రంజాన్ మాసం ప్రారంభమైనది. ముస్లిం ప్రజలు ఈ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే(సహేరి)ఉపవాస దీక్షలను మొదలు పెట్టి ... సాయంత్రం(ఇఫ్తార్) పూట విరమిస్తుంటారు. ఇది ఈ మాసంలో వారి దినచర్య. ఆచారాలను ఫాలో అయ్యేవారు 5 పూటల నమాజ్ చేస్తుంటారు.
ఇది కూడా చదవండి : రంజాన్ మాసం - రుచి చూద్దామా!
రంజాన్ పండుగను ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్దల మధ్య, నియమనిష్టలతో ఘనంగా జరుపుకుంటారు. ఈద్గా లేక మసీద్ లకు వెళ్లి ప్రార్ధనలు చేయటం రంజాన్ పండగ లో ముఖ్యమైన ఘట్టం. ఈ పండగ సమయంలో మన దేశంలో ప్రసిద్ధి గాంచిన మసీద్ ల గురించి కొన్నైనా చెప్పుకోక తప్పదు. ఇవి మిమ్మలను గతంలోకి తీసుకెళ్ళి నాటి వైభవాలను, సంప్రదాయాలను గుర్తుకుతెస్తాయి.
జమా మసీద్, ఢిల్లీ
జమా మసీద్ దేశంలోని పురాతన మసీద్ లలో ఒకటి. దీనిని షాజహాన్ క్రీ.శ. 1550 లో మొదలుపెట్టి క్రీ.శ. 1556 లో పూర్తి చేసాడు. ఒకేసారి 25 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసే స్థలం ఇక్కడ ఉంది. ప్రతి శుక్రవారం, ప్రత్యేక పర్వదినాలైన రంజాన్, బక్రీద్ లలో మసీద్ ను అనేక మంది ముస్లిం లు దర్శిస్తుంటారు. ఈ మసీద్ ఢిల్లీ లోని చౌడీ బజార్ లో కలదు.
చిత్ర కృప : Dennis Jarvis
దర్గా షరీఫ్, అజ్మీర్
అజ్మీర్ లోని దర్గా షరీఫ్ ముస్లిం ల ప్రసిద్ధ యాత్రా స్థలం. దర్గా షరీఫ్ ఖాజా మొయినుద్దీన్ చిష్టీ యొక్క నివాస స్థలం. ఆయన అన్ని మతాల ప్రజలచే గౌరవించబడే ఒక సూఫీ సన్యాసి. దర్గా లోని మసీద్, వజు ఖానా ఎంతో అందంగా పాలరాతి తో నిర్మించారు నాటి మొఘల్ పాలకులు. ప్రత్యేక పర్వదినాలలో దర్గా ను లక్షల సంఖ్యలో ప్రజలు దర్శిస్తుంటారు.
చిత్ర కృప : Zakir Naqvi
బర ఇమంబర, లక్నో
బర ఇమంబర అంటే పూజించే పెద్ద స్థలం అని అర్థం. క్రీ.శ. 1783 వ సంవత్సరంలో లక్నో నవాబు దీనిని నిర్మించారు. ఎటువంటి ఇనుము వాడకుండా దీని నిర్మాణం జరిగింది. ఈ ఇమంబర నిర్మాణ ఆకృతి ప్రపంచంలో ఐదవ పెద్ద మసీదుగా భావించబడే పాకిస్తాన్ లోని లాహోర్ బాద్శాహి మసీదు ను పోలి ఉంటుంది. మొఘలు శైలిలో ఉన్న విలక్షణమైన కట్టడంలో ప్రార్ధనలు చేయటానికి ముస్లిం లు పెద్ద ఎత్తున వస్తుంటారు.
చిత్ర కృప : Koushik Banerjee
తాజ్-ఉల్-మసీద్ , భోపాల్
తాజ్-ఉల్- మసీద్, భోపాల్ లో ఉన్నది.ఈ మసీద్ ని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కాలంలో పునాది పడితే,1885 వ సంవత్సరంలో పూర్తయినది.ఈ మసీద్ లేత గులాబీ వర్ణంలో ఉంటుంది.ఇక్కడ రంజాన్, బక్రీద్ పండగల సమయాలలో చేసే ప్రార్థనలు ప్రత్యేకమైనవి. దీనియొక్క నిర్మాణ శైలి డిల్లీలోని జమా మసీద్,లాహోర్ లోని బాద్షాహీ మసీద్ పొలి ఉంటుంది.
చిత్ర కృప : Anuradha Goyal
హజ్రత్బల్ మసీద్, శ్రీనగర్
ప్రఖ్యాత దాల్ సరస్సుకి ఉత్తరాన ఉన్న హజ్రత్బల్ మసీదు మహమ్మదీయులకు ముఖ్యమైన ప్రార్ధనా స్థలం. సరస్సు వైపు చూసేవారికి అద్భుతమైన దృశ్యం చూపించే ఈ మసీదు తెల్లని పాలరాతితో నిర్మించబడింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడం మొఘల్ మరియు కాశ్మీరీ నిర్మాణ శైలి ని పోలి ఉంటుంది. మహమ్మద్ ప్రవక్త కేశాలు ఇక్కడ ఉన్నాయనే నమ్మకం వల్ల ఇది అత్యంత పుణ్య స్థలం గా పరిగణించబడుతుంది.
చిత్ర కృప : Hardikmodi
జమా మసీద్, ఫతేపూర్ సిక్రీ
జమా మసీద్ ఫతేపూర్ సిక్రీ లో చూడదగ్గ ప్రదేశం. క్రీ.శ. 1648 వ సంవత్సరం లో షాజహాన్ తన కుమార్తె జహానర బేగం కు ఈ కట్టడాన్ని అంకితం చేసాడు. ఇరానియన్ నిర్మాణ శైలిని పోలి ఉండే ఈ మసీద్ ను మహమ్మదీయులు పర్వదినాల్లో, ప్రతి శుక్రవారం అధిక సంఖ్యలో సందర్శిస్తారు. మసీద్ పూర్తయిన 5 సంవత్సరాలకి బులంద్ గేటు నిర్మించారు.
చిత్ర కృప : Daniel Mennerich
తాజ్ మహల్, ఆగ్రా
ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ కూడా మసీద్ రూపకల్పన ను పోలి ఉంటుంది. దీనిని పర్షియా, భారతీయ మరియు ఇస్లాం నిర్మాణ శైలిలో నిర్మించారు. కేవలం పర్వదినాల్లో, ప్రతి శుక్రవారం (జుమా నవాజ్) మాత్రమే తాజ్ మహల్ లో ప్రార్ధనలను నిర్వహిస్తుంటారు. మిగితా సమయంలో పర్యాటకులను అనుమతిస్తారు.
చిత్ర కృప : Rayilkhan
అడాయి దిన్ కా ఝోప్ర, అజ్మీర్
అడాయి దిన్ కా ఝోప్ర తొలి తరం ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ. ఈ మసీద్ ను కేవలం రెండున్నర రోజులలో నిర్మించారన్న ఆసక్తికర చర్చ ఉన్నది. 'అడాయి' అంటే రెండున్నర అని అర్థం. మొదట్లో సంస్కృత కళాశాల గా ఉన్న ఈ భవనాన్ని కూల్చి క్రీ.శ. 11 వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ మసీద్ ను నిర్మించాడు. రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో ప్రార్థనలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
చిత్ర కృప : Ramesh lalwani
మక్కా మసీద్, హైదరాబాద్
హైదరాబాద్ లో చార్మినార్ పక్కన ఉన్న మక్కా మసీద్ పురాతన మసీద్ మాత్రమే కాదు దేశంలోనే పెద్ద మసీద్ గా ప్రసిద్ధి చెందినది. ఈ మసీద్ లో రోజుకు 5 పూటల నమాజ్ నిర్వహిస్తారు. క్రీ.శ. 16 వ శతాబ్దంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మక్కా నుండి తీసుకొచ్చిన మట్టితో తయారుచేసిన ఇటుకలతో మసీద్ నిర్మించాడు. వరండా లో పక్షులు, వజు ఖానా ప్రత్యేక ఆకర్షణ. ప్రవక్త మహమ్మద్ గారి తల నుండి సేకరించబడిన వెంట్రుక ఇక్కడ భద్రపరిచారని నమ్మకం.
చిత్ర కృప : Haqeer
మోతీ మసీద్, ఆగ్రా
ముత్యపు మసీద్ గా పిలువబడే మోతీ మసీద్ ను భారత కట్టడాల నిర్మాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. తన రాజ సభలోని సభ్యుల కోసం దీనిని ఆగ్రా కోట ప్రాంగణంలో నిర్మించారు. మసీదు లోని ప్రాంగణం, గుమ్మటాలు, పై కప్పు, గోడలు మెరుస్తూ కనిపిస్తుంటాయి. పర్వదినాల్లో ముస్లిం లు ప్రార్ధనలు నిర్వహిస్తారు.
చిత్ర కృప : Paul Simpson
జుమ్మా మసీద్, బీజాపూర్
కర్ణాటకలోని జుమ్మా మసీద్ ను అదిల్ షా తల్లికోట యుద్ధం లో విజయం సాధించినందుకు గుర్తుగా నిర్మించాడు. దీని విస్తీర్ణం 10, 810 చ. మీటర్లు. ప్రార్థనలు చేసేందుకు 2250 నల్లని చదరాలు నేలపై కట్టారు. బంగారంలో వ్రాసిన ఖురాన్, ఉల్లిపాయ ఆకారంలో డోమ్, ఫౌంటైన్ లు, గోపురాలు, ఆర్చీలు మసీద్ ఆకర్షణలు.
చిత్ర కృప : Ghostface Buddha