ఆహ్లాదబరిత పర్యాటకం.. పూరి తీరం!
ఒడిశాలోని పూరి నగరం ఎంత అందంగా ఉంటుందో తెలియజేసేందుకే ఈ కథనం. పూరిలో సముద్ర తీరంతోపాటు కోణార్క్ సూర్య దేవాలయం వంటి పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాకుండా, శివార్లలో పిప్లి లాంటి అనేక ప్రసిద్ధ పట్టణాలు కూడా ఉన్నాయి. కోణార్క్ లేదా జగన్నాథ దేవాలయం గురించి ప్రజలకు తెలిసినప్పటికీ, పిప్లి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పూరి అంటేనే దాదాపు ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ప్రదేశం. ఇక్కడ అందుబాటులో ఉండే హోటల్స్ చాలా వరకు మధ్యతరగతి ప్రజల బడ్జెట్కు అనుగుణంగా ఉంటాయి. వివిధ రాష్ట్రాలనుంచి భువనేశ్వర్ను కలుపుతూ రైళ్లు, విమానాలు, బస్సులు ఉన్నాయి. భువనేశ్వర్ చేరుకుంటే, పూరీకి చేరుకోవడానికి కనీసం 45 నిమిషాల నుండి గరిష్టంగా 1.5 గంటల సమయం పడుతుంది. పూరిలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇవి సందర్శించేందుక 24 గంటలు అందుబాటులో ఉంటాయి. పూరీలో లభించే ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడి రెస్టారెంట్లలో భారతదేశం నలుమూలల నుండి వచ్చిన మంచి చెఫ్లందరూ ఒకేచోట సమావేశమైనట్లు అనిపిస్తుంది.
పూరి సముద్ర తీరం
పూరిలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారు, అక్కడ ఒక పక్షం రోజులు లేదా అంతకంటే ఎక్కువ హోటల్ను బుక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ గడిపే సమయం మనకు తెలియకుండానే గడిచిపోతుంది మరి. నిజానికి అనారోగ్యంతో బాధపడేవాళ్లు కోలుకోవడానికి, మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఇక్కడ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. అందుకు కారణం పూరిలోని ప్రకృతి అందాలు మరియు అద్భుతమైన ఆహారం అనే చెప్పాలి. సాధారణంగా పూరి సముద్ర తీరాన్ని ఇక్కడికి వచ్చేవారు ఎవరూ మిస్సవ్వరు.
జగన్నాథ ఆలయం
ఈ ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిజానికి అక్కడికి చేరుకోవడానికి ఎలాంటి బస్సు లేదా టెంపో అవసరం లేదు. అక్కడికి చేరుకోవడానికి కేవలం నడక సరిపోతుంది. జగన్నాథ ఆలయం పూరీలోని అత్యంత ప్రసిద్ధ, పురాతణ దేవాలయంగా ప్రపంచ ఖ్యాతి పొందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పురాణాల ప్రకారం ఆలయానికి సంబంధించిన ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రథసప్తమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. మీరు రథయాత్ర సమయంలో పూరీకి వస్తే, వేలాది మంది ప్రజలు లాగిన భారీ రథాన్ని చూడవచ్చు. ఈ రథంపై మన జగన్నాథుడు మరియు మిగిలిన ఇద్దరు దేవతల ప్రతిమలు ఉంటారు.
కోణార్క్ లేదా సూర్య దేవాలయం
13వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం ఒక అందమైన కళాఖండం. దీనిని ఎవరు నిర్మించారు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ ఈ ఆలయ వైభవాన్ని ఎవరూ కాదనలేరు. చంద్రభాగ నదిపై నిర్మించిన ఈ ఆలయం సూర్య భగవానుడి భారీ రథాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో 12 జతల చక్రాలు ఉన్నాయి. ఇవి సూర్య భగవానుడి రథ చక్రాలను సూచిస్తాయి. రథంలోని ఏడు గుర్రాలు కూడా రాళ్లపై చెక్కబడ్డాయి. ఈ సూర్య దేవాలయానికి ఎదురుగా నాట్ మందిర్ ఉంది. ఈ ఆలయం చాలా వరకు శిథిలమైనప్పటికీ దాని చారిత్రక నేపథ్యం ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తునే ఉంది.
పిప్లి
పిప్లి పూరికి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. ఇది ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. వైవిధ్యభరితమైన హస్తకళలు, చేతితో తయారు చేసిన బొమ్మలు ఇక్కడ దారిపొడవునా తారసపడతాయి. నిజానికి పూరీ నుంచి ఈ హస్తకళలను కొనుగోలు చేసేందుకు చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. పూరీ చుట్టుపక్కల ప్రజలతోపాటు సుదూర ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులైనా ఇటువంటి అద్భుతమైన కళాఖండాలను కొనుగోలు చేయడానికి జీవితంలో ఒక్కసారైనా పిప్లికి వస్తారు. పూరి నుండి పిప్లి వరకు రోడ్డు మార్గంలో ప్రయాణం చాలా అందంగా ఉంటుంది.