మన రాష్ట్రంలో దసరా గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ప్రతిజిల్లాలో ఈ పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఆరోజున అందరూ పూజించేది అమ్మవారిని. జమ్మి చెట్టు వద్ద కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సాయంత్రం రావణ వధ దసరా ప్రత్యేక ఆకర్షణ. పది తలల రావరాసురుడు కటౌట్ ను బాణాలతో ఎక్కుపెట్టి కాల్చడం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఆనందాలు, సరదాలు దసరా పండుగ వేడుకలలో ఒక భాగం. ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి. ఉదయం పూట పండగ వాతావరణం అంత కళగా అనిపించదు కానీ సాయంత్రం పూట పండగ వాతావరణం కోలాహలంగా, సందడిగా ఉంటుంది. ఆ వాతావరణం ఎలా హుషారుగా ఉంటుందో మీరే చూడండి.
విజయవాడ
విజయవాడలో దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి. నవరాత్రుల వేడుకలో దుర్గమ్మ వారు తొమ్మిది రోజులలో, ప్రతిరోజూ ఒకరూపంలో అలంకరించబడి ఊరేగుతారు. చివరిరోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళనృత్యం ప్రదర్శిస్తారు.
చిత్రకృప : oneindia
వీరవాసరం
పశ్చిమగోదావారి జిల్లా వీరవాసంలో వంద సంవత్సరాల నుంచి ఏనుగుల సంరంభం జరపడం ఆనవాయితీగా వస్తుంది. వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరి పీచుతో చేసిన ఏనుగును అంబారీతో అలంకరిస్తారు. ఈ ఊరేగింపులో ఏనుగు కింద పిల్లలను దాటనిస్తారు. అలా చేస్తే పిల్లలు రోగబారి నుండి విముక్తి చెంది ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. సాయంత్రం 6 నుండి తెల్లవారు 6 గంటల వరకు ఊరేగింపు నిర్వహిస్తారు.
చిత్రకృప : Murty Amirapu
విజయనగరం
విజయనగరం లో దసరా సమయంలో గజపతుల ఆడవారైన పైడి తల్లికి పూజలు చేస్తారు. పండుగ రోజున పూజారిని సిరిమాను ఎక్కించి గుడి నుండి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు ఎద్దులబండి కట్టుకొని వచ్చి గుడారాలు వేసుకొని వచ్చి ఈ ఉత్సవాన్ని చూసి ఆనందిస్తారు. పండగ తరువాత మొదటి మంగళవారం జాతర జరుగుతుంది.
చిత్రకృప : EswaraRaoS
వీపనగండ్ల
కర్నూలు జిల్లాలోని వీపనగండ్ల లో దసరా సమయంలో రాళ్ళ యుద్ధం జరుగుతుంది. దసరా రోజు సాయంత్రం కాలువకు ఒకవైపు కొంత మంది ప్రజలు, మరో వైపు మరికొంత మంది ప్రజలు కంకర రాళ్లను గుట్టలుగా పోసి ఒకవైపు రామసేన మరోవైపు రావణ సేన గా ఊహించుకొని రాళ్లు విసురుకుంటారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత బాగా ఉత్సవం జరిగినట్టు.
చిత్రకృప : Chubby Chandru
మచిలీపట్నం
మచిలీపట్నం లో దసరా సందర్బంగా శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు బందరు పురవీధుల్లో ఈ ఊరేగింపు ఉంటుంది. చివరి రోజున కోనేరు సెంటర్ వద్ద జమ్మి కొట్టడంతో ఊరేగింపు ముగుస్తుంది.
చిత్రకృప : Subbu Tangirala
ఒంగోలు
ఒంగోలులో దసరా సమయంలో ఉత్సవాలలో భాగంగా కళారులను ఊరేగిస్తారు. కాళీదేవి, మహిసాసుర మర్ధిని, నరసింహస్వామి కి కళారులున్నాయి. ప్రతిరోజు కొన్ని కళారాలను ప్రదర్శిస్తారు. చివరిరోజున కళారాన్ని ఊరి మధ్యలో తీసుకొని వచ్చి రాక్షస సంహారం ఘట్టాన్ని జరుపుతారు.
చిత్రకృప : Konda Venkata Sudhakar
దేవరగట్టు, ఆలూరు
కర్నూలు జిల్లాకే ప్రసిద్ధి బన్ని ఉత్సవాలు. దీనినే 'కర్రల సమరం' అంటారు. ఈ ఉత్సవాలు దసరా రోజున రాత్రి నుంచి ఉదయం వరకు నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల ప్రజలు ఒకవైపు, మరికొన్ని గ్రామాల ప్రజలు మరోవైపు జట్లుగా ఏర్పడి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీ పడతారు. నెరణికి గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలను కర్రలతో దేవరగట్టు దేవాలయం వరకు తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో కర్రల తాకిడిలో చాలా మందికి గాయాలు కావటం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవటం జరుగుతాయి.
చిత్రకృప : oneindia