శీతాకాలపు సందర్శనీయ ప్రదేశం.. రణక్పూర్ ఆలయ సముదాయం
ఏటా శీతాకాలం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో డిసెంబర్ నెలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో ముఖ్యంగా కొండ ప్రాంతాలలో తీవ్రమైన చలి మొదలవుతుంది. శీతాకాలంలో హిమపాతం కారణంగా చాలా మంది పర్యాటకులు హిల్ స్టేషన్లతో పాటు రాజస్థాన్ వంటి నగరాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ సీజన్లో రాజస్థాన్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి రణక్పూర్ ప్రాంతం శీతాకాలపు పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. మరీముఖ్యంగా రణక్పూర్ ఆలయం జైనమతం యొక్క ఐదు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా సందర్శకులను ఆకర్షిస్తుంది. అందమైన ఆలయ సముదాయానికి నిలయంగా ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులను ఆహ్వానిస్తోంది.
రణక్పూర్ ఆరావళి శ్రేణిలోని మారుమూల లోయలో ఉంది. ఇది పాలి జిల్లాలోని ఉదయపూర్కు ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలో దర్శనమిస్తోంది. దేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన జైన దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. అంతేకాదు, ఈ ప్రదేశం ఇతర ప్రాంతాలకు రోడ్డు నెట్వర్క్ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. రణక్పూర్ వాతావరణం ఈ సీజన్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో గరిష్టంగా 42°C మరియు కనిష్టంగా 22°C వరకు పెరుగుతుంది. చలికాలం గరిష్టంగా 20°C మరియు కనిష్టంగా 11°C వరకూ ఉంటుంది. ఏడాది మొత్తం వర్షపాతం దాదాపు 55 సెంటీమీటర్లు. శీతాకాలం (అక్టోబర్-మార్చి) ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయంగా చెప్పొచ్చు.
గోడలపై చెక్కిన శిల్ప సౌందర్యం..
రణక్పూర్కి రాణా కుంభ పేరు పెట్టారు. ఈ గొప్ప దేవాలయం నిర్మాణ భూమి కోసం ధర్నా సాహ్ అనే జైన వ్యాపారవేత్త అతనిని సంప్రదించాడట. పాల రాతితో అద్భుతంగా చెక్కబడిన ఇక్కడి జైన దేవాలయాల సముదాయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. గోడలపై చెక్కిన శిల్ప సౌందర్యం మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. ఎటు చూసినా మిరుమెట్లుగొలిపే నిర్మాణశైలి చూపరులను అబ్బుర పరుస్తుంది.
రణక్పూర్ జైన సమాజంలోని ఐదు పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఉదయపూర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాలు AD 1439లో నిర్మించబడ్డాయి. ఇక్కడికి దగ్గరలోని పురాతన ఆలయంగా ప్రసిద్ధి పొందిన సూర్యదేవాలయం, రణక్పూర్ డ్యామ్ వంటి పర్యాటక ప్రదేశాలను విజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఎలా చేరుకోవాలి
వాయుమార్గం ద్వారా - రణక్పూర్కు దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో ఉదయపూర్ సమీప విమానాశ్రయం. ఉదయపూర్ నుండి ఢిల్లీ, జైపూర్, ఔరంగాబాద్, జోధ్పూర్ మరియు ముంబైకి సాధారణ విమానాలు ఉన్నాయి.
రైలు ద్వారా - సమీప ప్రధాన రైల్వే స్టేషన్ ఉదయపూర్. ఈ స్టేషన్ నుండి ఢిల్లీ, చిత్తౌర్ఘర్, అజ్మీర్ మరియు జైపూర్లకు రైళ్లు ఉన్నాయి. రణక్పూర్ నుండి సమీప రైల్వే స్టేషన్ ఫాల్నా. అయితే చాలా మంది పర్యాటకులు ఉదయపూర్కు రైలు ద్వారి చేరుకునేందుకు ఆసక్తి చూపుతారు.
రోడ్డు మార్గంలో - ఉదయపూర్ నుండి తరచుగా ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులో ఉంటాయి. రణక్పూర్ చేరుకోవడానికి మూడు గంటల సమయం పడుతుంది. రాష్ట్ర రవాణా సంస్థ బస్సులతోపాటు ప్రయివేటు సర్వీలు అందుబాటులో ఉంటాయి.