ఆ పుణ్యక్షేత్రంలో పరమశివుడు తన భార్యను సైతం మరిచిపోయి కొద్ది రోజుల పాటు కొలువై ఉన్నాడు. చివరికి ఆ భ్రమరాంబ తన చెలికెత్తలను పంపి ఆ పరమశివుడిని తన వద్దకు రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ క్షేత్రం నుంచి దూరం కావడానికి ఇష్టంలేని ఆ సదాశివుడు ఇక్కడ స్వయంభువుగా శివలింగం రూపంలో కొలువై ఉన్నాడు.
కలియుగాంతం వరకూ తాను అక్కడ ఉంటానని స్వయంగా చెప్పుకొన్నట్లు పురాణ కథనం. అంతేకాకుండా ఆ పుణ్యక్షేత్రం ఓ రాక్షసరాజు పేరు పై వర్థిల్లితోంది. సంతాన భాగ్యంలోని తల్లిదండ్రులు ఆ క్షేత్ర సందర్శనంతో ప్రయోజనం పొందుతారని చెబుతారు. ముఖ్యంగా గ్రహ, సర్పదోష నివారణకు ఎక్కువ మంది ఆ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.
శ్రీరామ చంద్రుడి వంటి పురాణ పురుషుడి నుంచి కృష్ణదేవరాయ వంటి రాజుల వరకూ ఎంతో మంది ఆ స్వామిని సేవించారని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...
మునులతో ఆ పరమశివుడు
P.C: You Tube
ప్రమద గణాలతో పాటు కొంతమంది మునులు వెంటరాగా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడు మంగళాద్రి అంటే నేటి మంగళగిరి నుంచి గర్తపురి అంటే నేటి గుంటూరుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ రెండు ప్రదేశాల మధ్య గల ఒక అందమైన ప్రదేశాన్ని చూసి ముచ్చటపడుతాడు.
బిల్వార్చన, నృత్యాలు
P.C: You Tube
అటు పై కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండిపోయాడు. అదే ప్రస్తుత పెద కాకాని. ఇదిలా ఉండగా, విషయం తెలిసిన చుట్టుపక్కల తపస్సు చేసుకొంటున్న మునులు, సిద్ధయోగులు ఇక్కడికి వచ్చి స్వామివారిని బిల్వార్చనలతో, నృత్యగీతాలతో స్వామివారిని సేవించారు.
భ్రమరాంబ
P.C: You Tube
ఇప్పటికీ భక్తులు పర్వదినాల్లో ప్రభలు కట్టి మేళతాళాలతో స్వామివారిని సేవిస్తూ ఉంటారు. పరమేశ్వరుడు తిరిగి శ్రీశైలం రాకపోవడంతో పార్వతీ దేవి దిగులు పడుతుంది. దీంతో స్వామివారి జాడ తెలుసుకొని ఆయన్ను తిరిగి శ్రీశైలం తీసుకువచ్చే బాధ్యతలను తన చెలికెత్తలైన జయ, విజయులకు అప్పగిస్తుంది.
ఇక్కడ స్వయంభువుగా
P.C: You Tube
దీంతో వారు అడవులన్నీ తిరిగి చివరికి పరమేశ్వరుడి జాడ తెలుసుకొంటారు. పార్వతీదేవి దిగులును స్వామివారికి తెలిపి తిరిగి శ్రీశైలం రమ్మని కోరుకొంటారు. దీంతో పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు.
భరద్వాజ మహర్షి
P.C: You Tube
దీంతో స్థానిక మునులు ఈ శివలింగం వద్దే నివాసాలు ఏర్పరుచుకొని దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భరద్వాజ మహర్షి కాకానికి చేరుకొంటాడు. ఇక్కడి వాతావరణాన్ని చూసి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని చేయాలని భావిస్తాడు.
హోమ ద్రవ్యాలను
P.C: You Tube
ఇందుకు అవసరమైన హోమ ద్రవ్యాలను సమకూర్చుకొంటాడు. అటు పై యాగకుండాన్ని నిర్మింపజేసి అందులో అగ్నిని ప్రజ్వలింపచేస్తాడు. అటు పై యాగ నియమాల ప్రకారం మోమ ద్రవ్యాలను యాగంలో వేసి దేవతలకు ఆహుతులను సమర్పించసాగాడు.
కాకి రూపంలో ఉన్న కాకాసురుడు
P.C: You Tube
అయితే అప్పుడే అక్కడకు వచ్చిన ఓ కాకి ఆ యాగ ద్రవ్యాలను తినసాగింది. దీంతో యాగం సరిగా సాగకుండా దానికి ఆటంకాలు ఏర్పడసాగాయి. దీంతో భరద్వాజ మహర్షి వేదనతో కాకిని అక్కడి నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు.
బ్రహ్మ వరం వల్ల
P.C: You Tube
ఇంతలో కాకి మానవ భాషలో తాను ఓ గందర్వుడని ఓ మునిశాపం వల్ల కాకి రూపాన్ని పొంది కాకాసుర పేరుతో ఈ ప్రాంతంలో తిరుగుతున్నానన్నారు. ఇక బ్రహ్మ వరం వల్ల యాగ ద్రవ్యాలను తినడమే కాకుండా ఆహుతుల్లో సగం నాకు చెందనున్నాయన్నారు.
సప్త నదుల నుంచి నీరు
P.C: You Tube
అయితే దీని వల్ల నీ యాగం పరిసమాప్తం కావడం కష్టమన్న విషయం తనకు తెలుసని కాకి రూపంలో ఉన్న కాకాసురుడు పేర్కొంటాడు. తనకు శాప విమోచనంతో పాటు యాగం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తికావడానికి సప్త నదుల నుంచి నీటిని తీసుకువచ్చి శివుడు స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రంలో నన్ను అభిషేకించాలని సూచిస్తాడు.
మల్లెపూలతో
P.C: You Tube
భరద్వాజ మహర్షి తన పరివారానికి ఈ పనిని పురమాయించి కాకి రూపంలో ఉన్న కాకాసురుడి కోరికను తీరుస్తాడు. దీంతో కాకాసురుడికి శాపవిముక్తి కలిగుతుంది. వెంటనే అక్కడే ఉన్న మల్లెపూలతో శివుడిని అర్చించి వెళ్లిపోతాడు.
అగస్త్య మహాముని
P.C: You Tube
అందువల్లే ఇక్కడ ఉన్న ఈశ్వరుడికి మల్లికార్జునడనే పేరు వచ్చింది. అదే విధంగా కాకాసురుడి పేరు పై ఈ క్షేత్రానికి కాకాని అనే పేరు స్థిరపడిపోయింది. ఇదిలా ఉండగా అగస్త్య మహాముని తన దక్షిణ భారత దేశ యాత్రలో భాగంగా పెద కాకానికి రాగానే సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం జరిగిందని చెబుతారు.
సర్పదోష నివారణ
P.C: You Tube
అందువల్లే ఈ క్షేత్రంలో పరమేశ్వరుడితో పాటు సుబ్రహ్మణ్యుడికి కూడా ప్రధాన పూజ ఉంటుంది. ముఖ్యంగా రాహు-కేతు గ్రహ మండపంలో గ్రహ పూజలతో పాటు సర్పదోష నివారణ పూజలు జరుగుతాయి.
108 ప్రదక్షిణలు
P.C: You Tube
ఈ క్షేత్రంలో భ్రమరాంబ, విఘ్నేశ్వరుడు, భద్రకాళి, వీరభద్ర నందీశ్వరుడు, తదితర దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. సంతానం లేనివారు, రోగగ్రస్తులు ఒక మండలం రోజుల పాటు దీక్షతో స్వామివారికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి కష్టాలు తొలిగిపోతాయని చెబుతారు.
శ్రీరామ చంద్రుడు
P.C: You Tube
ఇదిలా ఉండగా శ్రీరామ చంద్రుడు ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడి శివుడికి కోటి పత్రి పూజ చేశాడని చెబుతారు. అదే విధంగా కృష్ణ దేవరాయులకు ఈ కాకాని మల్లకార్జునుడి దయవల్లే సదాశివరాయులు జన్మించాడని చెబుతారు. ఈ విషయం రాయులు కుమార్తే మోహనాంగి రచించిన మారిచీ పరిణయం అనే కావ్యంలో ఉంది.
గుంటూరు నుంచి
P.C: You Tube
గుంటూరుకి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి నిత్యం బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ క్షేత్రంలో భోజన సౌకర్యాలను దేవస్థానం నిర్వహకులు కల్పిస్తున్నారు. ఇక్కడ వసతి సౌకర్యం ఉన్నా కూడా ఎక్కువ మంది గుంటూరు, లేదా విజయవాడలో ఉండి ఇక్కడికి వస్తుంటారు.