మన తెలుగు రాష్ట్రాల ప్రజలు సర్పదోష నివారణకు శ్రీకాళహస్తకి వెళ్లి పూజలు చేయించుకొంటూ ఉంటారు. తమిళనాట కూడా అంతటి ప్రాధాన్యత కలిగిన క్షేత్రమే తిరుప్పాంపురం. ఇక్కడ భారత దేశంలో ఎక్కడా లేనట్లుగా రాహు, కేతువులు ఒకే శరీరంలో ఉంటారు. అందుకే ఈ తిరుప్పాంపురం క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని తమిళప్రజల నమ్మకం.
ఇక్కడ సర్పదోష నివారణకు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వారు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న పుణ్యతీర్థం పేరు ఆదిశేష తీర్థం. ఇందులో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన క్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం...
శివుడి శరీరం పై ఉన్న నాగులు
P.C: You Tube
ఒకసారి వినాయకుడు తన తండ్రి పరమశివుడినికి పూజ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో శివుడికి ఆభరణాలుగా ఉన్న పాములు ఆ పూజ తమకు కూడా చెందుతుందని మనసులో గర్వపడుతాయి. వినాయకుడంతటి వాడే తమను పూజిస్తున్నాడని భావిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన పరమశివుడు తన శరీరం పై ఉన్న పాములు తమ శక్తులను కోల్పోయి సాధారణ మానవుల చేత చిక్కి నానాహింసలు పడుతాయని శపించాడు.
శాపవిమోచనం సూచిస్తాడు
P.C: You Tube
దీంతో శివుడి మెడలోని వాసుకితో పాటు ఆదిశేషుడు, కర్కాటకుడు, తక్షుడు తదితర సర్వాలన్నీ తమ శక్తులను కోల్పోతాయి. దీంతో తమతప్పును మన్నించాల్సిందిగా ఆ పరమశివుడిని వేడుకొని శాపవిమోచనా
మార్గం సూచించాల్సిందిగా కోరుతాయి. దీంతో కరిగిపోయిన బోళాశంకరుడు తిరుప్పాంపురంలోని పాంబురానాథలో కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం దొరుకుతుందని చెబుతారు.
ఆదిశేష తీర్థం
P.C: You Tube
దీంతో ఆ నాగులన్నీ కలిసి అక్కడికి చేరుకొని పాంబునాథుడిని ఆరాధించి తమ శాపాన్ని పోగొట్టుకున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఏక శరీరంలో ఉన్న రాహు, కేతులకు కూడా అర్చనలు జరిపాయి. ఇదిలా ఉండగా ఇక్కడ పరమశివుడిని అర్చించడానికి వచ్చిన నాగులన్నీ కలిసి ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చేసుకొన్నాయి. అదే ఆదిశేష తీర్థం. అగస్త్యుడు, గంగాదేవి, ఇంద్రుడితో పాటు బ్రహ్మ ఈ తీర్థంలో స్నానమాచరించనట్లు తెలుస్తోంది.
వెయ్యి సంవత్సరాలకు పూర్వం
P.C: You Tube
ఈ ఆలయంలో ఉన్న శాసనాలను బట్టి ఈ దేవాలయాన్ని కుళోత్తుంగ చోళుడి నిర్మించినట్లు తెలుస్తోంది. అంటే ఈ ఆలయ నిర్మాణం జరిగి దాదాపు వెయ్యి సంవత్సరాలయ్యిందని అర్థమవుతోంది. తంజావూరును పాలించిన శరభోజీ చక్రవర్తి ఈ ఆలయానికి వసంతమండపాన్ని, రాజగోపురాన్ని నిర్మించాడు. గర్భగుడిలో శివుడికి పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందును చేస్తుంది. ఇక్కడ రావి చెట్టు కింద వేల సంఖ్యలో సర్పశిలులు ఉన్నాయి.
సర్పదోష నివారణ పూజలు
P.C: You Tube
ఆలయంలో ఈశాన్య దిక్కులో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నతి దీపాలు కొని వెలిగిస్తారు. ఇక్కడ సర్పదోష నివారణకు దాదాపు రూ.5,500 వరకూ వసూలు చేస్తారు. ఈ పూజలు చేయించాలనుకొనేవారు తెల్లవారుజామునే ఈ ఆలయానికి చేరుకోవడం మంచిది.