షిమోగా .. దీనినే శివమొగ్గ అని కూడా పిలుస్తారు. ఇది కర్నాటక రాష్ట్రంలో ఒక జిల్లా మరియు పట్టణ కేంద్రం. షిమోగా అంటే అర్థం ' శివుని యొక్క ముఖం'. ఈ పట్టణం బెంగళూరు నగరానికి 275 కి. మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి పశ్చిమ కనుమలు ఆనుకొని ఉండటం వలన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
షిమోగా ప్రాంతంలో ప్రధానంగా 5 నదులు ప్రవహిస్తాయి. అంతే కాక సహ్యాద్రి పర్వతాలు నిరంతరం వర్షపాతం కలిగి ఉండటం ఇక్కడ సరిపడా వర్షాలు కురుస్తాయి. అందుకే ఈ ప్రదేశాన్ని భూమి పై అవతరించిన స్వర్గంగా అభివర్ణిస్తారు. ఇక్కడ పచ్చని మైదానాలు, ఎత్తైన కొండలు, ఆలయాలు, జలపాతాలు ఉండటం చేత యాత్రికులు ముందుగా షిమోగా రావటానికే ఇష్టపడతారు.
జోగ్ ఫాల్స్
కర్నాటక రాష్ట్రంలో పశ్చిమ దిక్కున థ్రిల్లింగ్ గొలిపే, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జలపాతం ఒకటుంది .. అదే 'జోగ్ జలపాతం'. ఈ జలపాతం శివమొగ్గ సరిహద్దులో, 100 కి. మీ. దూరంలో ఉత్తరం వైపున ఉన్నది. శరావతి నది నుండి ఏర్పడ్డ ఈ జలపాతం, 900 అడుగుల ఎత్తు నుండి కిందకు పడుతుంది. 900 అడుగుల ఎత్తు నుండి ఓంపు సొంపులతో కిందకు పడే ఈ జలపాతం పర్యాటకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. చుట్టూ ఉన్న పచ్చటి పరిసరాలతో ఈ జలపాత అందం చూడటానికి మరింత అందంగా ఉంటుంది.
సందర్శనకు ఉత్తమ సమయం - జూన్ నుండి జనవరి
Photo Courtesy: Darshan Simha
ఒనకి అబ్బి ఫాల్స్
ఒనకి అబ్బి జలపాతాలు కర్నాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినవి. ఈ జలపాతాలు షిమోగా లో ఉండటం ఒక అదృష్టం అనే చెప్పాలి. అగుంబే కి 4 కి.మీ. దూరంలో ఉన్న ఈ జలపాతాల అందాలు పర్యాటకులను వీనులవిందు చేస్తున్నాయి. తీర్థహళ్ళి తాలూకా లో సూర్యాస్తమం కూడా బాగా ఉంటుంది. ఈ జలపాతం చుట్టూ పచ్చిక బయళ్లు, అడవులు ఉండటంతో వాతావరణం చల్లగా ఉంటుంది.
Photo Courtesy: Sri Harsha
ఆచకణ్యా జలపాతాలు
తీర్థహళ్ళి కి 10 కి. మీ. దూరంలో , హోశనగర్ వెళ్లే మార్గం లో ఆరల్శురులి సమీపాన మీరు ఈ జలపాతాన్ని కళ్ళతో పట్టుకోవచ్చు. శరావతి నది నుండి ఏర్పడే ఈ జలపాతం నుండి ఆకులు కిందకు పడటం ఒక అద్భుతమైన అనుభూతి.
Photo Courtesy: karnataka tourism
హిడ్లమనే జలపాతం
హోశనగర్ తాలూకా లో నిట్టూర్ వద్ద హిడ్లమనే జలపాతం పర్యాటకులతో ముంచెత్తుతుంది. చుట్టూ ఉన్న దట్టమైన పచ్చని చెట్ల మధ్యలో, రాళ్ళ కొండల మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళితే మీరు ఈ జలపాతాన్ని చూడవచ్చు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీరు తప్పకుండా క్యారేర్ బాక్స్ లను తీసుకొని వెళ్ళడం మరిచిపోవద్దు.
Photo Courtesy: Saswata Goswami
తుంగ ఆనకట్ట
శివమొగ్గ పట్టణం నుండి తీర్థహళ్ళి కి వెళ్లే మార్గం లో మీకు గజనూర్ అనే గ్రామం కనిపిస్తుంది. ఇక్కడ తుంగ భద్ర డ్యామ్ ఉంది. ఈ ప్రదేశం పర్యాటకులకు సంధ్యా వేళలో, వీకెండ్ లో పిక్నిక్ స్పాట్ గా మారింది.
Photo Courtesy: Savio Pereira
బి ఆర్ పి డ్యామ్
శివమొగ్గ పట్టణానికి 28 కి. మీ. దూరంలో ఉన్న కువెంపు విశ్వవిద్యాలయానికి చేరువలో బి ఆర్ పి డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ భద్ర నది మీద నిర్మించారు మరియు దీని ఎత్తు 194 అడుగులు. భద్ర నది ఇక్కడ ఎన్నో దీవులను ఏర్పాటుచేసింది అంతే కాక బోట్ షికారు ద్వారా ఆ దీవుల వద్దకి వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా కర్నాటక ప్రభుత్వం బోట్ లను నడుపుతుంది.
Photo Courtesy:Arvind Pai
అగుంబే
భారత దేశంలో చిరపుంజి తరువాత అత్యధిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతం అగుంబే. ఇక్కడ సన్ సెట్ చాలా బాగా ఉంటుంది. సముద్ర మట్టానికి 2725 అడుగుల ఎత్తులో ఉడిపి కి వెళ్లే మార్గంలో తీర్థహళ్ళి జలపాతాలకు 35 కి. మీ. దూరంలో ఉంది. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశంనుండి చూసి ఆనందించవచ్చు. ఈ సూర్యాస్తమం ఎలా ఉంటుందంటే వివిధ రకాలైన రంగులలో, ఆకారాలలో పర్యాటకులను అబ్బురపరుస్తుంటాయి.
Photo Courtesy:Sharath Chandra
కొడచాద్రి
సముద్ర మట్టానికి 1411 మీటర్ల ఎత్తున ఉన్న ఈ కొడచాద్రి పట్టణం .. శివమొగ్గ కు 115 కి. మీ. దూరంలో భారతదేశంలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్. ఇక్కడ చూపరులను ఆకట్టుకొనే విశేషం ఒకటుంది అదేమిటంటే కొడచాద్రి పర్వత శిఖరం దట్టమైన అడవుల మధ్యలో నుండి పైకి లేచినట్లు కనిపిస్తుంది. ఈ పట్టణం సుందరమైన ప్రదేశాలకు పెట్టింది పేరు కానీ ట్రెక్కింగ్ కాస్త కష్టం గా ఉంటుంది. అయినా కూడా పర్యాటకులు అడవిలో ట్రెక్కింగ్ ద్వారా నే శిఖరం పైకి చేరుకుంటారు.
Photo Courtesy: Adil Akbar
కుందాద్రి
తీర్థహళ్ళి నుండి అగుంబే వెళ్లే మార్గం లో, గుడ్డెకేరి వద్ద ఉన్న బేగర్ కి 9 కి. మీ. దూరంలో కుందాద్రి కొండ ఉంది. ఇది ట్రెక్కింగ్ ప్రియులకి సాహసోపేతమైన ప్రదేశం. కొండ మీదికి చేరుకోవడానికి తార్ రోడ్డు ఉన్నా, పర్యాటకులు షార్ట్ కట్ మార్గాలలో కొండ మీదికి చేరుకోవడానికి ఇష్టపడతారు. కొండ మీదికి చేరుకోగానే పార్స్వనాథ చైతన్యాలయ నిర్మాణంలో గల ఒక రాయి కనిపిస్తుంది. కొండ మీద నుండి కిందకు చూస్తే తీర్థహళ్ళి నుండి అగుంబే వెళ్లే రోడ్డు వంకర వంకరలుగా గజిబిజీగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు.
Photo Courtesy:mM
హొన్నెమర్దు
జోగ్ ఫాల్స్ నుండి సాగర్ టౌన్ కి వెళ్లే మార్గంలో 25 కి. మీ. దూరంలో ఉన్న సాహసీకుల ప్రదేశం హొన్నెమర్దు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం శరావతి నది ఒడ్డున ఉంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులను ర్యాఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు ఆచరించేలా చేస్తాయి. కొద్దిపాటి డబ్బులు ఇచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి గదులు, ఆహారం మరియు నీటి క్రీడల సామాగ్రి కొన్నుకోవచ్చు. ముఖ్య గమనిక, ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎటువంటి మద్యం, నాన్ - వెజ్ భోజనం, గట్కా వంటి వస్తువులు తీసుకురాకూడదు.
Photo Courtesy: Dheepak Ra
త్యవరి కొప్ప లయన్ సఫారి
త్యవరికొప్ప లయన్ మరియు టైగర్ సఫారి షిమోగా జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఎన్నో పక్షులు, జంతువులు, వలస పక్షులు, చిరుతలు, సింహాలు, పులులు, జింకలు, ఎలుగులను చూడవచ్చు. ప్రకృతి ప్రియులు తప్పక చూడాల్సిన ప్రదేశం. ప్రతి సంవత్సరం వర్షాకాలం తర్వాత సెప్టెంబర్ నుండి జనవరి వరకు సందర్శనకు అనుకూలం. త్యవరి కొప్ప సఫారి పార్కుకు షిమోగా నుండి 20 నిమిషాలలో చేరవచ్చు.
Photo Courtesy: Saurav Pandey
సక్రేబాయలు ఎలిఫెంట్ కేంప్
షిమోగా కు సక్రేబాయలు ఎలిఫెంట్ కేంప్ 14 కి.మీ. దూరంలో ఉండి ఎంతో మంది పర్యాటకులను ఆనందపరుస్తుంది. ఈ ప్రదేశంలో బేబీ ఏనుగుల అనాధ శరణాలయం ఉంది. ఏనుగులకు మావట్లు ఇక్కడ శిక్షణనిస్తారు. సందర్శకులు ఇక్కడి తుంగ నది లో స్నానాలు చేస్తారు. ఏనుగులతో నీటిలో ఆడతారు. ఉదయం 8.30 గం. నుండి 11 గం. ల వరకు విహరించవచ్చు. షిమోగా నుండి ప్రతిరోజూ బస్ లు ఇక్కడికి నడుస్తాయి.
Photo Courtesy: paandu raam
షరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురి
షరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురి విస్తీర్ణం 431 చ.కి.మీ. మరియు పర్యాటకుల ప్రధాన సందర్శనా ప్రదేశం. ప్రఖ్యాత షరావతి నది ఈ అడవి గుండా ప్రవహించటం ప్రధాన ఆకర్షణ. ఈ శాంక్చురీలో వివిధ జాతుల జంతువులు, పులులు, సంబార్ గుంట నక్క, ఎలుగుబంటి, మలబార్ ఉడుత, జింకలు, అటవి పందులు, వంటి జంతువులు మరియు నాగుపాములు, కొండచిలువలు, మొసళ్ళు వంటివి కూడా ఉంటాయి. షరావతి శాంక్చురీ సాగర్ నుండి 7 కి.మీ.ల దూరం మాత్రమే.
Photo Courtesy: Praveen Raj
శెట్టిహళ్ళి వైల్డ్ లైఫ్ శాంక్చువరి
కర్నాటక లోని ప్రఖ్యాత అడవి జంతు ప్రదర్శనాలయా లలో శెట్టిహళ్ళి వైల్డ్ లైఫ్ శాంక్చువరి ఒకటి. ఇది 385 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. దీనిలో కొన్ని మానవుల నివాసాలు కూడా ఉండటం విశేషం. ఎన్నో రకాల జంతువులు, పక్షులు, ఉన్నాయి. గుంటనక్కలు, పులులు, ఏనుగులు, చిరుతలు, మొసళ్ళు, నాగుపాములు, ఎలుగుబంటులు, ముంగీసలు, కొండ చిలువలు కూడా ఉన్నాయి. తీర్ధ హళ్ళికి ఇది 30 కి.మీ. ల దూరంలో ఉంది.
Photo Courtesy: sanctuariesindia
మందగడ్డె పక్షి అభయారణ్యం
మందగడ్డె పక్షి అభయారణ్యం చూడదగినది. తుంగ నది మధ్యలో ఉంది. అనేక పక్షి జాతులుంటాయి. ఇక్కడనుండి యాత్రికులు సాక్రేబైల్ ఏనుగుల శిక్షణ క్యాంపు మరియు గాజనూర్ డ్యాం చూడవచ్చు. ఇది సుమారు 1.14 ఎకరాలలో ఉంది. ఒక మంచి పిక్ నిక్ ప్రదేశంగా ఉంటుంది. ఈ పక్షి ప్రదేశంలో ఒక వాచ్ టవర్ కూడా ఉంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా చూడవచ్చు. మందగడ్డె షిమోగాకు 30 కి.మీ. దూరం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉంది.
Photo Courtesy: Karunakar Rayker
గుడవి పక్షుల అభయారణ్యం
గుడవి పక్షుల అభయారణ్యం దట్టమైన అడవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వివిధ జాతుల పక్షులుంటాయి. పక్షులను గమనించే వారికి ఎంతో ప్రియమైన ప్రదేశం ఇది. ఎన్నో రకాల పక్షులు జూన్ నుండి డిసెంబర్ వరకు ఇక్కడ ఉంటాయి. ఇది. 0.73 చ.కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది షిమోగాకు 15 కి.మీ. దూరంలోను మరియు సాగర్ కు 41 కి.మీ. దూరంలో ఉంటుంది. గుడవి కి షిమోగా నుండి బస్ సౌకర్యం కూడా ఉంది.
Photo Courtesy: S R Warrier
బళ్లేగవి
బళ్లేగవి అనే చారిత్రక ప్రదేశం షీకారిపుర తాలూకా నుండి 21 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో ప్రముఖ వీర శివ శిధిలాలైనటువంటి అల్లామా ప్రభు, అక్క-మహాదేవి, అనిమిషయ్య మరియు ఏకాంతడ రామయ్యా వంటివి దర్శనమిస్తాయి. అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, మాస్టికల్స్, విరగల్స్ మరియు నిసీడిగల్స్ అవశేషాలు ఉన్నాయి. ఇక్కడున్న దేవాలయాలలో, కేదరేశ్వర దేవాలయం సబ్బు రాయితో తయారుచేయబడింది.
Photo Courtesy: kylepounds2001
కెలాడి
షిమోగా జిల్లాలోని సాగర సిటీ కి దగ్గరగా కెలాడి దేవాలయాల పట్టణం ఉంది. ఈ ప్రదేశంలో ఒక మ్యూజియం మరియు మూడు దేవాలయాలున్నాయి. అవి వీరభద్ర, పార్వతి మరియు రామేశ్వర. కెలాడి మ్యూజియంలో నేటికి కెలాడి నాయకుల పాలనలో రచించిన కొన్న పురాతన గ్రంధాలతో పాటు , విలువైన మరియు చరిత్ర ప్రాధాన్యతగల శాసనాలు, నాణేలు, తాళ పత్ర గ్రంధాలు ఉంచబడ్డాయి.
Photo Courtesy: Karthik Udupa
ఇక్కేరి
ఇక్కేరి, షిమోగా జిల్లాలోనే సాగర పట్టణం వద్ద ఉన్న చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక చూడాలి. ఈ ప్రాంతంలో గ్రానైట్ చే నిర్మించబడిన అఘోరేశ్వర దేవాలయం ప్రసిద్ధి. ఈ దేవాలయ రాతి గోడలు వివిధ రకాల బొమ్మలు కలిగి ఉంటాయి. గుడులు, ఏనుగులు, పురాతన కన్నడ లిపి వంటివి వీటిలో కొన్ని. ఈ దేవాలయాన్ని దర్శించే పర్యాటకులు భైరవ, మహిషాసురమర్దిని, సుబ్రమణ్య మరియు గణేష బొమ్మలను కూడా చూడవచ్చు.
Photo Courtesy: Saurav Pandey
కూడ్లి
షిమోగా పట్టణానికి 16 కి. మీ. దూరంలో ఉన్న కూడ్లి లో తుంగ మరియు భద్ర నదులు ఒకదానికొకటి కలుస్తాయి. అందుకే దానికి ఆ పేరు. దేవాలయాలు, హెరిటేజ్ ప్రదేశాలు అధికంగానే కనిపిస్తాయి. ఇది దక్షిణ వారణాసిగా పేరుగాంచినది. రుష్యశర్మ, బ్రహ్మేశ్వర, నరసింహ, రామేశ్వర ఆలయాలు ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి. అంతే కాక 600 సంవత్సరాల పూర్వం హొయసల మరియు ఒక్కేరి రాజులు శిలా శాశనాలతో వేయించిన శంకరాచార్యుని విగ్రహం కూడా తప్పక సందర్శించవలసినదే ..!
Photo Courtesy:Ananda Matthur
చంద్రగుట్టి
చంద్రగుట్టి ప్రదేశం సొరబ తాలూకా మరియు సిద్దాపుర మధ్యలో ఉన్నది. ఈ చారిత్రక పుణ్య ప్రదేశం లో రేణుకాంబ ఆలయం ముఖ్యమైనది. ఇది సొరబ తాలూకా కి 16 కి.మీ. దూరంలో, సముద్ర మట్టానికి సరాసరి 848 అడుగుల ఎత్తులో ఒక పరుపు లాంటి కొండ మీద నిర్మించారు.
Photo Courtesy:Rekha Shashi
హుంచ (హుమ్చ)
షిమోగా పట్టణానికి 54 కి. మీ. దూరంలో ఉన్న హుంచ, జైనుల ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ పద్మావతి అమ్మవారి ఆలయం. జైనుల ఆలయాలైన పంచకూట , జైన్ మట్ తో పాటుగా ఇతర ఆకర్షణలు కూడా ఆసక్తి కరమైనవే ..!
Photo Courtesy:Dinesh
భద్రావతి
భద్రావతి పట్టణానికి గుండె కాయ వంటిదైన హొయసులు నిర్మించిన లక్ష్మి నరసింహ ఆలయం మరియు తుంగ నది ఒడ్డున నిర్మించిన రామేశ్వర ఆలయం కర్నాటక రాష్ట్రం నలుమూల నుంచి భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు తుంగ నది లో మునిగి స్వామి వారి దర్శనానికి బయలుదేరుతుంటారు. ఈ ప్రదేశం లో ప్రఖ్యాతి గాంచిన పరిశ్రమలు ఉన్నాయి.
Photo Courtesy:PixelPyx
నగర
షిమోగా కి 19 కి. మీ. దూరంలో 16 వ శతాబ్ధానికి చెందిన ఒక చారిత్రక ప్రదేశం ఉంది. 16 వ శతాబ్ధంలో దీనిని 'బీందనూర్' అని పిలిచేవారు. ఇక్కడ శివప్ప నాయిక భవనం, నీలకంఠేశ్వర ఆలయం, దేవగనా ట్యాంక్ మరియు వెంకటరమణ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణలు గా నిలిచాయి.
Photo Courtesy:Amit Rawat
బండలికే
షికారిపుర తాలూకా కు 35 కి. మీ. దూరంలో ఉత్తరం వైపున, ఆలయాలకు ప్రసిద్ది గాంచిన బండలికే ఉంది. ఇక్కడ రాష్ట్ర కూటములు మరియు కదంబాస్ కాలంలో చెక్కించిన శిల్పాలు, రాయించిన శిలా శాశనాలు కనపడతాయి. శాంతినాథ్ బసడి, సహస్రలింగ ఆలయం మరియు సోమేశ్వర త్రిమూర్తి ఆలయం ఇక్కడ చూడవలసిన ఆలయాలుగా ప్రసిద్ధి చెందినాయి.
Photo Courtesy: Prashanth H J
శివప్ప నాయక్ ప్యాలెస్
షిమోగా జిల్లా చారిత్రాత్మకంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఎన్నో చారిత్రక అంశాలు కూడా కనపడతాయి. వాటిలో శివప్ప నాయక్ ప్యాలెస్ మరియు మ్యూజియం ఒకటి. ఈ ప్యాలెస్ ను పూర్తిగా రోజ్ వుడ్ తో కేలాడి రాజు శివప్ప నాయక్ నిర్మించాడు. కేలాడి రాజ్య చరిత్ర, వారసత్వం వంటివి ఈ బిల్డింగ్ లోని మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. తుంగ నది ఒడ్డున ఈ ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ షిమోగా నగర నడిబొడ్డున ఉంది. రవాణా సదుపాయం తేలిక. లోకల్ బస్ లు కూడా ఉన్నాయి. టాక్సీలు, రిక్షాలలో కూడా నిమిషాలలో చేరవచ్చు.
Photo Courtesy: kanataka tourism
సెక్రెడ్ హార్ట్ కేధడ్రల్ చర్చి
సేక్రెడ్ హార్ట్ కేధడ్రల్ చర్చి శిల్ప కళలకు ప్రసిద్ధి. దేశంలో రెండవ అతి పెద్ద చర్చిగా పేరొందింది. ఈ చర్చి మెయిన్ హాల్ 18,000 చదరపు అడుగులతో ఎంతో విశాలంగా ఉంటుంది. అతి పెద్ద లార్డ్ జీసస్ క్రిస్ట్ విగ్రహం ఇక్కడ ఆకర్షణ. మెయిన్ హాలులో 5000 మంది కూర్చొనవచ్చు. షిమోగా నుండి ఆటో రిక్షా లేదా క్యాబ్ లలో బిహెచ్ రోడ్ చేరి అక్కడినుండి సేక్రెడ్ హార్ట్ కేధడ్రల్ చేరవచ్చు.
Photo Courtesy: Babish VB
కన్నూర్ ఫోర్ట్
జోగ్ ఫాల్స్ నుండి దట్టమైన అటవీ మార్గాన 50 కి. మీ. దూరంలో ఉన్న భట్కల్ వెళితే కానూర్ కోట మీకు కనిపిస్తుంది. కరి మనీసేన రాణి అబ్బక దేవి ఈ కోట ని నిర్మించింది. ఈవిడ కేలాడి రాజ్య వంశస్థులలో రాణి.
Photo Courtesy: karnataka tourism
కావలెదుర్గ
సముద్ర మట్టానికి 5056 అడుగుల ఎత్తులో కొండ మీద నిర్మించిన ఈ అద్భుత కోట పర్యాటకులను కనువిందుచేస్తుంది. తీర్థహళ్ళి నుండి ఈ కోట 16 కి. మీ. దూరంలో ఉంది.
Photo Courtesy: Arun Sachi
కుబెటుర్
కుబెటుర్ అనే ప్రదేశం చరిత ప్రసిద్ధి గాంచినది. ఈ ప్రదేశం షిమోగా జిల్లాలోని సొరబ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో ఏడు అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. ఇవే ఇక్కడున్న ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం శిధిలావస్థలో కొన్ని ఉన్న, దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళలు నాటి శిల్పుల పనితానాన్ని గుర్తుచేస్తాయి.
Photo Courtesy: Dineshkannambadi
తలగుండ
షిమోగా జిల్లాలో షికారిపుర తాలూకా లో ఉన్న తలగుండ ఒక గ్రామము. ఇక్కడ ఆనాడు పరిపాలించిన కేలాడి రాజులు ఎన్నో శాశనాలు వేయించారు. ఇక్కడ ప్రాన్శెశ్వర ఆలయం తప్పక సందర్శించవలసినది.
Photo Courtesy: Amarrg
షిమోగా నగరం చుట్టూ పక్కల
షిమోగా పట్టణం చుట్టుపక్కల రామన్న శ్రెస్తే పార్కులో గణపతి దేవస్థానం, గాంధీ బజార్ లో బసవేశ్వర ఆలయం, మారికంబ దేవస్థానం, కన్నిక పరమేశ్వరి మొదలైనవి చూడవచ్చు. ఇక్కడ 21 కంటే ఎక్కువగా గణపతి దేవస్థానాలు ఉన్నాయి.
Photo Courtesy: Chidambara
శివమొగ్గ ఎలా చేరుకోవాలి ??
బస్ ప్రయాణం
జాతీయ రహదారి 206 ద్వారా టుంకూరు, అర్సికెరె, బాణవర, కడూరు, బీరూర్, తరికెరె, భద్రావతిల మీదుగా షిమోగా చేరవచ్చు. బెంగుళూరు నుండి 247 కి.మీ. లు ఉంటుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు నడుపుతోంది.
రైలు ప్రయాణం
షిమోగా లో రైల్వే స్టేషన్ ఉంది. షిమోగా రైలు పై బెంగుళూరు, మైసూర్ స్టేషన్ లకు కలుపబడింది. బీరూర్ జంక్షన్ షిమోగా కు సమీపం.
విమాన ప్రయాణం
షిమోగాకు సమీప విమానాశ్రయం మంగుళూరు. ఇది 180 కి.మీ. దూరం.
Photo Courtesy: Irrigator