కోటలను చూస్తే ఎవ్వరికైనా ఏమనిపిస్తుంది ? అప్పట్లో ఇంత పెద్ద కట్టడాలను ఎలా నిర్మించారు ? ఎన్నేళ్లయింది ఇలాంటి కట్టడాలను నిర్మించటానికి ? ఎంతమంది కూలీలను వాడారు ? ఇవేగా మీ మదిలో అనిపించేవి. కోటలు చారిత్రక మౌనసాక్ష్యాలు.
ఏ చరిత్రను చూసిన ఏమున్నది గర్వకారణం అంటుంటారు పెద్దలు, చరిత్రకారులు. అవును నిజమే రాజులు పోయారు .. రాజ్యాలు పోయాయి .. ఇప్పుడు మిగిలింది కేవలం వాటి జ్ఞాపకాలే.
రాజులు యుద్ధాలు చేయటం .. కోటలను ఆక్రమించటం .. బందీలుగా అక్కడి వారిని తీసుకపోవటం .. ఇవే జరిగేవి. కొందరైతే కోట గుమ్మాలకు తలల్నివ్రేలాడదీసేవారు. ఇది చూసి చుట్టుపక్కల రాజ్యాలు కూడా భయపడేవి.
చిత్ర కృప : Deep Goswami
చరిత్ర పుటల్లో నేటికీ ఒళ్ళు జలదరించే కోటలు సాక్షాత్కరిస్తాయి. వాటిలో ఒకటి దౌలతాబాద్ కోట. ఈ కోట ఘనమైన చరిత్ర ను కలిగి ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
ఎక్కడ ఉంది ?
దౌలతాబాద్ కోట, ఔరంగాబాద్ కు 15 KM ల దూరములో ... ఎల్లోరా వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. దౌలతాబాద్ కోట కు గల మరో పేరు దేవగిరి కోట.
క్రీ. శ. 12 వ శతాబ్దంలో దక్కన్ హిందూ సామ్రాజ్యానికి దేవగిరి రాజధానిగా ఉండేది. దేవగిరి కోటను యాదవ రాజు రాజా భిల్లమరాజు కట్టించాడు. ఈ కోటను మొదట హస్తగతం చేసుకున్నది అల్లా ఉద్దీన్ ఖిల్జీ. ఆ తరువాత మరాఠాలు, బహమనీ సుల్తానులు, మొఘలులు, హైదరాబాద్ నవాబులు చేజిక్కించుకున్నారు.
చిత్ర కృప : karen easterbrook
మహమ్మద్ బీన్ తుగ్లక్
తుగ్లక్ ఢిల్లీ సుల్తానుల వంశానికి చెందినవాడు. మహమ్మద్ బీన్ తుగ్లక్ కు మరియు దౌలతాబాద్ కోట కు సంబంధం క్రీ. శ. 13 వ శతాబ్దం నాటిది. రాజధాని మధ్యలో ఉండటం వల్ల ఉత్తర, దక్షిణ రాజ్యాలకు దౌలతాబాద్ అనువైన ప్రదేశం అని భావించిన తుగ్లక్ ఇక్కడి కోట ను ఆక్రమిస్తాడు. ఢిల్లీ లోని ప్రజలను దౌలతాబాద్ కు తరలివెళ్లాలని, అదే రాజధాని అని ఆజ్ఞాపిస్తాడు. సుమారు 700 మైళ్ళ ప్రయాణాన్ని ప్రజలు నడవలేక మార్గమధ్యలోనే మరణిస్తారు. అది గమనించిన తుగ్లక్, వెంటనే వారిని ఢిల్లీ రావలసిందిగా, ఢిల్లీ ని తిరిగి రాజధానిగా ప్రకటిస్తాడు. దీనిని చరిత్రలో ఒక పిచ్చి చేష్టగా చరిత్ర కారులు పరిగణిస్తారు.
చిత్ర కృప : Arun Sagar
తానిషా చీన్ - మహల్
క్రీ. శ. 16 వ శతాబ్దంలో గోల్కొండ తానిషా, హిందువులైన అక్కన్న, మాదన్న లను కోట బాధ్యతలను అప్పగించి ఔరంగజేబు కోపానికి గురవుతాడు. దానికి తోడు శివాజీ తో చేసుకున్న సంధి ఔరంగజేబు ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. స్వయానా ఔరంగజేబు గుల్కొండ కోట ను ముట్టడించి, తానిషా ను బందీగా చేసుకొని దౌలతాబాద్ కోట లో బంధిస్తాడు. తానిషా సుమారు 13 సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉండి అక్కడే మరణిస్తాడు. అతనిని నిర్బంధించిన స్థలం కోటలోని చీన్ - మహల్ గా ప్రసిద్ధి చెందినది.
చిత్ర కృప : Amit Rawat
హారపాలదేవుడు
కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చేసిన దండయాత్రను ఎదిరించిన యాదవ యోధుడు హారపాలుడిని బతికుండగానే పట్టుకొని, అతని శరీరాన్ని దౌలతాబాద్ కోట గుమ్మానికి వ్రేలాడదీసిస్తాడు. ఇది కోటకు సంబంధించిన ఒళ్ళు జలదరించే రక్త చరిత్ర.
సందర్శించు సమయం : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
చిత్ర కృప : beetle_0042000
కోట లోపల సందర్శించదగినవి
బలమైన ఇనుప మేకులతో చెక్కబడిన కోట ద్వారాలు, శత్రువులు కూడా ఎక్కి లోనికి చేరుకోలేని విధంగా ఉండే నల్లటి రాళ్లతో నిర్మించిన ఎత్తైన గోడలు, ఫిరంగులు, సైనికుల గదులు చూడదగ్గవి.
భరతమాత ఆలయం
భరతమాత ఆలయాన్ని యాదవ రాజులు హిందూ ఆలయంగా, ముస్లీమ్ సుల్తానులు మసీదుగా ఉపయోగించేవారు. ఇప్పడు ఆలయం లోపల భారత మాత విగ్రహం కలదు. భరతమాత ఆలయానికి చేరువలో హాథీ సరస్సు కలదు. 210 మీటర్ల చాంద్ మినార్ కూడా చూడవచ్చు.
చిత్ర కృప : Martin Chandler
కోట పై భాగాన
కోట పై కి చేరుకొనే దారిలో 40 అడుగుల లోతు గల కందకం దాని మీద ఇనుప వంతెన ఉంటుంది. అది దాటితే ఒక చీకటి గది వస్తుందట. కొవ్వొత్తులు, టార్చ్ లైట్ సహాయంతో లోనికి వెల్ళవచ్చు. కూడా పైన వినాయకుడి గుడి, జనార్థన స్వామి పాదుకలు, దత్త పాదుకలు, శివలింగం ఉన్నాయి.
చిత్ర కృప : milosh_98
షాజహాన్ నిర్మించిన బారాదరి నిర్మాణం కోట పైభాగాన కలదు. ఇది 13 హాళ్లు ఉన్న రాజమందిరం. అప్పట్లో బారాదరి రాజులకు వేసవి విడిది గా ఉండేది.