కంచి లేదా కాంచిపురం పురాణ ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఈ కంచిపురం అటు శైవులకు, ఇటు వైష్ణవులకు కూడా ముఖ్యక్షేత్రం. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తాయి. కాంచిపురంతో పాటు
చుట్టు పక్కల ఉన్న దేవాలయాలను చూడాలంటే కనీసం మూడు రోజుల సమయం పడుతుంది. అయితే మీదగ్గర ఒక రోజు కంటే ఎక్కువ సమయం లేదు అనుకుందాం.
అప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్యాటక కేంద్రాలను చూడాలనుకోవడం సహజం. అటువంటి వారి కోసం కాంచిపురంలో చూడదగిన ఐదు ముఖ్యమైన పర్యాటక కేంద్రాల వివరాలు ఈ కథనంలో అందిస్తున్నాం. మరెందుకు ఆలస్యం చదివేయండి
ఏకాంబరేశ్వర దేవాలయం
P.C: You Tube
కాంచిపురం లో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచ భూత క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి శివలింగం భూమికి ప్రతీక. మామిడి చెట్టు కింద వెలిసిన పరమశ్వరుడికి ప్రతీకగా ఈ క్షేత్రానికి ఏకాంబరేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది. ఆలయంలో నాలుగ వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్టింపబడ్డాయి.
3500 ఏళ్లనాటి చెట్టు
P.C: You Tube
దేవాలయంలో దాదాపు 3,500 ఏళ్లనాటి మామిడి చెట్టు కాండాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు స్థానంలో మరో కొత్త చెట్టును నాడారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేసి శివుడిని పరిణయం ఆడిందని చెబుతారు.
కామాక్షి దేవి దేవాలయం
P.C: You Tube
పార్వతీ దేవి కాంచిపురంలో కామాక్షి అమ్మవారి పేరున కొలువై ఉన్నారు. మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, తిరువనైకవల్ లో ఉన్న అఖిలాండేశ్వరి దేవాలయాల వలే కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారి దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినది. కామాక్షి అమ్మవారి విగ్రహం యోగముద్రలో పద్మాసనము పై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లి విరుస్తూ ఉంటుంది.
ఇతర అమ్మవారి దేవాలయాలు లేవు
P.C: You Tube
కంచిలో కామాక్షి అమ్మవారి దేవాలయాలు కాకుండా మరే ఇతర అమ్మవారి దేవాలయాలు కూడా లేవు. మొదట్లో అమ్మవారు చాలా ఉగ్రస్వరూపిణిగా ఉండేదని చెబుతారు. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించడానికి శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు. కామాక్షి దేవి ఆలయానికి తెల్లవారుజాము 5 గంటలకు చేరుకొంటే విశిష్టమైన గోపూజను కూడా చూడవచ్చు.
వరదరాజ స్వామి దేవాలయం
P.C: You Tube
108 దివ్య వైష్ణవ ఆలయాలల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఈ దేవాలయం 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ దేవాలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటి మీద బల్లిపడితే కలిగే దోషం పోతుందని నమ్ముతారు. ఈ దేవాలయం ప్రాకారం ఉండే అన్ని పై కప్పుల మీద బల్లులు చెక్కారు.
చోళులు
P.C: You Tube
ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 1053 న చోళులు నిర్మించారని చెబుతారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆనంద సరోవరం, బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో
జలాంతర్భాగాన అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి 40 ఏళ్లకు ఒకసారి ఈ విగ్రహాలను బయటికి తీసి 40 రోజుల దర్శనానికి అనుమతిస్తారు.
కైలాసనాథ దేవాలయం
P.C: You Tube
కాంచిపురంలో ఉన్న అత్యంత ప్రాచీన దేవాలయంగా కైలాసనాథ దేవాలయాన్ని పేర్కొంటారు. ఈ దేవాలయాన్ని 8 వశతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. రాజసింహ పల్లవ ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన కుమారుడైన మహేంద్ర వర్మ పల్లవ పూర్తి చేశాడు.
పల్లవ శైలి
P.C: You Tube
ఇక్కడ పల్లవ శైలి శిల్పకళ, వస్తు నిర్మాణాన్ని మనం చూడవచ్చు. ఆ శిల్ప సౌదర్యాన్ని చూడాల్సిందే కాని వర్ణించడానికి మాటలు చాలవు. ముఖ్యంగా ఇక్కడి స్తంభాల పై ఉన్న శిల్పాల్లో జీవకళ ఉట్టి పడుతూ ఉంటుంది. కైలాసనాథ దేవాలయంలో ప్రధాన దైవం శివుడు.
కంచి కుడ్లి
P.C: You Tube
కుడ్లి అంటే ఇల్లు అని అర్థం. ఈ ఇల్లును నిర్మించి దాదాపు 90 ఏళ్లు అవుతూ ఉంటుంది. అప్పటి ఇళ్ల నిర్మాణం, అప్పట్లో ప్రజల జీవన విధానం, వస్తువులను నేటి తరానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ ఇంటిని ఓ ప్రదర్శన శాలగా మార్చారు.
అప్పటి తరం
P.C: You Tube
ఈ ఇంటిని సందర్శించడం వల్ల అప్పటి తరం వారి ఆహార, ఆహార్య అలవాట్లను తెలుసుకోవచ్చు. ప్రతి రోజూ సాయంకాలం ఇక్కడ సంస్క`తిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ అప్పటి తరం జీవన విధానాన్ని మన కళ్లకు కట్టుతుంది.