అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని (నిర్మాణ పనులు జరుగుతున్నాయి). 2014 ముందువరకు ఈ ప్రదేశం ఒక బౌద్ధ క్షేత్రం. క్రీ.శ. ఒకటవ శతాబ్దంలో గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన కాలంలో అమరావతి రాజధానిగా ఉండేదట. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని గా అమరావతి గుర్తించబడటం విశేషం. శాతవాహన కాలంలో అమరావతి ని ధాన్యాకటకం లేదా ధరణికోట అని పిలిచేవారు.
ఇది కూడా చదవండి : 24 గంటల్లో శ్రీశైలం, తిరుపతి దర్శనం ఎలా ?
అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉన్న హిందూ, బౌద్ధ క్షేత్రం. అమరావతి ఇక్కడ ఉన్న అమరేశ్వర దేవాలయం కారణంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచినది. ఆంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతిపెద్ద బౌద్ధ నిర్మాణాల కారణంగా కూడా ప్రపంచ దృష్టిలో పడింది అమరావతి. ఇది రాజధాని కాక మునుపు ఒక గ్రామము. మరు ఇప్పుడు అక్కడ ఆకాశహర్మ్యాలు, అంతర్జాతీయ కేంద్రాలు, ఉద్యానవనాలు, బహుళజాతి కంపెనీలు ఇలా ఎన్నింటికో ఇక్కడ నిర్మాణాలు చేపట్టబోతున్నారు.
గౌతమ బుద్ధుడు 'అమరావతి' ని సందర్శించినట్లా ? లేక అపోహ మాత్రమేనా ??
గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించినట్లు, బోధనలు చేసినట్లు కొన్ని చారిత్రక గ్రంధాలలో పేర్కొన్నారు. మరి కొన్ని గ్రంథాలలో బుద్ధుడు అమరావతిని సందర్శించలేదని అతని శిష్యులు దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి బౌద్ధమత వ్యాపికి కృషి చేసినట్లు చెబుతారు.
అమరావతిలోనూ మరియు దాని చుట్టుప్రక్కల చూడవలసిన సందర్శన స్థలాల విషయానికి వస్తే ..
అమరావతి స్తూపం
అమరావతి స్థూపానికి మహా చైత్య అనే మరో పేరుంది. దీనిని అశోకచక్రవర్తి నిర్మించినట్లు చెబుతారు. దీని నిర్మాణం క్రీస్తు పూర్వమే జరిగింది. ఈ స్తూపం పై బుద్ధుని జీవిత విశేషాలను చెక్కారు.
చిత్రకృప : Jai Kishan Chadalawada
శాతవాహన రాజులు
అశోకుని తర్వాత ఈ ప్రాంతాన్ని శాతవాహన రాజులు పరిపాలించారు. వారు అమరావతిని రాజధానిగా చేసుకొని, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు దోహదపడ్డారు. వారు కూడా మహా చైత్య మీద మరిన్ని బుద్ధుని జీవిత ఘట్టాలను చెక్కించారు.
చిత్రకృప : rayapati jwala
ఆర్కియోలాజికల్ మ్యూజియం
కృష్ణా నది ఒడ్డున ఆర్కియోలాజికల్ మ్యూజియం కలదు. ఇందులో అమరావతి పూర్వపు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గూర్చి చాటిచెప్పే అద్భుత కళాఖండాలు కలవు. 3 వ శతాబ్దంలో విలసిల్లిన బౌద్ధ మత శిల్పాలను సైతం మ్యూజియంలో చూడవచ్చు.
చిత్రకృప : Bhaskaranaidu
టైమింగ్స్
ఆర్కియోలాజికల్ మ్యూజియం సందర్శనవేళలు : ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
ప్రవేశ టికెట్ : రూ. 2/-. (పెద్దలకు మరియు 15 సంవత్సరాల పైబడిన వారికి). ప్రతి శుక్రవారం మ్యూజియం మూసేస్తారు.
అనేక చరిత్ర పుస్తకాలు చదివేదానికంటే ... ఒక్కసారి ఈ మ్యూజియం ను సందర్శిస్తే ఎంతో చరిత్ర తెలుస్తుంది.
చిత్రకృప : Redtigerxyz
అమరేశ్వరాలయం
అమరలింగేశ్వర స్వామి (శివుడు) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి.
చిత్రకృప : రవిచంద్ర
అమరేశ్వరాలయం
గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం.
చిత్రకృప : apendowments.gov.in
అమరేశ్వరాలయం
మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, కుమార స్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్టితమై ఉన్నాడు.
చిత్రకృప : Reshmi Naga Sai Sree M
అమరేశ్వరాలయం
ప్రతి యేటా విజయదశమి రోజున, మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు.
చిత్రకృప : Bhaskaranaidu
కృష్ణా నది
అమరావతి లో కృష్ణా నది తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తెప్పల విహారం ఇక్కడ వచ్చే ప్రతిపర్యాటకుడూ ఆచరించవలసిందే!! కృష్ణా పుష్కరాలు ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాల కొకసారి నిర్వహిస్తారు.
చిత్రకృప : Naidugari Jayanna
గ్రామంలోని ఇతర దేవాలయలు
శ్రీ బాలత్రిపురసుందరీ అమ్మవారి ఆలయం
అమరావతి గ్రామంలోని క్రోసూరు రహదారి చెంత ఈ నూతన ఆలయంలో వేడుకలు కన్నులపండుగగా జరుగుతాయి. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, విగ్రహాలను గుడిలో చూడవచ్చు.
చిత్రకృప : Rammohan65
చేరుకునే మార్గం
కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షించే ఈ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుండి చేరుకోవడానికి నేరుగా బస్సులున్నాయి. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ విజయవాడ నుండి అమరావతికి మోటర్ పడవ సౌకర్యం కల్పించింది. అయినప్పటికీ ఇప్పుడే జలమార్గంలో బోటు సేవలు లభ్యం కావడం లేదు. అందుకు కారణం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టడం. దీనికి సమీప విమానాశ్రయం విజయవాడ.
చిత్రకృప : Imahesh3847