అక్కడ నుంచి వీచే గాలుల్లో పనస, మామిడి, జీడిమామిడి పండ్ల సువాసనలు కలిసిపోయి మన ముక్కుపుటాలను తాకుతాయి. ఎటు చూసిన పచ్చదనం కప్పుకొన్న కొండలు మన మనస్సులను స్వర్గపుటంచలదాకా తీసుకువెళుతాయి. ఇక ఉరికే జలపాతాలు, గుంపులు గుంపులుగా ఎగిరే పక్షులు, మధ్యాహ్నానికే కనుమరుగయ్యే సూరీడు ఇలా అందమైన ప్రకృతి మొత్తం ఆ తూర్పూకనుమల్లోనే ఉంటుంది.
ఇక అక్కడి ప్రజలు చైనా, టిబెటియన్లను పోలి ఉంటారు.అనేక బౌద్దారామాలు ఉన్నాయి. వాటి నిర్మాణం కూడా మన భారతీయ శైలికి పూర్తి భిన్నంగా టిబెట్ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇదేమిటీ తూర్పుకనుమలు మన దేశంలో అందులోనూ ఆంధ్రప్రదేశ్ కు దగ్గరగా ఉంటాయి కదా మరి మనుషులు ఏమిటీ చైనా, టిబెట్ అని అంటున్నారు అని ఆలోచిస్తున్నారా? మీ ఈ కథనం మీ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. మరెందుకు ఆలస్యం చదివేయండి వీకెండ్ లో మీరు కూడా వెళ్లి మిని టిబెట్ ను చూసిరండి.
ఆంధ్ర సరిహద్దులో
P.C: You Tube
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నఒడిషాలోని పర్లాకిమిడికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం చంద్రగిరి. ఈ ప్రాంతం ఒడిషా లోని బరంపురం నుంచి కూడా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక శ్రీకాకుళానికి పర్లాకిమిడికి మధ్య కేవలం 67 కిలోమీటర్ల దూరం మాత్రమే.
టిబెట్ ను గుర్తుకు తెస్తాయి
P.C: You Tube
ఒడిషాలోని గజపతి జిల్లాలో దాదాపు ఆరేడు కిలోమీటర్ల పరిధిలో చంద్రగిరి కేంద్రంగా ఐదు ఆవాసాల్లో ఈ వలస టిబేటియన్లు మనకు కనిపిస్తారు. సంప్రదాయ బౌద్ధరీతిలో నిర్మించిన ఆలయాలు, కట్టడాలు అన్నీ మనకు టిబెట్ ను గుర్తుకు తెస్తాయి.
మినీ టిబెట్
P.C: You Tube
పిల్లల నుంచి పెద్దల వరకూ టిబెటియన్ సంప్రదాయపు దుస్తులనే ధరిస్తారు. వారి ఆహారపు అలవాట్లు, పూజా విధానాలు అన్నీ టిబెట్లను పోలి ఉంటాయి. అందువల్లే ఈ చంద్రగిరి ప్రాంతాన్ని మినీ టిబెట్ అని పిలుస్తారు. ఇక్కడికి కొద్ది దూరంలో ఖసాడా, తప్తపాని, గండాహతి జలపాతాలు కనిపిస్తాయి.
దలైలామాతో సహా కొంతమంది
P.C: You Tube
టిబెట్ ను చైనా ఆక్రమించుకొన్న తర్వాత దలైలామాతో సహా కొంతమంది భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ధర్మశాలతో పాటు వివిధ ప్రాంతాలకు వలస వచ్చారు. అలా వలస వచ్చిన వారిని భారత దేశం శరణార్థులుగా గుర్తించి వారికి నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసింది.
చంద్రగిరిలో టిబెట్ ఆవాసాన్ని ఏర్పాటు చేసింది
P.C: You Tube
ఈ క్రమంలోనే 1963లో ఒడిషాలోని గజపతి జిల్లాలోని చంద్రగిరిలో టిబెట్ ఆవాసాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతం తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి దాదాపు 3,500 ఎత్తులో ఉంటుంది. మొదట్లో 25 మంది టిబెట్ శరణార్థలు ఇక్కడకు వచ్చారు. అటు పై దశలవారిగా వచ్చిన వారితో ఆ సంఖ్య 3,500 మందికి చేరింది.
మొక్కజొన్నను ఎక్కువగా
P.C: You Tube
పర్వత ప్రాంతమైనా కూడా ఇక్కడ 23 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. దీంతో ప్రభుత్వ తమకు కేటాయించిన భూముల్లో ఈ శరణార్థులు మొక్కజొన్నను ఎక్కువగా పండిస్తారు. ప్రస్తుతం ఇక్కడ మొక్కజొన్నను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తుండటంతో దీనిని మెయిజ్ బౌల్ ఆఫ్ ఒడిషాగా పిలుస్తున్నారు.
టిబెటియన్ మాస్టిఫ్
P.C: You Tube
దీనితో పాటు వరి, చిరుధాన్యాలు పండిస్తారు. ఇక మహిళలు ఉన్ని దుస్తులను చేతితో అల్లి ఒడిషాతో పాటు ఉత్తరాంధ్రలోని పలు పట్టణాల్లో విక్రయిస్తుంటారు. మరికొంతమంది టిబెటియన్ మాస్టిఫ్, టిబెటన్ ఏప్సస్ వంటి మేలుజాతి కుక్కలను పెంచి విక్రయిస్తుంటారు.
21 అడుగుల భారీ బుద్ధ విగ్రహం
P.C: You Tube
చంద్రగిరితో పాటు టాంకిల్ పదర్, లోబర్సింగి, జిరాంగ, మహేంద్రగడ అనే ఐదు ఆవాసాల్లో పలు బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. ఇందులో జిరంగలోని పద్మసంభవ మహావిహార ఆలయం ప్రధానమైనది. ఇందులో 21 అడుగుల భారీ బుద్ధ విగ్రహం ఉంటుంది. పైకప్పు, గోడలకు బౌద్ధ కళారీతిలో వర్ణరంజకమైన పెయింటింగ్ కనిపిస్తాయి.
ఏడేళ్లపాటు సాగి
P.C: You Tube
2003లో ప్రారంభించిన ఈ ఆలయ నిర్మాణం ఏడేళ్లపాటు సాగి 2010లో పూర్తయ్యింది. ఏడో శతాబ్దంలో జన్మించిన పద్మసంభవుడు మహాయాన శాఖలోని వజ్రయాన శాఖను స్థాపించినట్లు చెబుతారు. ఆయన అప్పట్లో ఒడిషాలో ఈయన బౌద్ధం వ్యాప్తికి చాలా పాటుపడినట్లు చెబుతారు.
బౌద్ధమతాన్ని బోధిస్తారు
P.C: You Tube
ఇక ఈ ఆలయంలో 200 మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవడానికి వీలవుతుంది. ఇక ఇక్కడ ఆలయాలతో పాటు ఆసుపత్రులు, పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. అక్కడ సాధారణ విద్యతో పాటు బౌద్ధమతాన్ని కూడా బోధిస్తారు. ఆయుర్వేదాన్ని కూడా విద్యార్థులు అభ్యసిస్తారు. ఇక్కడ బౌద్ధమతానికి చెందిన పిల్లలు అవే దుస్తుల్లో పుట్ బాల్ ఆడటం కూడా మనం చూడవచ్చు.