి ప్రారంభమయి అమర్ నాథ్ గుహలకు చేరే ట్రెక్కింగ్ మార్గం ప్రయాణికులలో ప్రాచుర్యం పొందింది. డచిగాం మరియు పహల్గాం ప్రయాణికులు విహారానికి వెళ్లేందుకు మంచి ప్రదేశాలు.
ఇక్కడి భోజనం లో అన్నం ప్రధానంగా ఉంటుంది. శ్రీనగర్ లోని వంటకాలలో సాధారణంగా మసాలా ఎక్కువ గానే ఉంటుంది.బాగా వాడుక లో ఉన్న మరియు ఖరీదైన మసాలా దినుసు అయిన కుంకుమ పువ్వు ఉత్పత్తి నగరం లో ఎక్కువే.“రాజ మసాలా” గా పేరొందిన కుంకుమ పువ్వుని ఇక్కడ తాజాగా రైతుల దగ్గరే కొనుగోలు చేయవచ్చు. కుంకుమ పువ్వు వెల సుమారు గ్రాముకి 200 రూపాయలు ఉంటుంది.
శ్రీనగర్ ప్రధాన భారతీయ నగరాలకు మరియు దేశాలకు విమాన మార్గం చే అనుసంధానించబడింది. షేక్-ఉల్-ఆలం విమానాశ్రయం గా పిలవబడే శ్రీనగర్ విమానాశ్రయం నుంచి ముంబై, ఢిల్లీ, సిమ్లా, చండీగఢ్ లాంటి ముఖ్య భారతీయ నగరాలకు నేరుగా విమానాలు ఉన్నాయి.ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రయాణీకులను శ్రీనగర్ తో కలుపుతుంది.శ్రీనగర్ దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్ 290 కిమీ దూరంలో ఉన్న జమ్మూ లో ఉంది. ఈ నగరం లేహ్, జమ్మూ, చండీగఢ్ మరియు ఢిల్లీ వంటి ముఖ్యమైన సమీప స్థలాలకు బస్సు సదుపాయం కలిగి ఉంది.
సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవి మరియు శీతాకాలం ప్రధాన రుతువులు. శ్రీనగర్ లో చాలా తక్కువ వర్షం కురుస్తుంది.వేసవి కాలంలో వాతావరణం చాలా సౌకర్యవంతంగా మరియు ఆనందకరంగా ఉంటుంది. శీతాకాలాలు భారీ హిమ పాతం తో గడ్డకట్టే చలి తో ఉంటాయి.