పరమశివుడిని అర్థనారీశ్వరుడిగా పేర్కొంటాము. అందుకేనేమో ఇక్కడ శివలింగానికి జడలు ఉంటాయి. ఇక్కడ శివుడికి ముడుపులు కడితే కోరిన కోర్కెలు తీరుతాయని చెబుతారు. ముఖ్యంగా ఈ దేవాలయంలో ఉన్న పావుకోళ్ళు ఏ రోగాన్నైనా తగ్గించే దివ్య ఔషదంగా పనిచేస్తాయని భక్తులు నమ్ముతారు. అందువల్ల ఇక్కడకు రోజురోజుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పురాణ పరంగా కూడా ఈ దేవాలయానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. పరశరాముడు ప్రతిష్టించిన చివరి 108వ శివలింగం ఇదేనని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రం పరమ విశిష్టమైనదని పేర్కొంటారు. ఇక్కడ పరమ శివుడు కలియుగాంతం వరకూ కొలువై ఉంటానని పరుశరాముడికి స్వయంగా చెప్పాడు. ఆ క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలో ఉంది. ఇంతటిప్రాధాన్యత కలిగిన ఆ శైవ క్షేత్రం వివరాలు మీ కోసం
కార్త్య వీరార్జునుడనే రాజు
P.C: You Tube
పూర్వం కార్త్య వీరార్జునుడనే రాజు అవిశ్రాంతంగా వేటాడి బడలికకు గురవుతాడు. దీంతో బడలిక తీర్చుకోవడానికి తన పరివారంతో కలిసి దగ్గరగా ఉన్న జమదాగ్ని ముని ఆశ్రమానికి వెలుతాడు. అక్కడ జమదాగ్ని తన దగ్గర ఉన్న కామదేనువు సహాయంతో క్షణాల్లో రాజుతోపాటు పరివారానికి పంచభక్షపరమాన్నాలతో భోజం పెడుతాడు.
కామధేనువు కావాలి
P.C: You Tube
విషయం తెలుసుకున్న రాజు తనకు ఆ దేనువు కావాలని జమదాగ్నిమునిని వేడుకొంటాడు. అయితే రాజుకోరికను జమదాగ్నిముని తిరస్కరిస్తాడు. దీంతో రాజు జమదాగ్నిమునిని తన ఖడ్గంతో చంపి ఆ కామదేనువును రాజ్యానికి తీసుకువెళుతాడు.
పరుశరాముడు
P.C: You Tube
విషయం తెలుసుకొన్న జమదాగ్ని కుమారుడైన పరశరాముడు తన తండ్రిన చంపిన కార్త్య వీరార్జునడిని చంపేస్తాడు. అటు పై ఈ భూ మండలాన్ని 21 సార్లు ప్రదక్షిణం చేసి కనబడిన ప్రతి ఒక్క క్షత్రియుడిని ఓడించి సంహరిస్తూ ఉంటాడు. అటు పై పాపపరిహారం కోసం దేశంలోని వివిధ చోట్ల 108 శివలింగాలను ప్రతిష్టిస్తాడు.
108 శివలింగాలను
P.C: You Tube
అటు పై అక్కడే కొద్ది కాలం పాటు తపస్సు చేసి తనకు సంక్రమించిన తన తప:సంపదనంతటిని ఆ శివలింగాల్లోకి ప్రవేశపెడుతాడు. ఇలా ప్రతి ష్టించిన 108 శివలింగాల్లో చివరిదైన 108వ లింగమే శ్రీ జడల రామలింగేశ్వర స్వామి శివలింగం. ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.
కోపంతో పరశరాముడు
P.C: You Tube
ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించిన తర్వాత ఎంత కాలం తపస్సు చేసినప్పటికి ఆ పరమశివుడు పరశరాముడికి ప్రసన్నం కాలేదు. దీంతో పరశరాముడు తన గొడ్డలితో ఆ శివలింగం పై భాగం పై ఒక దెబ్బ వేశాడు. ఆప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి పరశరాముడి పాపాన్ని పోగొట్టుతాడు.
జడల వంటి నిర్మాణం
P.C: You Tube
అంతేకాకుండా తాను కలియుగాంతం వరకూ ఇక్కడే కొలువై ఉండి భక్తుల కోరికలు తీరుస్తానని శివుడు పరశరాముడికి తెలియజేస్తాడు. ఇక లింగం పై గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి నిర్మాణం ఏర్పడింది.
కలియుగం ముగిసేంత వరకూ
P.C: You Tube
అదే విధంగా పరుశరాముడు కూడా తానూ కలియుగం ముగిసేంత వరకూ ఇక్కడ లింగరూపంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెబుతాడు. అలా పరశరామ ఆత్మలింగం కూడా ఇక్కడ ఉంది. ఈ లింగం ప్రధాన ఆలయంలోని లింగానికి సమీపంలో ఒక గుహలో ఉంది. అందువల్ల చెర్వుగట్ట జడల రామలింగేశ్వరిని క్షేత్రాన్ని పరుశరామ క్షేత్రం అని అంటారు.
అందుకే ఆ పేరు
P.C: You Tube
ఇక పరశరాముడు ప్రతిష్టించిన లింగం కావడమే కాకుండా ఆ లింగానికి జడల వంటి నిర్మాణం ఉండటం వల్ల ఇక్కడ ఉన్న స్వామివారిని శ్రీ జడల రామలింగేశ్వరస్వామి అని పేరు వచ్చినట్లు స్థల పురాణం చెబుతుంది. ఇక కొండపైన ఉన్న జడల రామలింగేశ్వరుడికి 12వ శతాబ్దికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడని చెబుతారు.
పశ్చిమాభిముఖంగా
P.C: You Tube
ఆలయంలో శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు. ఈ శివలింగానికి నేత్రాలు అలంకరించబడి ఉంటాయి. ఈ గుహాలయం ప్రవేశమార్గం ముందు విశాలమైన ముఖ మండపం ఉంటుంది. ఈ మంటపం దాటి లోపలికి వెళితే ఎదురుగా వినాయకుడి విగ్రహం ఉంటుంది. గర్భగుడి ఇవతలివైపున శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు, ఆయన వెనుక చిన్న ధ్వజస్తంభం ఉంటుంది.
ముడుపుల గట్ట
P.C: You Tube
ఆలయం దగ్గర ఇక చిన్న గట్ట ఉంటుంది. దీనిని ముడుపుల గట్ట అని అంటారు. ఇక్కడ భక్తులు కట్టిన అనేక ముడుపులు మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆ గట్ట మీద అనేక పావుకోళ్ళు (పాదరక్షకలు) ఉంటాయి. అనారోగ్యంగా ఉన్న ఆ గట్ట వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తే వారి మీద ఆ పావుకోళ్ళు శరీరమంతా కప్పేలా పెడుతారు.
11. రోగాలు నయమవుతాయి
P.C: You Tube
దీంతో రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా సంతానలేమితో బాధపడే వారికి మేలు జరుగుతుందని కూడా చెబుతారు. మరికొంతమంది ఆ పావుకోళ్ళను తల పై పెట్టుకొని ఆ ముడుపుల గట్టు చుట్టూ తిరుగుతారు. దీని వల్ల అనుకొన్న కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.
ఆంజనేయ స్వామి దేవాలయం
P.C: You Tube
ఇక్కడ ప్రధాన ఆలయానికి అతి దగ్గర్లో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. దాని పక్కనే ఎల్లమ్మ దేవి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామికి 40 రోజులు ప్రదక్షిణలు చేస్తే భూత, ప్రేత, పిశాచాల బాధ తప్పుతుందని భక్తులు చెబుతుంటారు. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు ఈ బాధలు పడేవారు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
మూడు గుండ్లు
P.C: You Tube
ఆలయం పక్కన ఎతైన కొండరాళ్ల పై శివలింగం ఉంటుంది. ఈ శివలింగాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం కొంచెం కఠినంగా ఉంటుంది. మెట్లు కూడా సరిగా ఉండవు. రెండు మార్గంలో 96 మెట్లను ఎక్కి శివలింగాన్ని చేరుకోవచ్చు.
కొండ కింద
P.C: You Tube
కొండకింద కొండకి అభిముఖంగా పార్వతీ దేవి ఆలయం ఉంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శివలింగం ఉంటుంది. పక్కనే అద్దంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. భక్తులు నేరుగా ఆలయంలోకి ప్రవేశించడానికి లేదు. అందువల్లే అద్దంలో అమ్మవారిని చూసేలా ఏర్పాటు చేశారు. ఈ విశాలమైన ఆలయ ఆవరణంలో భక్తులు ఉండటానికి సౌకర్యాలు ఉన్నాయి.
ఎలా వెళ్లాలి
P.C: You Tube
హైదరాబాద్ నుంచి నల్గొడ వెళ్లే మార్గంలో నార్కెట్ పల్లికి 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం ఉంది. నార్కెట్ పల్లిదాకా అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి షేర్ ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు.