వేసవి ఉక్కపోతల నుంచి మనుషులే కాదు జంతువులు, చెట్లు కూడా ఉపశమనం పొందుతున్నాయి. అందుకే దేశంలోని అనేక అభయారణ్యాలు నూతన అందాలను సంతరించుకుంటూ పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు తెలంగాణ కూడాఅతీతం కాదు. తెలంగాణాలో ఉన్న అభయారణ్యాలలో అత్యంత అందమైన, రవాణా సౌకర్యాలు బాగున్న అభయారణ్యాల్లో పాకాల అభయారణ్యం, ఏటూరు నాగారాం, పోచారం డ్యాం, అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం, మృగావని నేషనల్ పార్క్ ముఖ్యమైనవి. ఈ ఐదు అభయారణ్యాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...
పాకాల అభయారణ్యం
P.C: You Tube
వరంగల్ నుంచి 50 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో పాకాల సరస్సు ఉంది. దీనిని గణపతి దేవుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. వీకెండ్ ను సరదాగా గడపడానికి ఈ పాకాల సరస్సు, అనువైన ప్రాంతం. పాకాల సరస్సుకు ఆనుకొనే 839 కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకల అభయారణ్యం ఉంది.
పచ్చటి ఈ అడవిలో పులులు, ఎలుగుబండ్లను చూడవచ్చు. ముఖ్యంగా జింకలు ఎటువంటి బెదురు లేకుండా చెంగు చెంగున మన కళ్ల ముందరే ఎగురుకొంటూ వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో అనేక వసల పక్షులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
ఏటూరు నాగారాం
P.C: You Tube
దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రాచీన అభయారణ్యాల్లో ఏటూరు నాగారాం ఒకటి. దీనిని 1952లో అప్పటి హైదరాబాద్ నిజాం ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటించింది. వరంగల్ నుంచి 109 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 253 కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉంటుంది. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దులను కలుపుతూ ఈ అభయారణ్యం ఉంది.
ప్రఖ్యాత సమ్మక్క, సారక్క దేవాలయం ఈ అభయారణ్యం మధ్యలోనే ఉంటుంది. ఈ అభయారణ్యంలో పులులు, చిరుతలు, నక్కలు, అడవి కుక్కలు, మచ్చల జింకలు, హైనా తదితర జంతువులను ఎన్నింటినో మనం చూడవచ్చు. గోదావరి ఉపనది అయిన జంపన్నవాగు ఏటూరు నాగారం గ్రామం వద్దనే గోదావరితో కలుస్తుంది.
పోచారం డ్యాం, అభయారణ్యం
P.C: You Tube
హైదరాబాద్ నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారం అభయారణ్యం మొదక్ జిల్లా పరిధిలోకి వస్తుంది. మెదక్ పట్టణం నుంచి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో పోచారం డ్యాం ఉంటుంది. వర్షాకాలంలో నిండుకుండలా ఉండే ఈ డ్యాం అందాలను చూడటానికి చాలా మంది వీకెండ్ లో ఇక్కడికి వస్తుంటారు.
ఈ డ్యాం పక్కనే 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పోచారం అభయారణ్యం లో చిరుతలు, ఎలుగుబంట్లు, హైనా, జింకలు తదితర జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి. మంజీర నది ఈ అభయారణ్యం గుండానే ప్రవహిస్తుంది. అందువల్ల మొసళ్లను కూడా మనం చూడవచ్చు.
కిన్నెరసాని అభయారణ్యం
P.C: You Tube
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న కిన్నెరసాని అభయారణ్యం గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడే కిన్నరసాని అనే నది గోదావరి నదిలో కలుస్తుంది. మొత్తం 635 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దట్టమైన అడవిలో చాలా రకాల వన్యప్రాణులను మనం చూడవచ్చు.
ముఖ్యంగా చీత, హైనా, ఎలుగుబండ్లు, పులులు ఎక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి 297 కిలోీమటర్లు, పోల్వాంచ నుంచి 11 కిలోమీటర్లు, ప్రముఖ ధార్మిక కేంద్రం భద్రాచలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉంటుంది.
మృగావని నేషనల్ పార్క్
P.C: You Tube
హైదరాబాద్ నగర శివారులోని మృగావని నేషనల్ పార్క్
విస్తీర్ణం 700 ఎకరాలు. ఈ నేషనల్ పార్క్ గోల్కొండ కోట నుంచి 11.5 కిలోమీటర్లు, నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుది. చిలకూరి బాలాజీ దేవస్థానం దర్శించుకొని వచ్చే సమయంలో చాలా మంది ఈ నేషనల్ పార్క్ ను సందర్శిస్తుంటారు. ఇక్కడ అనేక ఔషద గుణాలున్న మొక్కలతో పాటు అనేక జంతువులు కూడా మనం చూడవచ్చు. జంతువులను చూడటానికి వీలుగా ఇక్కడ వాచ్ టవర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
వారంలో సోమవారం తప్ప మిగిలిన రోజుల్లో ఈ నేషనల్ పార్కులోని జంతువులను చూడటానికి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శన సమయం.