భారతదేశ ద్వీపకల్పం చిట్టచివరి పర్యాటక కేంద్రంగా కన్యాకుమారికి పేరు. ఈ సముద్ర తీర నగరం పశ్చిమకనుమలకు అనుకొని ఉంటుంది. అదే విధంగా పర్యాటకంగా అత్యంత ఆదరణ పొందిన లక్షద్వీప్ లు కూడా ఇక్కడకు చాలా దగ్గర. ఈ కన్యాకుమారికి దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిక్కుల్లో ఈ లక్షద్వీప్ లు ఉంటాయి. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ కన్యాకుమారి అటు ఆధ్యాత్మికంగానే కాకుండా ఇటు ప్రకృతిని ప్రేమించే వారికి కూడా ఎంతో ఇష్టమైన పర్యాటక ప్రాంతం. కన్యాకుమారి అంటే ప్రతి ఒక్కరికి అక్కడి సముద్ర తీరం ప్రాంతం అక్కడ కుర్చొని సూర్యోదయం సూర్యాస్తమయాలను చూడటం అన్న ఊహ మదిలో మెదులుతుంది. అయితే ఈ కన్యాకుమారిలో కేవలం సముద్ర అందాలనే కాకుండా ఇంకా అనేక పర్యాటక కేంద్రాలను కూడా చూడవచ్చు. అందులో ముఖ్యమైన ఐదు ప్రాంతాల వివరాలు మీ కోసం....
వివేకానంద మెమోరియల్ రాక్
P.C: You Tube
భారత దేశంలోనే ప్రపంచ వ్యప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వివేకాంద కన్యాకుమారికి 1892లో సందర్శించిన విషయాన్ని పురస్కరించుకొని ఈ స్మారకాన్ని నిర్మించారు. సముద్రం మధ్యలో ఉన్న చిన్న ద్వీపం పై నిర్మించిన ఈ స్మారకంలోకి అడుగు పెట్టగానే తెలియని ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. కన్యాకుమారి నుంచి కేవలం 500 మీటర్లద దూరంలో ఉన్న ఈ ద్వీపం చేరడానికి అందుబాటులో పడవలు ఉంటాయి. ఈ ద్వీపం నుంచి సూర్యదయం, సూర్యాస్తమయాలను చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.
సందర్శన సమయం వారంలో ఏడు రోజులూ, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ
తిరువల్లూర్ విగ్రహం
P.C: You Tube
వివేకానంద మెమోరియల్ రాక్ పక్కగానే నిలువెత్తు తిరువల్లూర్ విగ్రహం ఉంటుంది. తమిళనాడులోనే ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కవి, ఆధ్యాత్మిక వేత్త తిరువల్లూర్. తిరువల్లూర్ రచించిన తిరుక్కురల్ పుస్తకంలోని 133 భాగాలకు ప్రతీకగా ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ తమిళనాట ఉన్న కొన్ని ప్రత్యేక గ్రంధాలను కూడా ఖరీదు చేయడానికి అవకాశం ఉంది.
సందర్శన సమయం వారంలో ఏడు రోజులూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ
కన్యాకుమారి దేవాలయం
P.C: You Tube
కన్యాకుమారి దేవాలయాన్ని భగవతి అమ్మాన్ దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయం వల్లే ఈ నగరానికి కన్యాకుమారి అనే పేరు వచ్చిందని చెబుతారు. భారత పురాణాల్లోని 108 శక్తి పీఠాల్లో కన్యాకుమారి దేవాలయం కూడా ఒకటి. దీనికి 3వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయంలోని శిల్పకళతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే అమ్మవారి విగ్రహం, వజ్రంతో పొదగబడిన ముక్కెర చూడటానికి రంెడు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. కన్యాకుమారి రైల్వే స్టేషన్ కు కేవలం కిలోమీటరు దూరంలో మాత్రమే ఈ దేవాలయం ఉంది.
సందర్శించే సమయం. ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ అటు పై 4 గంటల నుంచి 8 గంటల వరకూ
కన్యాకుమారి బీచ్
P.C: You Tube
హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే చోటునే కన్యాకుమారి బీచ్ అని అంటారు. వివిధ రంగుల్లో మెరిసే ఇసుకతో పాటు ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటానికే ఒక్క భారత దేశం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు. శిలలతో కూడుకొన్న బీచ్ కావడం వల్ల ఇక్కడ ఈత కొట్టడానికి అంత అనుకూలం కాదు.
సందర్శన సమయం ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకూ
పద్మనాభపురం ప్యాలెస్
P.C: You Tube
ట్రావెన్ కోర్ వంశానికి చెందిన వారు ఈ పద్మనాభపురం ప్యాలెస్ ను నిర్మించినట్లు చెబుతారు. పూర్తిగా టేకు చెక్కతో నిర్మితమైన ఈ భవనం అప్పటి భారతీయ శైలి వడ్రంగి (కార్పెంటరీ) పనితనానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రవేశ ద్వారం మొదలుకొని కుర్చీలు, బేంచీలు, నిలువెత్తూ స్తంభాలు అన్నీ టేకు చెక్కతో చేయబడినవే. 16 వ శతాబ్దంలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం విశేషం.
సందర్శన సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకూ సోమవారం సెలవు.