అక్టోబర్లో తిరిగి తెరవబడే జాతీయ పార్కులు మీకు తెలుసా!
దట్టమైన అటవీ ప్రాంతంలో కుటుంబంతో కలిసి సరదాగా సెలవులను ప్లాన్ చేసుకోవడంలో బిజీగా ఉండాల్సిన సమయం ఇది. సుమారు అక్టోబరు నెల నుంచి ఇలాంటి పర్యటనలు మొదలవుతాయి. ఈ సీజన్లోనే మనకు ఇష్టమైన జాతీయ ఉద్యానవనాలను సందర్శించగలం.
ఈ కాంక్రీట్ జంగిల్ను వదిలి అడవి అందాలను కొద్దిసేపు ఆస్వాదించినా అది మనసు, హృదయానికి గొప్ప అనుభూతులను చేరువచేస్తుంది. మనదేశంలోని అనేక జాతీయ పార్కులు అక్టోబర్ మొదటి వారంలో తిరిగి తెరవబడతాయి. అలాంటి పార్కుల వివరాలను మీరు తెలుసుకోండి.
కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
కన్హా నేషనల్ పార్క్ను కన్హా టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. గడ్డి భూములు మరియు అటవీ పర్యావరణ వ్యవస్థ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పులుల గర్జనలకు అరుదైన పక్షులకు ఇది గమ్యస్థానం. ఈ అటవీ ప్రాంతంలో మిలితమైన సుందర దృశ్యాలు అడుగడుగునా తారసపడతాయి. పార్క్ చుట్టూ గోండ్ మరియు బైగా గ్రామాలున్నాయి
రణతంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్
రణతంబోర్ నేషనల్ పార్క్, పూర్వపు రాజుల వేట మైదానం. అటవీ ప్రయాణపు అనుభూతులను అనుభవించడానికి ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. ఇక్కడి పులుల గాండ్రింపులు అస్సలు మిస్సవ్వ కూడదు. రణతంబోర్ కోట మరియు పదమ్ తలావ్ సరస్సు ప్రాంతాలను కూడా మిస్ చేయకూడదు. ఇక్కడికి వచ్చే సందర్శకులు రణతంబోర్ జీప్ సఫారీ అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేరు. ఈ పార్క్లో పులులను మీ కెమెరాల్లో భందించేందుకు చాలా నిశ్శబ్దంగా ఉంచుతూ.. నిత్యం కెమెరాను సిద్ధంగా ఉంచుకోవాలి.
సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్, పశ్చిమ బెంగాల్
సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ యొక్క ప్రధాన ప్రాంతమయిన సుందర్బన్ నేషనల్ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం పులుల సంరక్షణ ప్రాంతమే కాదు, భారీ మడ పర్యావరణ వ్యవస్థగా నిలుస్తోంది. అద్వితీయ జీవవైవిధ్యంతో పర్యావరణ హితమైన ప్రకృతి సిద్ధ ప్రదేశంగా పర్యాటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తోంది. బయోస్పియర్ రిజర్వ్ అక్టోబర్లో సందర్శకుల కోసం గేట్లను మళ్లీ తెరవనుంది!
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్
అత్యధిక సంఖ్యలో పులులకు నిలయం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది చిరుతపులులు, అడవి ఏనుగులు మరియు వందలాది రకాల పక్షులకు నిలయంగా నిలుస్తోంది. కార్బెట్ యొక్క పక్షుల వైవిధ్యం దేశంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచింది. ఈ ఉద్యానవనం వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఎటుచూసినా, గడ్డి భూములు, దట్టమైన నదీతీర అడవుల మిశ్రమంగా కనిపిస్తోంది. ధికాలా, బిజ్రానీ, ఝిర్నా, ధేలా మరియు దుర్గా దేవి పేర్లతో ఈ పార్కులో ఐదు జోన్లు ఉన్నాయి.
బందీపూర్ టైగర్ రిజర్వ్, కర్ణాటక
కర్నాటకలోని ఉత్తమ వన్యప్రాణి ఉద్యానవనాలలో ఒకటి బందీపూర్ టైగర్ రిజర్వ్. పులి, చిరుతపులి, ధోలే, భారతీయ అడవి ఏనుగులకు నిలయంగా ఉంది. సాంబార్, చితాల్, ముంట్జాక్ వంటి అనేక జాతులు ఇక్కడ చూడొచ్చు. బందీపూర్లో జీప్ సఫారీ ప్రసిద్ధి చెందింది.
సరిస్కా టైగర్ రిజర్వ్, రాజస్థాన్
సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉంది. ఈ ఉద్యానవనం 881 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాక్షిక శుష్క అడవులు, గడ్డి భూములు మరియు రాతి భూభాగాలలో విస్తరించి ఉంది. ఇది బెంగాల్ పులులకు నిలయం పేరుగాంచింది.
సాత్పురా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లోని సాత్పురా నేషనల్ పార్క్ భారతదేశంలోని అతి కొద్ది వన్యప్రాణి పార్కులలో ఒకటి. ఇక్కడ సందర్శకులు కాలినడకన అటవీ ప్రాంతాన్న అన్వేషించడానికి అనుమతించబడతారు. ఈ పార్క్ చిరుతపులి, సాంబార్ జింకలు, చితాల్, ఇండియన్ ముంట్జాక్, బ్లాక్ బక్ మరియు స్లాత్ బేర్లకు నిలయం.