ఒరిస్సా రాష్ట్రం లో వున్న ప్రఖ్యాత తీర్ధ స్థలం పూరి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి సుమారు 60కిమి దూరంలో సముద్రతీరాన వుంది. ఇక్కడ పూరి జగన్నాథ మందిరం బహుళ పురాతనమైన ప్రసిద్ద దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సమీపంలో జగన్నాథుని మౌసిమా (చిన్నమ్మ) దేవాలయం అక్కడే సమీపంలో ఉంది. ఆ దేవాలయమే శ్రీ గుండిచా.
పూరిలో జగన్నాథ రతయాత్ర గురించి తెలియని వారుండరు. అయితే ఇక్కడే ఉన్న మరో ప్రధాన ఆలయం గుండిచ గురించి చాలా మందికి తెలియదు.. శ్రీ గుండిచా దేవాలయం బస్సు స్టాండ్ దగ్గరగా ఉంది. చతురస్రాకారంలో నెలకొని ఉన్న శ్రీ గుండిచ ఆలయం జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంను గుండిచ ఘర్ లేదా గుండిచ మందిర్ అని పిలుస్తారు. జగన్నాథ ఆలయం తరువాత శ్రీ గుండిచ ఆలయం పూరి జగన్నాథునికి రెండవ అత్యంత ప్రముఖ ప్రదేశంగా ఉంది. మరి ఆ విశేషాలేంటో..ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుసుకుందాం..
దేవాలయం నిర్మాణ శైలి:
ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. ఈ గుండిచ దేవాలయం యొక్క నిర్మాణశైలి అద్భుతంగా ఉంది.
PC:Aditya Mahar
గుండీచా మందిరం జగన్నాథుడి అతిథిగృహం
ఈ ఆలయం కళింగ శకం యొక్క విలక్షణ నిర్మాణం కలిగి ఉంది. లేత బూడిద రంగు ఇసుక రాయితో చేసిన 75 అడుగుల ఎత్తు మరియు 430 అడుగుల పొడవు గల ఆలయం కుడి వైపు మధ్యలో ఒక అందమైన తోట ఉంది. చుట్టూ ఒక గోడ ఉంటుంది. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నవేది అనే ఒక సింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథిగృహం అన్నమాట!
PC: Kamalakanta777
ఈ దేవాలయం జగన్నాధుని ఉద్యానవనం
ఈ దేవాలయం జగన్నాధుని ఉద్యానవనం (విడిది గృహం) గా చెప్పబడుతుంది. దీనికి తగ్గట్లే చుట్టూ పచ్చని ఉద్యానవనం ఉండి మధ్యలో గుడి నిర్మించబడింది. పూరీ జగన్నాధుని ప్రధాన ఆలయం నుండి ఇది దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండొ ఆలయాలు బడా దండాగా పిలువబడే రథయాత్రా మార్గానికి చెరో చివర ఉన్నాయి.
PC: Ben30ghosh
గుండిచ మందిరంలో బలభద్ర , సుభద్రలతో వున్న జగన్నాధుని దర్శించుకుంటే
ఆషాఢపు వుక్కపోతనుండి తప్పించుటకు భగవంతుడిని యీ మందిరంలో పెడతారు అనేది కళింగుల నమ్మిక. గుండిచ మందిరంలో బలభద్ర , సుభద్రలతో వున్న జగన్నాధుని దర్శించుకుంటే వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం వస్తుందట.
PC: Offical Site
కృష్ణుని మౌసిమా (చిన్నమ్మ) దేవాలయం
పూరి లోని గుండిచా మందిర్ శ్రీ కృష్ణుడి మౌసిమా (చిన్నమ్మ) పవిత్ర నివాసం. 9 రోజుల రథయాత్ర సమయంలో, ఆలయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
పూరిలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది:
ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు పూరిలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. సుమారు 45 అడుగుల యెత్తైన రథాలమీద జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర రాచ వీధులలొ ఊరేగుతూ శ్రీమందిరం నుంచి మౌసిమా ( పినతల్లి ) మందిరంలో కొంచం సమయం విశ్రాంతి తీసుకొని గుండిచ మందిరంలో తొమ్మిది రోజులు వుండి తిరిగి శ్రీ మందిరానికి రావడాన్ని రథాయాత్ర అని అంటారు.
జగన్నాథుని రథయాత్రని వొక్క క్షణకాలం చూసినా పునర్జన్మ వుండద
జగన్నాథుని రథయాత్రని వొక్క క్షణకాలం చూసినా పునర్జన్మ వుండదని భక్తుల నమ్మిక. తొమ్మిది రోజులు గుండిచ మందిరంలో నిత్య పూజలు , నిత్య నైవేద్యాలతో పాటు " ఛెన్న పుడో పిఠ " అనే వంటకం ప్రత్యేకంగా నివేదించడం జరుగుతుంది.
PC: Bpkp
జగన్నాథుని కొరకు స్వయం తీపి వంటలు చేసిన లక్ష్మీదేవి
జగన్నాదునికి అతి ప్రీతికరమైన వంటకమని , లక్ష్మీ దేవి జగన్నాధుని కొరకు తయారుచేసేదని లక్ష్మీపురాణంలో వివరించబడింది. నిజంగా యిది చాలా రుచిగా వుంటుంది. పాల విరుగు (ఛెన్న ) తో చేసే ‘ ఛెన్న పుడో పిఠ ‘ , ‘ ఛెన్న గోజ్జా ‘ యీ రెండు తీపి వంటకాలు ఒరియావారి స్పెషాలిటి అని చెప్పక తప్పదు. ఇవి ఒరిస్సా లో తప్ప యితర రాష్ట్రాలలో లభ్యం కావు. కాబట్టి జగన్నాధుని దర్శించుకున్న తరువాత యీ స్వీట్స్ రుచిని ఆస్వాదించడం మరచి పోవద్దు.
PC: Dreamodisha
మారు రథయాత్ర
జగన్నాధుడు , సుభద్ర , బలభద్రుడు గుండిచ మందిరం నుంచి శ్రీమందిరానికి మరలి రావడాన్ని మారు రథయాత్ర అని అంటారు. జగన్నాధుడు , సుభద్ర , బలభద్రుడు శ్రీ మందిరానికి వచ్చిన తరువాత విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.
గుండిచ దేవాలయ ప్రాంగణంలోపెద్ద తాబేలు
గుండిచ దేవాలయ ప్రాంగణంలో ఉండే ఉద్యానవనంను స్థానికులతో పాటు పర్యాటకులు, మరియు భక్తులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఈ పూరిలో ఈ ఉద్యానవనం చాలా ప్రసిద్ది చెందినది. ఈ గార్డెన్లో పెద్ద తాబేలు ఉంది. ఇది భక్తులు అందించే ఆహారాన్ని తీసుకుంటుంది. ఈ తాబేలును ఆలయానికి అంకితం చేయబడినది. కనుక దీన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు.
PC: G-u-t
ఇతర ప్రముఖ ఉత్సవాలు :
హేచరా పంచమి, దక్షిణ మేడ, రాసలీలా, సంద్యా దర్శన్, మహాప్రసాద్ మరియు బౌద్ద యాత్రలు వంటి ముఖ్యమైన ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటారు. ఒరిస్సా పర్యటన సమయంలో అనేక పురాణాలు ఈ పవిత్రమైన ఆలయానికి సంబంధించినవిగా ఉన్నాయి.
PC:Bpkp
కలియుగ దైవం అయిన జగన్నాధుని
కలియుగ దైవం అయిన జగన్నాధుని అద్వైత గురువైన ఆది శంకరాచార్యులు , చైతన్య మహాప్రభు , రామకృష్ణ పరమహంస , జయదేవుడు మొదలైన వారు యీ స్వామిని దర్శించుకొని ధన్యులయ్యేరు అనేది యిక్కడి చరిత్ర చెప్తోంది.
ఎలా చేరుకోవాలి:
పూరికి సమీపంలో భువనేశ్వర్ విమానాశ్రయం ఉంది. భువనేశ్వర్ విమానాశ్రయం నుండి పూరి చేరుకోవడానికి సుమారు 3 నుండి 4గంటల సమయం పడుతుంది. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు భువనేశ్వర్ , హైదరాబాద్, ముంభై ఢిల్లీ, కలకత్తా మరియు చెన్నెలకు కలుపుతాయి. భువనేశ్వర్ కలకత్తా-చెన్నై మద్య రైల్వే కనెక్షన్స్ ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాల నుండి రైళ్ళు భువనేశ్వర్ కు చేరుకుంటాయి. మీరు పూరీకి కలకత్తా నుండి ప్రయాణం చేయానుకుంటే, కోరమాండల్ ఎక్స్ప్రెస్ మీకు అత్యంత అనుకూలమైన ఎంపిక. అలాగే మీరు హౌరా స్టేషన్ నుండి పూరీకి రైల్లో ప్రయాణించవచ్చు.