బెంగళూరు నుంచి మైసూరు జర్నీలో మరో నాలుగు గంటలు ప్రకృతి రమణీయతల నడుమ సాగింది మా ప్రయాణం. ఐదు కిలోమీటర్ల దూరం మైసూర్ ఉందనగా కుడివైపున ఎనిమిది కిలోమీటర్ల దూరం ఫుల్ ట్రాఫిక్లోంచి దూసుకుపోయింది మా క్యాబ్. అదే బృందావన్గార్డెన్. గార్డెన్ను పక్కగా ఉన్న డ్యాం దగ్గరకు వెళ్ళాం. డ్యాంకు ఆనుకుని ఉన్న బృందావన్గార్డెన్ను అక్కడి నుండి చూస్తే పచ్చని పొదలమాటున దాగిన ప్రకృతి అందం ఎంతో రమణీయంగా ఉంది. కుటుంబసమేతంగా సేద దీరేందుకు ఈ గార్డెన్ ఓ వేదిక అనే చెప్పాలి. ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటేన్స్ ప్రత్యేక ఆకర్షణ. బ్యాగ్రౌండ్లో వచ్చే సంగీతానికి అనుగుణంగా వయ్యారాలు ఒలకబోస్తూ నాట్యం చేసే నీటిహొయల దారల్ని చూడాలంటే బృందావన్ గార్డెన్లోకి వెళ్ళాల్సిందే.
బెంగళూరు టు మైసూర్ జర్నీ విశేషాలు! (రెండవ భాగం)
బెంగళూరు నుంచి మైసూరు జర్నీలో మరో నాలుగు గంటలు ప్రకృతి రమణీయతల నడుమ సాగింది మా ప్రయాణం. ఐదు కిలోమీటర్ల దూరం మైసూర్ ఉందనగా కుడివైపున ఎనిమిది కిలోమీటర్ల దూరం ఫుల్ ట్రాఫిక్లోంచి దూసుకుపోయింది మా క్యాబ్. అదే బృందావన్గార్డెన్. గార్డెన్ను పక్కగా ఉన్న డ్యాం దగ్గరకు వెళ్ళాం. డ్యాంకు ఆనుకుని ఉన్న బృందావన్గార్డెన్ను అక్కడి నుండి చూస్తే పచ్చని పొదలమాటున దాగిన ప్రకృతి అందం ఎంతో రమణీయంగా ఉంది. కుటుంబసమేతంగా సేద దీరేందుకు ఈ గార్డెన్ ఓ వేదిక అనే చెప్పాలి. ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటేన్స్ ప్రత్యేక ఆకర్షణ. బ్యాగ్రౌండ్లో వచ్చే సంగీతానికి అనుగుణంగా వయ్యారాలు ఒలకబోస్తూ నాట్యం చేసే నీటిహొయల దారల్ని చూడాలంటే బృందావన్ గార్డెన్లోకి వెళ్ళాల్సిందే.
మైసూర్ ప్యాలెస్
మైసూర్ సిటీలోకి వచ్చేశాం. దారి పొడువునా రోడ్లకు ఇరువైపులా ఉడెన్టాయ్స్ అమ్మకాలు ఎక్కువుగా కనిపించాయి. మైసూర్ సిల్క్ వస్త్రాలు కూడా సరసమైన ధరకు ఇక్కడ దొరుకుతాయని డ్రైవర్ చెప్పాడు. అప్పటికే సమయం తక్కువగా ఉండడంతో నేరుగా మైసూర్ ప్యాలెస్ దగ్గరకు వెళ్ళిపోయాం. మైసూర్ రాజభవనం రానేవచ్చింది. ఒకప్పుడు మైసూర్ను పాలించిన ఒడయార్లు నివసించిన భవనాన్నే ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా మార్చారు. ఒడయార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, పురాతన చిత్రపటాలు సందర్శనార్థం ఉంచారు. లోపలి భవన విశేషాలను తెలిపేందుకు గైడ్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఒక్కొక్కరికీ కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ గైడ్లతోపాటు ప్రస్తుతం ఓ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆడియోప్లేయర్ మాదిరిగా ఉండే టేప్రికార్డర్ను హెడ్సెట్తోసహా సందర్శకులకు అందిస్తున్నారు. దీనికోసం యాభై రూపాయలతోపాటు ఐడీ ప్రూఫ్ను ఇవ్వాల్సి ఉంటుంది.
ఎన్నో ఆకర్షణలు..
ఆ పరికరంలో ప్యాలెస్కు సంబంధించిన వివరాలు వివిధ బాషలలో నిక్షిప్తమై ఉంటాయి. భవనం లోపలికి ప్రవేశించిన తర్వాత ఒక్కో మార్గంలో ఒక్కో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ను పరికరంలో నొక్కితే సరిపోతుంది. దానికి సంబంధించిన పూర్తి చరిత్ర మనం ఎంచుకునే బాషలో వినొచ్చు. ఈ టెక్నాలజీ సందర్శకులకు బాగా ఉపయోగపడుతోంది. ప్యాలెస్ లోపల బంగారంతో చేసిన సింహాసనం, రాజదర్బార్, కల్యాణమండపం ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. అలనాటి రాచరిక హుందాతనాన్ని చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన చిత్రపటాలు మరో ఆకర్షణ. మీరుగానీ ఇక్కడకు వచ్చినప్పుడు తొందరపడి ప్యాలెస్ లోపలకెళ్లాక కెమెరా, సెల్ఫోన్లతో క్లిక్ మనిపించకండి. అక్కడ ఫోటోలు నిషేధం.
ఆంధ్ర రుచుల ఘుమఘుమలు
బెంగళూరులోని కోరమంగల ప్రాంతంలో అన్ని రుచులూ అందుబాటులో ఉంటాయని మా స్నేహితుడు చెప్పాడు. కాకపోతే స్టేషన్ నుండి ఆ ప్రాంతానికి పది కిలోమీటర్లు దూరం వెళ్ళాల్సి ఉంటుంది. భోజనం చేయడానికి పది కిలోమీటర్ల ప్రయాణమా? అదీ ఇంత పెద్ద నగరంలో..! అవునులే, ఎలాగో కారు బుక్ చేసుకున్నాంగా..! అని మనసులో అనుకుని బయలుదేరాం. అలా కార్లో మాట్లాడుకుంటూ ఉండగానే కోరమండల్ ఏరియా రానే వచ్చింది. తీరా దిగి చూశాక భలే ఆశ్చర్యం కలిగింది. ఒకటా రెండా ఎటు చూసినా హోటళ్ళే. 'పది రూపాయల పానీపూరీ నుండి పదివేల రూపాయల విదేశీ ఫుడ్ వరకూ ఇక్కడ దొరకని ఫుడ్ వెరైటీలేదు. ఈ ఒక్క ఏరియాలోనే వందకుపైగా హోటళ్ళు ఉన్నాయి' అన్నాడు మావాడు. నిజమే! భోజనం అనగానే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అప్పుడు అర్థమైంది. అంతేకాదు అదే ప్రాంతంలో అచ్చమైన తెలుగు భోజనం అందుబాటులో ఉంది. అదే 'ఆంధ్ర రెస్టారెంట్ నాగార్జున'. కన్నడ ప్రాంతంలో తెలుగు వంటలు రుచి చూడాలని ఆ హోటల్కు వెళ్ళాం. ఆ హోటల్ ఫుల్ రిచ్ లుక్లో కనిపించింది. శాఖాహార, మాంసాహార భోజన ప్రియులకోసం సెపరేటు హాళ్ళే ఉన్నాయి. ప్లేట్ 180 రూపాయలు తీసుకున్నా.. అన్నిరకాల కూరలు, పచ్చళ్ళతో అచ్చతెలుగు భోజనం అందించారు. కడుపారా తిని బయటకు వచ్చాం. ఈ ప్రయాణంలో కంటికి ఇంపైన పర్యాటక ప్రదేశాలు చూడ్డమేకాదు.. చక్కటి భోజనమూ మాకు ఎంతో తృప్తి కలిగించింది.
అందుకే గెట్ రెడీ ఫర్ బెంగళూర్ ట్రిప్. హ్యేపీజర్నీ!!