నవరాత్రి అంటే తొమ్మిది రాత్రుల పండగ. ఈ తొమ్మిది రాత్రులు దుర్గాదేవికి అంకితం చేసి గౌరవిస్తారు. భారత దేశంలో జరిగే అతి పెద్ద పండగ దసరా. ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర అనే భేధం లేకుండా హిందూ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా పండగను జరుపుకుంటారు. మన దేశంలో ఎన్నో దుర్గా దేవి ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రఖ్యాతి గాంచినవి ఉన్నాయి. మనదేశంతో పాటు చుట్టుప్రక్కల గల దేశాలతో కలిపి మొత్తం 51 శక్తి పీఠాలు శక్తి మరియు పార్వతి దేవికి అంకితం చేయబడ్డాయి.
క్లిక్ చేయండి : దసరా లో పర్యటించవలసిన 25 ప్రదేశాలు !!
మీరు చుట్టుప్రక్కల దేవి ఆలయాలను గమనించే ఉంటారు కానీ మీకు ఇక్కడ చెప్పబోయే ప్రదేశాలు కొండమీద వెలసిన శక్తి మరియు పార్వతి ఆలయాలు. ఈ ఆలయాలలో కొన్నేమో కొండెక్కి దిగే విధంగా ఉంటాయి మరికొన్నేమో రోప్ వే ద్వారా మాత్రమే చేరుకోగలం. మరి అటువంటి దుర్గా దేవి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనిస్తే ...!
క్లిక్ చేయండి : ఇండియాలోని శక్తి దేవాలయాలు !!
వైష్ణో దేవి ఆలయం
ముందుగా మనం భారత దేశ తలపై అదే జమ్మూ కాశ్మీర్ నుండి వద్దాం..! ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసినది వైష్ణో దేవి ఆలయం. ఈ ఆలయం 5300 మీటర్ల ఎత్తున త్రీకూట కొండ మీద ఉన్నది. కొండ మీద ఉన్న గుహలో కొలువైన దైవం మాతా వైష్ణో దేవి. ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మందికి పైగా భక్తులు సందర్శిస్తుంటారు. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ఆలయం మాతా బాల సుందరి ఆలయం. ఇది కథువా జిల్లాలో కలదు.
Photo Courtesy: Rishi ganguly / diptojit_datta
శారద మాతా ఆలయం
భారతదేశానికి మధ్యలో ఉన్న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్ యొక్క త్రికూట కొండ మీద మైహర్ వాలి మాతా ఆలయం ఉన్నది. ఈ ఆలయం దేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రశస్తి చెందినది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మీరు 1063 మెట్లు ఎక్కి ఎక్కవలసి ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు.
Photo Courtesy: UjjawalTM
తారా దేవి ఆలయం
తారా దేవి ఆలయం సిమ్లా లో కలకా రోడ్ సమీపాన సముద్ర మట్టానికి 6070 అడుగుల ఎత్తున కొండ మీద ఉన్నది. ఈ ఆలయం చుట్టుప్రక్కల పెద్ద పెద్ద ఓక్ చెట్లు ఉండటం వలన పిక్నిక్ స్పాట్ గా కూడా మారిపోయింది. ఈ గుడి 250 సంవత్సరాల క్రితం కట్టారని, ఇందులో నక్షత్రాలు అధిపతి దేవత ఉంటుందని ఇతిహాసాల సారాంశం. అదేవిధంగా ఈ దేవి భక్తులపై ఒక కన్నేసి ఉండి, వారి కోర్కెలను తీరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మోటార్ సైకిల్ పై వెళుతూ, చుట్టుప్రక్కల గల అందాలను ఆస్వాదిస్తూ గుడికి చేరుకోవడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.
Photo Courtesy: somdebb
కనకదుర్గ ఆలయం
కనక దుర్గ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేరుమోసిన దుర్గా దేవి ఆలయం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇక్కడ ఉన్న దుర్గా దేవి విగ్రహం నాలుగు అడుగుల ఎత్తు ఉండి, 8 చేతులలో ఒక్కో ఆయుధాన్ని కలిగి మహిషాసురుడిని పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. దసరా నవరాత్రుల సమయంలో ప్రతిరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తుంటారు. ఇక్కడికి భక్తులు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వస్తుంటారు. దసరా సమయంలో ఇక చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ..!
Photo Courtesy: Manfred Sommer
చాముండేశ్వరి ఆలయం
కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక రాజధానియైన మైసూర్ నగరంలో చాముండేశ్వరి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని మైసూర్ వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పక సందర్శించాలి. సముద్రమట్టానికి 1065 మీటర్ల ఎత్తున చాముండి హిల్స్ పై భాగాన ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఈ ఆలయాన్ని 11 వ శతాబ్ధంలో నిర్మించినారు. దేవాలయం ముందు భాగంలో మహిషాసురుని విగ్రహం కూడా ఉంది.
Photo Courtesy: Saravana Kumar
మానస దేవి ఆలయం
ఇండియా లోని 51 శక్తి పీఠాలలో ఒకటైన మానస దేవి టెంపుల్, హరిద్వార్ నగరానికి సుమారు 3 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ మానస దేవి కి అంకితం చేయబడినది. ఈ టెంపుల్ శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంపై కలదు. ఈ టెంపుల్ లో రెండు విగ్రహాలు కలవు. వాటిలో ఒక దానికి అయిదు చేతులు, మూడు నొరులు వుండగా, మరొకదానికి ఎనిమిది చేతులు వుంటాయి. టూరిస్టులు ఈ టెంపుల్ ను కేబుల్ కార్ లో చేరవచ్చు.
Photo Courtesy: Ekabhishek
అధర్ దేవి ఆలయం
రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూ లో ప్రసిద్ధి చెందిన అధర్ దేవి ఆలయం ఉన్నది. దుర్గ మాత కు చెందిన ఈ ఆలయం ఒక ఎత్తైన శిఖరం పై ఉంది. ఈ దేవాలయం ఒక గుహ లో వుంటుంది. ఈ దేవాలయాన్ని చేరడానికి భక్తులు సంవత్సరంలోని రోజులను ప్రతిబింబించేలా వుండే 365 మెట్ల ద్వార కొండ పైకి ఎక్కుతారు. దుర్గ దేవి ఆశీర్వాదం పొందడానికి భారి సంఖ్యలో వచ్చే భక్తులు ఈ సుదూర ప్రయాణం లెక్కచేయరు.
Photo Courtesy: Manfred Sommer
బమ్లేశ్వరి దేవి ఆలయం
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దొంగర్ ఘర్ సమీపంలో సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తున కొండ మీద మాతా బమ్లేశ్వరి దేవి ఆలయం ఉన్నది. దొంగర్ ఘర్ అనే జిల్లా ఎన్నో ఆకర్షణలతో, ఆలయాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రదేశం. ప్రధానమైన, కొండమీద ఉన్న మాతా బమ్లేశ్వరి ఆలయాన్ని బడి(పెద్ద) బమ్లేశ్వరి ఆలయంగా మరియు ప్రధాన ఆలయానికి అరకిలోమీటర్ దూరంలో ఉన్న మరొక ఆలయాన్ని చోటి(చిన్న) బమ్లేశ్వరి ఆలయంగా అభివర్ణిస్తారు. బమ్లేశ్వరి దేవి ఆలయానికి రోప్ వే ద్వారా కూడా వెళ్ళవచ్చు. గిరిజనులు ఎక్కువగా ఉన్న అటవీ ప్రాంతం ధంతరి లో కూడా చెప్పుకోదగ్గ ఆలయం ఒకటుంది అదే ధంతేశ్వరి ఆలయం.
Photo Courtesy: madhyapradesh temples.co.in
సప్తశృంగి దేవి ఆలయం
సప్త శృంగి దేవి ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ పట్టణానికి సమీపంలో గల వాణి అనే ప్రదేశంలో కలదు. భారత దేశంలో ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న దుర్గా దేవి విగ్రహం ఏకంగా 10 అడుగుల పొడవు, 18 చేతులలో ఒక్కో ఆయుధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహారాష్ట్ర లో రేణుక/ అనసుయ దేవి ఆలయం, ఏక్ వీర దేవి ఆలయం, తుల్జా భవాని ఆలయం చెప్పుకోదగ్గ దేవి ఆలయాలు గా ఉన్నాయి.
Photo Courtesy: AmitUdeshi
తారా తరిని ఆలయం
మాతా తారా తరిని ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని గోపాల్పూర్ పట్టణానికి కూతవేటు దూరంలో రిశికుల్య నది ఒడ్డున కుమారి హిల్స్ పై ఉన్నది. మాతా తల్లి యొక్క పవితమైన ఆశీస్సులు అందుకోవడానికి ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తుంటారు. దేశంలో ఉన్న ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో మా తారా, మా తరిని అనే ఇద్ధరు దేవతలు ఉంటారు. వీరిని ఆదిశక్తి అవతారాలుగా కొలుస్తారు.
Photo Courtesy: Nibedita