కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం గండికోట. రాయలసీమ జిల్లాలలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం గండికోట. ఈ ప్రాంతంలో ఉన్న ఎర్రమల కొండలనే గండికోట కొండలని అంటారు. పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి, ఎర్రమల పర్వత శ్రేణికి మధ్య పడిన గండి కారణంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చిందట. ఇక్కడి లోయ చాలా అందంగా వుంటుంది. దట్టమైన అడవుల మధ్య శతృవుల దాడిని ఎదుర్కొనడానికి ఈ కోట అనుకూలంగా ఉండేదట. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ప్రవహించే పెన్నా నది పచ్చని పరవళ్ళు చూడటానికి ఎంతో సుందరంగా వుంటుంది. చుట్టూ ఎత్తైన గోడలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడ్డ దుర్భేద్యమైన కొండలు, దట్టమైన అడవులు, లోతైన లోయలు, కోటలు, అందులో అంతఃపురాలు, దేవాలయాలు, మసీదులు, పూల తోటలు .. ఇవన్నీ గండికోట యొక్క వర్ణనలో భాగమే. గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే 'గండి కొండలు' అని కూడా అంటారు.
PC: Akanksha1811
గండికోట చరిత్ర
దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచినది గండికోట. గండికోటను పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజు నిర్మించాడని చెప్పబడుతున్నది. కానీ తగిన ఆధారం లేదు. గండికోట ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరిలోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 17వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనప్పుడు అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా కుమారుడు తిమ్మానాయునికి, మంత్రి పొదిలి లింగన్న ద్వారా విషప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీనపరచుకొన్నాడు. గండికోట జమ్మలమడుగు నుంచి పశ్చిమ దిశలో దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై వుంది. పెన్నా నదీ ప్రవాహం కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల దీనికి గండికోట అని పేరు వచ్చిందని చెబుతారు.
చూడదగిన ప్రదేశాలు
రంగనాథాలయం:
PC : Chaduvari
క్రీ.శ.1557 నాటి శాసనంలో రంగనాథాలయం గురించిన విషయాలు పొందుపరచబడి వున్నాయి. ఆ శాసనంలో గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని తెలుస్తుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.15వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.
మాధవరాయ ఆలయం:
PC : Harish Aluru
మాధవరాయ ఆలయం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ. 16 వ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయ నిర్మాణాన్ని బట్టి దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో నిర్మించినట్లు చెప్పవచ్చు. చాళుక్యులు, విజయనగరరాజులు, పెమ్మసాని నాయకులు వంటి రాజుల పాలనలో గండి కోట చారిత్రక కట్టడాలు వారి జీవన శైలిని తెలుపుతాయి.
గండికోట ఎలా చేరుకోవాలి
PC : Vishwas M.G
రైలు మార్గం : గండికోటకు 15 కిలోమీటర్ల దూరంలో జమ్మల మడుగు రైల్వే స్టేషన్ కలదు.
రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి సొంత వాహనం మీద వచ్చేవారు ఎన్ హెచ్ 7 మీదుగా కర్నూల్ చేరుకొని, అక్కడి నుండి బనగానపల్లె -->కోవెలకుంట్ల --> జమ్మలమడుగు -->గండికోట చేరుకోవచ్చు.