రాజస్థాన్ అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది కేవలం ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి ప్రాంతం. వాటి పై ఒంటెల బారులు. అయితే ఈ ఎడారి రాష్ట్రం కూడా అందాలకు నెలవు. ముఖ్యంగా వర్షాకాలం ఆరంభంలో అక్కడి కొన్ని ప్రాంతాలు కొత్త అందాలను సింగారించుకొంటాయి. ముఖ్యంగా మౌంట్ అబు లాంటి హిల్ స్టేషన్లతో పాటు పుష్కర్ వంటి ఆధ్యాత్మిక నగరాలు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా మునెస్కో చేత గుర్తించబడి సంరక్షింబడే ప్రాంతాల్లో చేర్చబడిన రాజస్థాన్ లోని భరత్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రంలో పక్షుల కుహ కుహలు ఈ వర్షాలకాలంలోనే ఎక్కువగా వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో జులై ఆగస్టు నెలల్లో రాజస్థాన్ లో సందర్శించడానికి అనువైన ఐదు ముఖ్యమైన పర్యాటక ప్రాంతల గురించిన క్లుప్త సమాచారం మీ కోసం..
ఉదయ్ పూర్
P.C: You Tube
సరస్సుల నగరం, వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరొందిన ఉదయ్ పూర్ ఈ జులై నుంచి దాదాపు మూడు నెలల పాటు పచ్చదనం పరుచుకొని ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్న సరస్సులు కూడా వర్షపు నీటితో కొత్త అందాలను సంతరించుకొంటాయి. దీంతో ఆ సరస్సుల్లో ప్రయాణం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మాన్ సూన్ ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్ వంటి కోటలతో పాటు సాద్యమైనన్ని సరస్సుల్లో బోటులో ప్రయాణం మరిచిపోకండి.
మౌంట్ అబూ
P.C: You Tube
రాజస్థాన్ లోని ఒకే ఒక హిల్ స్టేషన్ మౌంట్ అబు. ఇక్కడ ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత శోభను చేకూరుస్తుంది. ఈ సమయంలో ఈ పర్వతం పై ఉన్న పచ్చదనం మన మనస్సుకు ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. నక్కీ సరస్సు దిల్వారా జైన్ దేవాలయాలు ఇక్కడ ప్రధాన పర్యాటక ప్రాంతాలు.
పుష్కర్
P.C: You Tube
రాజస్థాన్ లోని ఈ ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ఇక్కడ వర్షాకాలంలో పుష్కర్ సరస్సు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఉష్ణోగ్రత అంతగా ఉండని ఉదయం, సాయంత్రం సమయాల్లో ఒంటె పై పుష్కర్ సరస్సు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అందుల్లే ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి మిగిలిన రోజులతో పోలిస్తే వర్షాకాలంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.
భరత్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రం
P.C: You Tube
పక్షుల కిలకిల రావాలను వింటూ మీ సూర్యోదయ అందాలను చూడాలనుకొనేవారికి రాజస్థాన్ లోని భరత్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రం ఒక మంచి పర్యాటక కేంద్రం. యునెస్కోవారి పరిరక్షించబడే ప్రాంతాల్లో కూడా భరత్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రానికి స్థానం దక్కింది. ఇక్కడ సుమారు 375 అరుదైన జాతుల పక్షులను మనం చూడవచ్చు. ఇక్కడికి టిబెట్, చైనా, యూరప్, సైబీరియా నుంచి కూడా పక్షులు వలస వస్తాయి. ఇక్కడ మనం చిన్నపాటి జలపాతాల అందాలను కూడా వీక్షించవచ్చు.
జైపూర్
P.C: You Tube
రాజస్థాన్ రాజధాని జైపూర్ కూడా ఈ వర్షాకాలంలో కొత్త అందాలను సంతరించుకొంటుంది. ఒక రకంగా పర్యాటకులు ఎక్కువ మంది సందర్శించే సమయం కూడా ఇదే. ఇక్కడ వర్షాల రాకను పురస్కరించుకొని తేజి అనే పండుగను జరుపుకొంటారు. వివాహితులు, మహిళలు సంప్రదాయ దుస్తులతో పార్వతీ దేవిని పూజిస్తారు. అంతేకాకుండా ఆ మాత విగ్రహంతో ఊరేగింపును కూడా నిర్వహిస్తారు. ఇక చుట్టు పక్కల ప్రాంతాలన్ని పచ్చదనం పరుచుకొని కంటికి ఇంపును కలుగ చేస్తాయి.