అరుదైన జీవవైవిద్యాల చిరునామా లోక్తక్ సరస్సు
ఈశాన్య భారతదేశం ఎన్నో ఆశ్చర్యదాయక విశేషాలకు నిలయమనే చెప్పుకోవాలి. అందులో ముఖ్యమైనది మణిపూర్ రాష్ట్రంలోని లోక్తక్ సరస్సు. ప్రకృతి సోయగాల నడుమ విస్తరించి ఉన్న మార్మిక అడవులను, స్వచ్ఛ సరస్సులను, ఇక్కడి జీవవైవిద్యాలనూ చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. వైవిధ్యభరితమైన వాతావరణంతోపాటు తేలియాడే సరస్సుగా కూడా ఇది ఎంతో పేరుగాంచింది. ఈశాన్య ప్రాంతంలోని ఎన్నో అందమైన ప్రాంతాల్లో ఒకటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోక్తక్ సరస్సు పర్యాటక అందాలను చూసొద్దాం.
మనదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరొందింది ఈశాన్య భారతంలోని లోక్తక్ సరస్సు. ఫుండీస్ కారణంగా ప్రపంచపు తేలియాడే సరస్సుగా కూడా ఇది గుర్తింపు పొందింది. ఫుండీస్ అనేవి పెద్ద స్పాంజీ, సాసర్ ఆకారంలోని దీవులు. జలమట్టానికి దిగువన మట్టితో ఇవి పచ్చదనాన్ని కలిగి ఉంటాయి. ఈ సహజ ఫుండీస్ వాటి పరిమాణం, అందులో ఉండే జీవరాసుల సంఖ్య పరంగా కూడా పెద్దవే.
ఇలాంటి దీవులు ఈ సరస్సులో ఎన్నో ఉన్నాయి. ఇవి నిత్యం స్థానచలనం చెందుతూ ఉంటాయి. అంతేకాదు, ఇవి వాటి పరిమాణాన్ని (సైజ్) మార్చుకుంటూ ఉంటాయి. ఏడాది పొడుగునా వివిధ రుతువుల్లో సరస్సు అంతటా అలా కదులుతూ సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ క్షణాలను పదిలపరచేందుకు ఇక్కడికి వచ్చేవారు తప్పకుండా తమ కెమోరాలకు పనిచెబుతారు.
తేలియాడే నేషనల్ పార్క్
ఇక్కడి స్థానిక ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఈ లోక్తక్ సరస్సుపై ఎంతగానో ఆధారపడ్డారు. అంతేకాదు, ఈ సరస్సును మణిపూర్కు జీవనప్రదాతగా చెప్పవచ్చు. ఈ తేలియాడే దీవుల్లో నివసిస్తూ, అక్కడే తింటూ, పని చేసుకుంటూ నాలుగువేల మందికిపైగా జీవనం సాగిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ప్రపంచపు ఏకైక తేలియాడే నేషనల్ పార్క్ అయిన కైబుల్ లాప్టావో' కూడా ఈ తేలియాడే దీవుల్లోనే ఉంది.
స్వచ్చమైన నీటి అందాలు తిలకించేందుకు ఈ పార్క్ ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఎంతో తీవ్రస్థాయిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న మణిపూర్ డాన్సింగ్ డీర్ అయిన సాంగైను కాపాడేందుకు ఇక్కడ జాతీయ పార్క్ను నెలకొల్పారు. ఈ రకం సాంగై ఈ దీవుల్లో తప్ప మరెక్కడా లేదు.
ప్రకృతి అందాల మధ్య విహారం
అంతేకాదు, ఈ లోక్తక్ సరస్సు అపార జీవవైవిధ్యానికి నిలయం. ఇక్కడ 233 రకాల నీటి మొక్కలున్నాయి. వందకు పైగా పక్షి జాతులు ఈ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. కొండచిలువ, బార్కింగ్ డీర్, సాంబార్ వంటి అరుదైన జీవులతో పాటుగా 425 రకాల జంతువులు ఇక్కడ జీవిస్తున్నాయి. నమ్మశక్యం కాని తేలియాడే దీవులపై ప్రకృతి అందాల మధ్య విహరించడం ఓ మరుపురాని అనుభూతి. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటలలోపు ఈ దీవులను సందర్శించాలి.
ఆ సమయంలో సాంగై జింకలు గుంపులుగా ఆహారం కోసం బయటకు వస్తాయి. ఈ సమయంలో విహరించేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రకృతి సోయగాల నడుమ విహరించేందుకు ఈ ప్రాంతం అనువైన ఎంపికగా చెప్పుకోవచ్చు. మరెందుకు ఆలస్యం కుటుంబ సమేతంగా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.