బీదర్ అనే పేరు ఇడియట్ సినిమాలో అలీ వాడతాడు ....గుర్తొచ్చిందా!! అదేనండి బైక్లు దొంగతనాలు చేసుకుంటూ, పోలీస్ కి మాస్కా కొట్టి తప్పించుకుంటాడే... ఆ మైండ్లోకి వచ్చిందా!! ఇప్పుడు మనం ఆ బీదర్ గురించే మాట్లాడుకుంటున్నాం!!
కొన్ని ప్రదేశాలు మామూలుగా అయితే పర్యాటక స్థలాల్లా అనిపించవు. అక్కడికి వెళ్లి చూస్తేనే వాటి ప్రత్యేకత తెలుస్తుంది. అటువంటి వాటిలో హైదరాబాద్కి దగ్గర్లోలోని కర్నాటక ప్రాంతమైన బీదర్ ఒకటి. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో మద్యనిషేధం ఉన్నప్పుడు 'బీరు బాబులు' తరచూ బీదర్కి ప్రయాణం కడుతుండేవారు. దురదృష్టవశాత్తు బీదర్ అలా మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఇది కూడా చదవండి : గుల్బర్గా - బహమనీయుల రాజధానీ !
చరిత్ర విషయానికొస్తే..
బీదర్ పట్టణం ఒకప్పుడు విదురా నగరం పేరుతో ఉండేదట. మహాభారతంలోని విదురుడు ఇక్కడే ఉండేవాడట. అయితే అది పురాణం. చరిత్ర ప్రకారం క్రీ.శ.1429 లో బహమనీ రాజు ఒకటవ అహ్మద్ షా దీన్ని రాజధానిగా చేసుకున్నాడు. 'అహ్మదాబాద్ బీదర్' అని పేరు మార్చాడు. దాదాపు ఒక శతాబ్దం పాటు బహమనీ రాజుల పాలనలో ఉన్న బీదర్, క్రీ.శ.1527 లో దక్కను పాలకులైన బరీద్ షాహీల చేతుల్లోకి వెళ్లింది. మరో రెండు వందల సంవత్సరాల తర్వాత ఔరంగజేబు బీదర్ని ఆక్రమించాడు. అతనుక్రీ.శ. 1713 లో ఆసఫ్ జాహీని దక్కను ప్రాంత సుబేదారుగా నియమించాడు. ఆసఫ్ జాహీ క్రీ.శ.1724 లో నైజాం ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. ఇంతమంది చేతులు మారినా, బీదర్లో మనకు కనిపించే శిధిల కట్టడాల్లో చాలా వరకు బహమనీ రాజులవే కావడం విశేషం. బీదరంతా శిధిలమౌతున్న మహా నిర్మాణంలా అనిపిస్తుంది. ఇక్కడున్న కొన్ని ప్రదేశాలను తిలకిద్దాం!!
ఫ్రీ కూపన్ సేల్ : క్లియర్ ట్రిప్ వద్ద హోటళ్లు బుక్ చేసుకోండి 50% వరకు ఆఫర్ పొందండి
చౌబారా
చౌబారా ఎనభై అడుగుల ఎత్తున్న పహారా గోపురం. దానిని చౌబారా అంటారు. అయిదు శతాబ్దాల క్రితం దాని పైన సైనికులు పహారా కాస్తూ పట్టణానికి రక్షణగా ఉండేవారట. ఇప్పుడు మాత్రం అది ట్రాఫిక్ ఐలాండ్లా ఉంది!ఇటీవలి కాలంలో ఈ మహాగోపురంపై ఓ భారీ గడియారం అమర్చారు. చాలా క్లాక్ టవర్లలాగే అదీ పనిచేయడం లేదు. ఆ పహారా గోపురం పైకి వెళ్లే మార్గం తాళం వేసి ఉంది. ఎప్పుడూ తీయరట. ఎవరూ పట్టించుకోరట కూడా!
Photo Courtesy: Abhinaba Basu
బీదరు కోట
ఇక్కడ క్రీ.శ.15 వ శతాబ్దపు బీదరు కోట ఉంది.ఈ బీదరు కోట అంత శిధిలావస్థలో ఉన్నా, మిగితా కోటల కన్నాకాస్త మేలు. కిలోమీటర్ల కొద్దీ పాకిన గోడలు, వాటిపై అక్కడక్కడా టవర్లు ఇంకా గత కాలపు రాజసాన్ని చూపుతున్నాయి. అద్భుతమైన 'ఆర్చీలు', ఒక భారీ మర్రి చెట్టు చూడ్డానికి వింతగా వున్నాయి. ఆ చెట్టుకి సమీపంలో 'రంగీన్ మహల్' ఉంది. దీన్ని క్రీ.శ.1487 లో ఒకటవ మహ్మద్షా నిర్మించాడు. దీనిలో ఇంకా రంగురంగుల పలకలు, ముత్యాలు అమర్చిన నగిషీలున్నాయి. దాని పక్కనే ఒక చిన్న మ్యూజియం ఉంది. ఒకప్పుడు అది రాజుల స్నానశాల! రాతియుగం నాటి పరికరాలు, విగ్రహాలు, ఆభరణాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి.
Photo Courtesy: MIRZARAZA7860
సోలా కుంభ్ మసీదు
ఇవన్నీ ఒక ఎత్తైతే, కాస్త దూరంలో ఉన్న 'సోలా కుంభ్ మసీదు' మరో ఎత్తు. దీన్ని క్రీ.శ. 1423 లో నిర్మించారట. దీని మధ్య భాగంలో 16 స్తంభాలున్నాయి. అందువల్లే ఆ పేరు. ఈ మసీదుకి తాళం వేసి ఉంటుంది. కానీ మ్యూజియంలో వారిని అడిగి తీయించవచ్చు. మసీదు చుట్టూ అందమైన గార్డెన్ కూడా ఉంది.మసీదు నుండి బయటికి వస్తుంటే కోట తాలూకు గాంభీర్యం ఇంకా కనిపిస్తుంది. అసలు ఈ కోట మూడవ శతాబ్దంలో యాదవులు, కాకతీయులకు చెందినదని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ తర్వాత దీన్నే సుల్తాన్ అహ్మద్ షా బహమనీ తన కోటగా మార్చుకుని, టర్కీ-పర్షియా నుండి కళాకారులను పిలిపించి పునర్నిర్మించాడు.
Photo Courtesy: Kalyankumar13
మహమూద్ గవన్ మదరసా
చౌబారా గోపురానికి సమీపంలోనే మహమూద్ గవన్ మదరసా ఉంది. ఇది దాదాపుగా శిధిలమైపోయినట్లే. అప్పట్లో ఇది మూడంతస్థుల భవనమట. దీనికి నాలుగు ఎత్తైన మినార్లూ ఉంటేవట. ఇప్పుడొక్కటే మిగిలింది. దానిపై తాపడం చేసిన నీలం, తెలుపు, పసుపు రాళ్లు ఇరాన్ నుండి తెప్పించారట.
Photo Courtesy: Jayadeep Rajan
బహమనీ సుల్తానుల టూంబ్ లు
ఇక్కడికి దగ్గర్లోనే బహమనీ సుల్తానుల సమాధులున్నాయి. అయితే ఇవన్నీ అత్యంత హీనావస్థలో ఉన్నాయి. సుల్తాన్ హుమయున్ సమాధి మాత్రం పిడుగు వల్ల రెండుగా చీలిపోయింది. ఇవన్నీ చూస్తే చరిత్ర ఎంత ఘనంగా ఉండేదో అనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి పర్యాటకులను రప్పించవచ్చనిపిస్తుంది కూడా!!
Photo Courtesy: Krb2383
బిద్రీ కళ
బీదర్లో శతాబ్దాలనాటి శిధిలాలూ, సుల్తానుల సమాధులే కాదు... అద్భుతమైన 'బిద్రీ' కళ కూడా కనిపిస్తుంది. నల్లటి లోహపు పాత్రలపై తెల్లటి వెండి దారాలతో అందమైన చిత్రాలుగా అమర్చడం బిద్రీ ప్రత్యేకత. ఆ కళాకారుల వేళ్లు సున్నితంగా కళాఖండాలు సృష్టించడం చూస్తుంటే అబ్బురపోక తప్పదు. బీదర్ వెళ్తే మాత్రం కచ్చితంగా ఒక బిద్రీ పాత్ర తెచ్చుకుంటారు. అంత బావుంటాయవి!
Photo Courtesy: Ashley Van Haeften
జాలా నరసింహ దేవాలయం
ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్షసుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట . అప్పుడు లక్షీ నరసింహ స్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల , ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసింహ స్వామి . ఐతే నువ్విక్కడే వెలవాలి , నిన్ను నా పేరు తో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసింహ స్వామి అక్కడ వెలిశి ' జలానరనరసింహుడు ' గా కొలవబడుతున్నాడు . జలా అంటే నీరు కాబట్టి , నరసింహ స్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇలా 600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే కానీ జాలా నరసింహుని సందర్శన సాధ్యం కాదు.
Photo Courtesy: bidar tourism / temples
ఎలా వెళ్ళాలి??
విమాన సదుపాయం
బీదర్ కు హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి బస్సుల ద్వారా గానీ, టాక్సీ ల ద్వారా గానీ బీదర్ చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయంకి దేశంలోని విమానాలే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి విమానాలు వస్తుంటాయి. ఈ విమానాశ్రయం బీదర్ కు సుమారుగా 140 కి. మీ. దూరంలో ఉన్నది. బసవకల్యాణ్ అనేది బీదర్ కి 77 కి. మీ. దూరంలోని మరొక దేశీయ విమానాశ్రయం.
రైలు సదుపాయం
బీదర్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలచే అనుసంధానించబడింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు మరియు ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ గుండా వెళుతుంటాయి.
బస్సు సదుపాయం
ఈ పట్టణం గుండా 9 వెళుతుంది. కనుక బస్సులకు ఎటువంటి ఢోకా లేదు. హైదరాబాద్ నుంచి బీదర్ కి మూడు గంటల ప్రయాణం. గవర్నమెంట్ బస్సులతో పాటుగా ప్రైవేట్ బస్సులు కూడా దొరుకుతాయి. బెంగళూరు, బసవకల్యాణ్, బీజాపూర్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సులు తిరుగుతూనే ఉంటాయి.
Photo Courtesy: Amit Chattopadhyay