మన హిందూ ధర్మంలో అష్టాద శక్తి పీఠాలను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. సాక్షాత్త్ శ్రీ ఆది పరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఒక విషాధ గాథ ఉన్నట్లు మన పురాణాల్లో తెలుపుతున్నాయి. ఆ గాథలు ఏవి, ఆ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ కొలువుధీరాయి, ఆ ఫీఠాల విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అఖండ భారతావని అంతా వ్యాపించి ఉన్న ఆ అష్టాదశ పీఠాలు సాక్షాత్ సతీ దేవి యొక్క శరీర భాగాలుగా మన పురాణాలు తెలుపుతున్నాయి. బ్రహ్మ దేవుడి కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతికి యాబై మూడు గురు కుమార్తెలుండే వారు. వారిలో ఇరవై ఏడు గురిని చంద్రుడికి, పదమూడు మందని కశ్యప మహర్షికి పది మందిని దర్ముణకు , ఒక ఆమెను పితురులకు, ఒక ఆమెను అగ్నికి ఇచ్చి వివాహం చేశారు. మిగిలిన కూతురే సతీ దేవి. ఈమె సాక్షాత్త్ ఈ ఆది పరాశక్తికి అంశ. సతికి చిన్ననాటి నుండి శివుడి మీద ఉండే మక్కువ చేత, ఆమెను చంద్రుడికిచ్చి పెళ్ళిచేయలేదు. ఇలా ఉండగా ఒక నాడు చంద్రుని భార్యలో 26 మంది తమ తండ్రి దక్షుడి వద్దకు వచ్చి, రోహిణిని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని మెరపెట్టుకోవడంతో దక్షుడు చంద్రుడిని పిలిచి మందలించాడు.
అయినా చంద్రుడు మళ్ళీ అదే పనిచేయడంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని కురుపిగా మారమని శపించాడు. ఆ తర్వాత నారధుడి సలహా మేరకు చంద్రుడు ఆ పరమేశ్వరున్ని ప్రార్థించి తన శాపానికి పరిష్కారం అడగగా అందుకు ఆ పరమేశ్వరుడు పాక్షిక విమోచనం కలుగజేశాడు. ఇది తెలుసుకున్న దక్షుడు ఈ పరమేశ్వరునిపై కోపం పెంచుకుని , ఈశ్వరునికి సతీదేవిని ఇచ్చి వివాహం జరిపించుటకు ఇష్టపడలేదు. అయినా సతీ దేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేకున్నా ఆ పరమేశ్వరున్ని పెళ్ళాడింది. దక్షుడు ఆ పరమేశ్వరునిపై మరింత కోపం పెంచుకున్నాడు.
ఇదిలా ఉండగా ఒక రోజు బ్రహ్మ తలపెట్టి యాగానికి సకల దేవతామూర్తులు అక్కడ చేరగా, ఆఖరున దక్షుడు కూడా అక్కడి వచ్చాడు. అతన్ని చూసి గౌరవ భావంతో త్రిమూర్తూలు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు. అంతట దక్షుడు బ్రహ్మ నాకు తండ్రి, విష్ణువు నాకు తాత వరుస , అందుకు నాకు వారు గౌరవం ఇవ్వనవసరం లేదు. కానీ శివుడి స్వయానా మామగారు కాబట్టి, నేను ఇక్కడకు వచ్చినా కూడా లేచి మర్వాద ఇవ్వవా అని కోప్పడుతాడు దక్షుడు. అందుకు అక్కడున్నవారంత త్రిమూర్తులు ఆది దేవుళ్ళు, వారి తర్వాతే మనం, కాబట్టి, మనమే వారి గౌరవించాలి తప్ప మనం వారిని నిలబడమనటం మంచిది కాదని వారించారు.
దాంతో దక్షుడు మరింత కోపోద్రిక్తుడై శివరహిత మహాయాగాన్ని నేను నిర్వహిస్తానని చెప్పి అక్కడ నుండి వెనుతిరిగాడు. ఆ తర్వాత బ్రుహస్పతి సహాయంతో దక్ష యగ్నాన్ని ప్రారంభించి, అందుకు సమస్త దేవతలకు ఆహ్వానం పంపి, ఒక్క శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. అయితే ఆ పరమేశ్వరుడు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ విష్ణువులు ఆ యాగానికి వెళ్ళలేదు. అయితే తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశ్యంతో ఆ పరమశివుడు వెళ్ళవద్దని వారించినా.. దాక్షాయని దక్ష యగ్నానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు సతినీ, శివుడిని ఘోరగంగా అందరి ముందు అవమానించాడు. దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ రుద్రుడు తన సమస్త గణాలను పంపగా వారు దక్షయగ్నాన్ని నాశనం చేసి దక్షుణ్ని సంహరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని మన పెద్దలు రెండు కథలుగా చెబుతారు..ఒక కథ ఏంటంటే..
ఆ పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని తీసుకెళుతున్న సమయంలో ఆ తల్లి శరీర భాగాలు పడ్డ చోట శక్తి పీఠాలుగా వెలిశాయని చెబుతుంటే..మరో కథ ప్రకారం శివుడు సతీ వియోగం దు:ఖం తీరక ఆమె శరీరాన్ని పట్టుకుని ఉండిపోయి, జగత్ రక్షణ కార్యాన్ని విస్మరించడంతో సఖల దేవతల ప్రార్థనలతో శ్రీమహా విష్ణువు సతీ దేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసి శివుడిని కర్తవ్వోన్ముకున్ని చేశాడు. ఆ విచ్చిన్నమైన సతీ దేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా మారి. భక్తులకు ఆరాధనా స్థలాలుగా మారాయి. ఈ శక్తి పీఠాలందు దాక్షాయని మాతకు తోడుగా శివుడు కూడా వేలసి, సకల జనులకు దర్శనమిస్తున్నాడు. ఈ శక్తి పీఠాలు భారత దేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి మూడు దేశాలలో కూడా ఉన్నాయి.
ముఖ్యంగా సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తి పీఠాలు 51 అని, మరికొంత మంది 108 అని వారించగా ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్లోకం ఆధారంగా చూస్తే శక్తి పీటాలు 18మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. అయితే 18 శక్తి పీఠాలలో ఒకటి పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్ లో వెలసింది, మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తిపీఠాలు మన భారత దేశంలో ఉన్నాయి. వీటినే మహాశక్తి పీఠాలని కూడా అంటారు. ఆ శక్తిపీఠాలేంటో అవి ఎక్కడెక్కడ వెలిశాయో తెలుసుకుందాం..
1. శాంకరీదేవి :
ట్రింకోమలి( శ్రీలంక) లోని ఒక కొండపై శిథిలాలయాన్నే శాంకరీ దేవి కొలువైన ప్రదేశంగా భావిస్తున్నారు. (ఈ ఆలయ ఆనవాలులు పోర్చుగీసుల దాడి కారణంగా కనిపించుట లేదు.)
2. కామాక్షీదేవి :
కామాక్షీ దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్టు చెప్పే ప్రదేశం. ఇక్కడ అమ్మవారు కామాక్షి రూపంలో కొలువై ఉంది.
3. శృంఖలాదేవి :
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈశృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లామాత గా పూజిస్తారు. పాండువానే అసలైన శివక్షత్రమని, ఇది పశ్చిమబెంగాల్లో వెలసి ఉంది.
4. చాముండేశ్వరీదేవి:
ఈ ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై, కర్ణాటకాలో ఉంది. ఈ ప్రదేశంలో ఆ పరమేశ్వరుడి రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ఈపర్వతాలపై పడ్డాయని స్థల పురాణం
చెబుతుంది.
5. జోగులాంబాదేవి:
మన రాష్ట్రంలో వెలసిన నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబా శక్తిపీఠం.ఇది ఆలంపూర్, తెలంగాణ రాష్టంలో ఉంది. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు, దవడ భాగం
పడినట్లు చెప్పే చోటు.
6. భ్రమరాంబికాదేవి :
శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు చక్రంతో ఖండిప బడిన సతి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే ఇక్కడే పరమేశ్వరుని యొక్క ద్వాదశ జోతిర్లింగ క్షేత్రంకూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి.
7. మహాలక్ష్మీదేవి:
ఆది పరాశక్తి ‘అంబాబాయి'గా కొల్హాపూర్, మహారాష్ట్ర వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు.
8. రేణుకాదేవి:
మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో, మాహుర్ క్షేత్రంలో వెలిసిన తల్లి రేణుకాదేవి. ఇక్కడి వారు ఈ తల్లిని ఏకవీరికాదేవిగా కొలుస్తారు. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల నుండి పూజలందుకుంటున్నది.
9. మహాకాళీదేవి:
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతం తెలుపుతోంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళీ రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి.
10. పురుహూతికాదేవి:
పురాణ ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠబాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణలు
తెలుపుతున్నాయి.
11. గిరిజాదేవి :
ఒడిశా, జాజ్పూర్ లో వెలసిన తల్లి గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని అక్కడి స్థానికులు బిరిజాదేవిగా , విరిజాదేవిగా కొలుస్తారు.
12. మాణిక్యాంబాదేవి:
ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ లో సతీ దేవి ఎడమ చెంప భాగం పడినట్లు, ఈ ప్రదేశాన్ని ద్రాక్షారామంగా, దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామక్షేత్రంగా వెలసింది.
13. కామరూపాదేవి:
అసోం రాజధానికి గువాహటిలోని నీలచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థలపురాణం.
14. మాధవేశ్వరీదేవి :
అమ్మవారి కుడిచేతి వేళ్ళు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రం ఉండదు. నాలుగు దిక్కులా సమానంగా కట్టన పీఠం మాత్రం ఉంటుంది.
15. వైష్ణవీదేవి :
కాంగ్రా, జ్వాలాముఖి, హిమాచల్ప్రదేశ్ వెలసిన దేవీ వైష్ణోదేవి. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలముఖిగా భక్తులకు దర్శనమిస్తారు.
16. సర్వమంగళాదేవి :
సతీదేవి శరీరభాగాల్లో స్తనాల బీహార్ లోని గయా ప్రాంతంలో పడినట్లుగా చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థలపురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.
17. విశాలాక్షీదేవి :
సతీదేవి మణికర్ణిక(చెవి భాగం) వారణాసి, ఉత్తరప్రదేశ్ పడిందని, ఈ ప్రదేశం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయసమీపంలో ఉన్నట్లు స్థలపురాణం తెలుపుతోంది.
18. సరస్వతీదేవి :
పాక్ అక్రమిత ప్రదేశమైన కాశ్మీర్ లోని ముజఫరాబాద్ కు దాదాపు 150కిమీ దూరంలో ఈ శక్తిపీఠం ఉండేదని చెబుతారు.