ప్రయాణాలు చేయడం కొంతమందికి హాబి, మరికొంతమంది దైవదర్శనం కోసం, పచ్చని ప్రకతి అందాలను తిలకించేందుకు, చరిత్రను తెలుసుకొనేందుకు ప్రయాణాలు చేస్తుంటారు. దైవ దర్శనంతో పాటు కాస్తంత చరిత్రను కూడా తెలుసుకోవాలనే ఆసక్తిమీకు ఉంటే వారణాసి పుణ్యక్షేత్రం అందుకు సరైన గమ్యం. గలగలమని సాగే గంగమ్మ పరవళ్లతో పాటు ఈ జీవితంలో శాశ్వతం కాదని చెప్పే మణికర్ణిక ఘాట్, అలనాటి రాచవైభవాన్ని చాటి చెప్పే రామనగర కోట, ఎన్నో యుద్ధాలకు ప్రత్యక్షసాక్షమైన చూనార్ కోట కూడా ఇక్కడే మనం చూడవచ్చు.. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...
సారనాథ్
P.C: You Tube
వారణాసి నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో సారనాథ్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే అశోకచక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత ఒక స్థూపాన్ని ర్పాటు చేశారు. దాదాపు క్రీస్తు పూర్వం 234 లో ఈ స్థూపం ఏర్పాటు చేసినట్లు చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి. దేశంలోనే అత్యంత ఎతైన బుద్ధ విగ్రహం సారనాథ్ లోనే కొలువుదీరి ఉంది. దీనితో ఈ ప్రాంతానికి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు.
మణికర్ణిక
P.C: You Tube
వారణాసిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఘాట్ మణికర్ణిక ఘాట్. మోక్షం పొందాలని భావించే చాలా మంది హిందువులు వారణాసివెళ్లి తనువు చాలించిన తర్వాత ఈ ఘాట్ లోనే అంత్యక్రియలు జరుపుతుంటారు. జీవితంలో నిత్యం సత్యం అనే అంశాలను తెలుసుకోవాలంటే మణికర్ణిక ఘాట్ ను తప్పక దర్శించాలని చాలా మంది భావిస్తుంటారు.
మన్ మందిర్ ఘాట్
P.C: You Tube
వారణాసిలోని ప్రముఖమైన ఘాట్ లలో మన్ మందిర్ ఘాట్ కూడా ఒకటి. ఈ ఘాట్ చుట్టు పక్కల ఉన్న కట్టడాలన్నీ ఆనాటు భారతీయ వాస్తు శైలి నిర్మాణానికి అద్ధం పడుతాయి. మరీ ముఖ్యంగా 1600 ఏడాదిలో జైపూర్ రాజపుత్ర రాజు మాన్ సింగ్ ఈ ప్రాంతంలో నిర్మించిన ప్యాలెస్ రాజపుత్రుల వైభవాన్ని చాటి చెప్పుతుంది.
రామనగర కోట
P.C: You Tube
వారణాసిలోని రామనగర కోట ఈ ప్రాంత చారిత్రాత్మక వైభవానికి గొప్ప నిదర్శనం. వారణాసిని పాలించే రాజులు ఈ కోట నుంచే పాలనను నిర్వర్తించేవారు. క్రీస్తుశకం 1750 లో ప్రస్తుతం వారణాసిగా పిలుస్తున్న బెణారస్ ప్రాంతాన్ని పాలించే రాజులు ఈ కోటను నిర్మించినట్లు ఇక్కడ దొరికిన శిలాశాసనాలు చెబుతున్నాయి. పూర్తిగా ఎర్రని రాతితో నిర్మితమైన ఈ కోట ప్రస్తుతం మ్యూజియంగా వినియోగిస్తున్నారు. ఇందులో అప్పటి రాజుల ఖడ్గాలు, దుస్తులు, చిత్రాలను చూడవచ్చు.
చునార్ కోట
P.C: You Tube
గంగానదీ తీరంలో నిర్మించబడిన చునార్ కోట వారణాసి పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను ఉజ్జయినీని పాలించే రాజు విక్రమాదిత్యా తన సోదరుడైన భార్తారీ కోసం నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా హుమయున్, షేర్షా ల మధ్య జరిగిన యుద్ధానికి సైతం ఈ కోట సాక్ష్యంగా నిలిచిందని చరిత్ర కారులు చెబుతున్నారు.