భారత దేశంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఉన్నాయి. అందులోనూ పురాణ ప్రాధాన్యత కలిగిన ఆరు పుణ్యక్షేత్రాలను కలిపి అరుప్పడై వీడు అని అంటారు. అందులో తిరుచెందూర్, తిరుప్పరకుండ్రం, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళముదిర్చొళై క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క పురాణ కథనం ఉంటుంది.
తమిళనాడు వాసులే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఈ ఆరు సుబ్రహ్మణ్యక్షేత్రాల సందర్శనను పరమపవిత్రమైన పుణ్యక్షేత్ర పర్యటనగా భావిస్తారు.
ఈ ఆరు క్షేత్రాల్లో ఒక్క తిరుచెందూర్ మాత్రం సముద్రపు ఒడ్డున ఉండగా మిగిలిన ఐదు క్షేత్రాలు కొండల పై ఉంటాయి. ఇక వర్షాకాలంలో కొండల పై ఉన్న ఈ క్షేత్రాల సందర్శనకు ఎక్కువంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఆరు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన క్లుప్త సమాచారం మీ కోసం...
తిరుచెందూర్
P.C: You Tube
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరునల్వేలికి అది దగ్గరగా ఉన్న క్షేత్రమే తిరుచెందూర్ ఆలయం. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి బాలుడి రూపంలో కనిపిస్తాడు. మిగిలిన క్షేత్రాలన్నీ కొండల పై ఉండగా ఈ ఒక్క క్షేత్రం మాత్రం సముద్రం ఒడ్డున కనిపిస్తుంది.
మూల విగ్రహాన్ని
P.C: You Tube
ఈ క్షేత్రంలోని మూలవిరాట్టును బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీవారు తమ దేశానికి తరలించాలని భావించి భంగపడ్డారు. ఇందుకు సంబంధించిన పెయింటింగ్స్ అన్నీ ఆ దేవాలయం గోడల పై ఉంది. ఇక దేవాలయం నిర్మాణానికి వచ్చిన కూలీలకు సొమ్ముకు బదులు సుబ్రహ్మణ్యస్వామి వీభూతి ఇచ్చేవారు. ఆ వీభూతి కాస్త బంగారు నాణ్యాలుగా మారిపోయేవి. ఇలా మొత్తం తొమ్మిది అంతస్తుల గోపురాన్ని నిర్మించారు.
తిరుప్పర కుండ్రం
P.C: You Tube
మధురై నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో సుబ్రమణ్యేశ్వరస్వామి కొలువై ఉన్న ఈ తిరుప్పర కుండ్రం ఒక చిన్న కొండ శిఖరం పై ఉంటుంది. ఇంద్రుని కుమార్తే దేవసేనతో స్వామివారికి ఇక్కడే వివాహమయ్యిందని చెబుతారు.
మూలవిరాట్టు వివాహ సన్నివేశం
P.C: You Tube
దేవాలయంలోని మూలవిరాట్టు కూడా ఈ వివాహ సన్నివేశాన్ని చూపిస్తుంది. ఇంద్రుడు కలశంతో నీళ్లు పోస్తూ కన్యాదానం చేస్తుండగా కుమారస్వామి తన కుడిచేతిని చాచి ఉంటాడు. ఎడమవైపున దేవసేన సిగ్గుతో నిలబడి ఉంటుంది. చాలా కాలంగా వివాహం కుదరని యువతీ యువకులు ఇక్కడ స్వామివారిని సందర్శించుకుంటే వెంటనే పెళ్లి అవుతుందని నమ్ముతారు. కొండ చుట్టూ ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తారు.
పళని
P.C: You Tube
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని కేరళ రాజు చీమన్ పెరుమాళ్ నిర్మించాడని చెబుతారు. ఇక్కడ స్వామివారిని దండాయుధపాణి అనే పేరుతో కొలుస్తారు.
నవ పాషాణాలతో
P.C: You Tube
ఇక్కడే పరమశివుడు ఆ కుమారస్వామిని బుజ్జగించినట్లు పురాణ కథనం. పళని మందిరంలోని గర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని నవ పాషాణాలతో నిర్మించబడిందని చెబుతారు. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా మనకి కనిపించదు.
స్వామిమలై
P.C: You Tube
కుంభకోణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ దేవాలయం ఉంది. ఇక్కడ పరమశివుడికి కుమారస్వామి ప్రణవ రహస్యం విడమరిచి చెప్పాడు. అందుకు అనుగుణంగా శివుడి తొడ పై కుమారస్వామి కుర్చొని ఏదో చెబుతూ ఉంటే ఆ పరమశివుడు శ్రద్ధగా వింటున్నట్లు ఉంటుంది ఇక్కడవిగ్రహం.
బ్రహ్మను బంధించింది ఇక్కడే
P.C: You Tube
అంటే తండ్రికే కుమారుడైన పరమశివుడు కురువైనట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఆ కుమారస్వామి ఇక్కడే బ్రహ్మను ఖైది చేసినట్లు పురాణ కథనం. అందువల్లే ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల అపార తెలివితేటలు వస్తాయని భక్తులు నమ్ముతారు.
తిరుత్తణి
తమిళనాడు రాజధాని చెన్నైకు 87 కిలోమీటర్ల దూరంలో తిరుత్తని పుణ్యక్షేత్రం ఉంది. ఈ తిరుత్తని దేవాలయం ఆరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయల్లోకెల్లా అత్యంత విశిష్టమైనదని చెబుతారు. కొండపై ఉన్న ఈ దేవాలయాన్ని చేరుకోవడనాకి 365 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఒక సంత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా చెబుతారు.
ఏనుగు తల వలే
P.C: You Tube
ఈ దేవాలయం కొండ చూడటానికి ఒక ఏనుగు తలవలే కనిపిస్తుంది. రామ రావణ యుద్ధం తర్వాత శ్రీరాముడు రామేశ్వరంలో శివుడిని పూజించిన తర్వాత తిరుత్తణి వచ్చి కొద్ది రోజుల పాటు స్వామిని కొలిచాడని పురాణాలు చెబుతాయి.
పళముదిర్చొళై
P.C: You Tube
మధురై కు దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కొండ పై పళముదిర్చొళై పుణ్యక్షేత్రం ఉంది. అవయ్యార్ అనే భక్తురాలిని కుమారస్వామి ఇక్కడే పరీక్షించినట్లు చెబుతారు. ఈ క్షేత్ర సందర్శనం వల్ల ఎటువంటి రోగాలు ఉన్నా వెంటనే సమిసిపోతాయని చెబుతారు.
నూపుర గంగ
P.C: You Tube
అందువల్లే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న నూపుర గంగను భక్తులు ఇంటికి తీసుకువెలుతుంటారు. ఇక్కడే గంగాదేవి ఆ మహావిష్ణువు పాదాలను కడిగిందని మన పురాణాలు చెబుతుంటాయి.