పంచక్కి ఒక సాంకేతిక పరిజ్ఞానానికి సాక్షి, అంతేకాక రాముడు తన ప్రయాణ కాలంలో గడిపిన ప్రదేశం రాంటెక్ మరియు దౌలతాబాద్ కోట రహస్యాలు, కైలాశుని ఆలయం వంటి ప్రధాన ఆకర్షణల గురించి ఒక లుక్ వేద్దాం పదండి!!
మీరు ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలో ప్రయాణించారంటే అద్భుత అందాలను ఆశ్వాదించవచ్చు. దక్కన్ పీఠభూమి ప్రాంతాల గురించి లోతైన విశ్లేషణ, అదేవిధంగా అజంతా ఎల్లోరా వంటి ప్రపంచ వారసత్వ ఆకర్షణలు ఇలా చెప్పుకుంటూ పోతే..
ఔరంగాబాద్ గుహలు
ఔరంగాబాద్ గుహలు బీబీ కా మక్ బర కు ఉత్తరాన సుమారు 2 కి. మీ. దరంలో కలవు. అద్భుతమైన ఈ గుహలు బౌధ్ధమతానికి సంబంధించినవి. వీటిని సుమారు క్రీ.శ 2వ మరియు 7వ శతాబ్దాలలో కనుగొన్నారు. మొత్తంగా ఇక్కడ 7 గుహలు కలవు. వీటిని రెండు ప్రదేశాలుగా విభజించారు. మొదటి అయిదు గుహలు పశ్చిమ గ్రూప్ గుహలుగాను చివరి అయిదు గుహలను తూర్పు గ్రూప్ గుహలుగా విభజించారు.
వీటిలో నెం.3 మరియు 7 గుహలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి రూపకల్పన హిందూమత తంత్ర శైలిలో కలదు. సందర్శించు సమయం: గుహ దర్శించాలంటే ప్రవేశ రుసుము భారతీయులకు రూ.10 గాను విదేశీయులకు రూ.100 గాను కలదు. ఉదయం 9 గం. ల నుండి సా.5 గం.ల వరకు దర్శించవచ్చు.
బీబీ కా మక్ బర
బీబీ కా మక్ బర ప్రసిద్ధ కట్టడం. ఔరంగాబాద్ నుండి 5 కి.మీ.ల దూరంలో కలదు. దీనిని ఔరంగజేబ్ కుమారుడు తన తల్లి బేగం రబియా దురాని జ్ఞాపకార్ధం 1678లో నిర్మించాడు. ఈ కట్టడాన్ని అటా ఉల్లా తాజ్ మహల్ పోలికలో రూపొందించాడు. చాలావరకు నిర్మాణం తాజ్ మహల్ ను పోలి ఉన్నప్పటికి దానికి దీటుగా రాణించలేకపోయింది. చివరకు ఒక చవకబారు నిర్మాణంగా మారింది. దీని నిర్మాణంలో శాండ్ స్టోన్ ఉపయోగించారు. మార్బుల్ డోం కట్టారు. సమాధి మార్బుల్ తోను ఎనిమిది కోణాల ఆకారంలోను నిర్మించారు. సందర్శించు సమయం: ఈ నిర్మాణాన్ని చూడాలంటే ఉదయం 8 గం. నుండి 6 గం. ల వరకు చూడవచ్చు. భారతీయులకు రూ. 10, విదేశీయులకు రూ. 100 ప్రవేశ రుసుము కలదు.
Photo Courtesy: Arian Zwegers
దౌలతాబాద్ కోట
పెద్ద పెద్ద కోటల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు కలిగే అనుభూతులే వేరు. తక్కువ జనాభా ఉన్న ఆ రోజుల్లో అంత భారీయెత్తు కట్టడాల నిర్మాణానికి అంతమంది మనుషులు ఎక్కడనుండి దొరికారా అనిపిస్తుంది. దురాశ, అధికారదాహంతో తమలోతాము యుద్ధాలు చేసుకుంటూనే మధ్య ప్రాచ్యం నుంచీ దేశాన్ని కొల్లగొట్టేందుకు వచ్చినవారితో మరోపక్క తలపడుతూ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించిన మధ్యయుగపు రాజుల నాటి చరిత్రకు మౌనసాక్షి ఈ కోట. ఎనిమిది వందల యేళ్లలో ఎనిమిది రాజవంశాలు పెరిగి విరగడాన్ని చూసిన ఘనమైన కోట ఇది. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఈ కోటమీద యుద్ధానికి దిగి 1318 లో దీన్ని జయించాడు. తిరుగుబాటు చేసిన హరపాలదేవను బతికుండగానే చర్మం వొలిపించి, అతని శరీరాన్ని కోటగుమ్మానికి వేలాడదీయించాడని గాథ.నూట ముప్పై యేళ్ళు పాలించి, అందులో పాతికేళ్ళపాటు ఢిల్లీసుల్తానును ప్రతిఘటించిన యాదవ వంశం అలా విషాదంగా అంతరించింది. తరువాత వరుసగా తుగ్లక్, బహమనీ, నిజాంషాహి, మొఘల్, అసఫ్జాహి, పేష్వాల దర్జాలను ధరించి భరించింది దౌలతాబాద్ (సంపదల నిలయం)గా మారిన దేవగిరి. దేవగిరికి దౌలతాబాద్ గా పేరు మార్చింది తుగ్లక్.
Photo Courtesy: Todd vanGoethem
కైలాస దేవాలయం
పదహారవ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టగానే కన్పించే ద్వజస్థభం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ద్వజస్థంభ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందట. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. దాదాపు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయానికి రెండువైపులా రెండంతస్థుల నిర్మాణాలు ఉన్నాయి. వీటి నిర్మాణం సైతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలో హిందూమత ఇతిహాసాలైన రామాయణ, మహాభారత గాధలను చెక్కడం విశేషం. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.
Photo Courtesy: cool_spark
రాంటెక్ దేవాలయం
రాంటెక్ అనే ప్రాంతం రాముడు, సీత మరియు లక్ష్మణుడు తమ ప్రయాణ కాలంలో కొంత సమయం గడిపిన చోటుగా నమ్ముతారు. దీనిని ఒక పుణ్య క్షేత్రంగా గుర్తించినారు. ఇది 600 సంవత్సరాల పురాతన దేవాలయం. రాముడు ఈ ప్రాంతంలో ఉన్నందువల్లే దీనికి రాంటెక్ అన్న పేరు వచ్చింది. ఈ రామ కొండ మీద కోతులు తమ నివాసాన్ని ఏర్పాటుచేసుకొన్నవి. వీటితో పాటు అనేకానేక చిన్న దేవాలయాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
Photo Courtesy: Muk.khan