కర్నాటక.. లెక్కలేనన్ని చారిత్రక ప్రాంతాలకు, పర్యాటక ప్రదేశాలకు నెలవు. ఒక్కమాటలో చెప్పాలంటే దక్షిణ భారత దేశంలో కేరళ తర్వాత టూరిజం రెవిన్యూ ఎక్కువగా వచ్చేది కర్నాటక రాష్ట్రానికే. ఈ కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంతంలోని పర్యాటక ప్రాంతం ఉడిపి. కర్నాటకలో ప్రముఖ ధార్మిక ప్రదేశాల్లో ఉడిపి మొదటివరుసలో ఉంటుంది. అయితే చాలామంది ఉడుపి వెళ్లినా శ్రీకృష్ణ మఠాన్ని దర్శించడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. కానీ.. ఉడుపిలో ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశం శ్రీకృష్ణమఠం. ఇంతకీ ఏంటి శ్రీకృష్ణ మఠం ప్రత్యేకత? దాన్ని దర్శించడానికి అనువైన సమయం ఏది? చుట్టుపక్కల ఏయే ప్రాంతాలు చూడాలి. అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకొందాం. అదే విధంగా శ్రీకృష్ణమఠం చుట్టు పక్కల ఉన్న పర్యాటక స్థలాల గురించి కూడా తెలుసుకొందాం.
1. క్లుప్తంగా శ్రీకృష్ణ మఠం చరిత్ర
Image Source:
ఉడుపిలో ఉన్న శ్రీకృష్ణమఠానికి విశేష ప్రాధాన్యత ఉంది. పదమూడవ శతాబ్దంలో ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన హిందూ తత్వవేత్త మధ్వాచార్యలు ఈ మఠాన్ని ప్రారంభించారని చెప్తారు. ద్వైతమతాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడకు చేరుకున్న మధ్వాచార్యులకు..శ్రీకృష్ణుడి విగ్రహం కనిపించిందని, దానిని ఆయన ప్రతిష్టించారని ఒక స్ధలపురాణం.
2. ఎనిమిది మఠాలతో పూజా కార్యక్రమాలు
Image Source:
మధ్వాచార్యులు తన శిష్యుల్లో ఎనిమిది మందిని ఎంపిక చేసి.. వారితో ఈ ప్రాంతంలోనే ఎనిమిది మఠాలను ( అవి పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర) ఏర్పాటుచేయించారు. ఒక మఠం తరువాత మరొక మఠం వారు వంతుల వారిగా ఉడిపి శ్రీకృష్ణుడి పూజా కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాటు చేశాడు. ఆధ్యాత్మికతను ప్రబోధించడమే కాకుండా.
ధ్యానకేంద్రంగా కూడా శ్రీకృష్ణ మఠం ప్రాచుర్యం పొందింది.
3. శ్రీకృష్ణ మఠం విశిష్టతలు
Image Source:
ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు, చక్కని వాతావరణానికి మారుపేరు శ్రీకృష్ణమఠం. ఒక్కసారి మఠం చుట్టుపక్కలకు అడుగుపెడితే చాలు.. ఎవరైనా సరే.. తెలియని పరవశానికి లోనవుతారు. దాస సాహిత్యానికి పుట్టినిల్లుగా శ్రీకృష్ణ మఠాన్ని పిలుస్తారు. మిగతా హిందూ దేవాలయాలకు భిన్నంగా ఇక్కడ స్వామి దర్శనం ఉంటుంది.
4. దర్శనం విభిన్నం
Image Source:
మఠం ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళితే మధ్యలో సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. అటునుంచి కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం కనిపిస్తుంది. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణుడిని వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షంలోనుంచి చేసుకోవాలి. శ్రీకృష్ణ దర్శనం తర్వాత అనంతేశ్వర దేవాలయం, వెయ్యేళ్ల క్రితం నిర్మించినట్టు చెప్పే అష్టమఠాలు. ఉడిపి చుట్టుపక్కల కాపు బీచ్, సెయింట్ మేరీ ఐలాండ్, మాల్పే బీచ్, కుడ్లు జలపాతాలు ఇక్కడ సందర్శించాల్సిన మరికొన్ని పర్యటక ప్రాంతాలు.
5. ఎప్పుడు వెళ్లాలి
Image Source:
శ్రీకృష్ణ మఠాన్ని ప్రశాంతంగా దర్శించుకోవాలంటే మాత్రం ఆగస్ట్ నుంచి మార్చి మధ్యలో వెళితే మంచిది. ఈ క్షేత్రం కోస్తా తీరంలో ఉండటంతో ఏడాది పొడవునా ఇక్కడ ఒకటే వాతావరణం ఉండదు. ఎండాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సమయంలో యాత్రికుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
6. అక్కడకు ఎలా చేరుకోవాలి?
Image Source:
ఉడుపికి నేరుగా విమాన సర్వీసులు లేవు. కాబట్టి విమానంలో వెళ్లాలనుకునేవారు మంగళూరులో దిగి అక్కడ్నుంచి బస్సులో కానీ.. ట్యాక్సీలోకానీ చేరుకోవచ్చు. ఉడుపి నగరం నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో మఠం ఉంటుంది. దాదాపు అన్ని ప్రముఖ ప్రాంతాల నుంచి ఉడుపికి రైలు సదుపాయం ఉంది. రోడ్డు మార్గం ద్వారా అయితే బెంగుళూరు నుంచి చేరుకోవడం ఉత్తమం.