సాంప్రదాయాలు, దైవాలు మరియు ఆచార వ్యవహారాల పేర్లతో వివిధ తెగలుగా విడిపోయి కొట్లాడుకుంటున్న భారతీయులకు - 'అన్ని మతాలు ఒక్క వేదమతంలో నుంచి ఉద్భవించాయని, అందులో భూతద్దం పెట్టి జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమీ లేదని' చెప్పే శక్తి (వ్యక్తి) కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువులకు పుట్టింది. ఆ వ్యక్తే ఆది శంకరాచార్యులుగా ఖ్యాతిగడించిన సద్గురువు. సాక్షాత్తు శివ స్వరూపంగా భావించే శంకరుడు దేశమంతా దేవుని పేరుతో కొట్లాడుకుంటున్న వేళ అద్వైత మత ప్రచారమనే ఆయుధాన్ని చేపట్టి భారత దేశం అంతా అవిశ్రాంతంగా కాలినడకన పర్యటించి జనుల్లో దైవం పట్ల ప్రీతిని కలిగించాడు.
కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి 75 కి.మీ. దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది. ఇక్కడే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు జన్మించినది. ఈ గ్రామం పెరియార్ నదికి సమీపంలో ఉన్నది. ఇక్కడి నుండే శంకరాచార్యులు కాలినడకన దేశమంతటా తిరిగి నాలుగు పీఠాలను స్థాపించారు.
ఇది కూడా చదవండి : గురువాయూర్ లో సందర్శించవలసిన స్థలాలు !
కాలడి గ్రామం దేశవ్యాప్తంగా ఆది శంకరాచార్య మతాన్ని ఆచరించేవారందరికీ మరియు పీఠాధిపతులకు ఒక పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచినది. కాలడి అంటే మలయాళంలో అర్థం పాద ముద్ర అని. ఈ గ్రామంలో దేవాలయాలు, ఆశ్రమాలు ఉన్నప్పటికీ ఆది శంకరాచార్యుల జనన స్థలం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ప్రపంచమంతా చాటిచెప్పిన ఆ మహనీయుని జన్మ స్థలం చూడాలనుకొనే తపన గల వారికి, అక్కడి విశేషాలను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం ...
కల్లిల్ దేవి ఆలయం, కాలడి
కల్లిల్ దేవి ఆలయం కాలడి లో కలదు. ఇక్కడి ప్రధాన దైవం దుర్గా దేవి. కల్లిల్ అంటే మలయాళంలో రాయి అని అర్థం. సుమారు 28 - 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడ్డ ఈ దేవాలయం ఒక పెద్ద రాతితో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని దర్శించకోవాలంటే 120 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.
చిత్ర కృప : telugu native planet
కల్లిల్ దేవి ఆలయ టైమింగ్స్
కల్లిల్ దేవి ఆలయంలో రాత్రిపూట పూజలు చేయరు. పగటిపూట అనగా మిట్ట మధ్యాహ్నం 12 గంటల ముందరే పుజలు నిర్వహించి, అనంతరం మూసెస్తారు. ప్రతి ఏటా నవంబర్ - డిసెంబర్ నెలలో నిర్వహించే ఉత్సవాలలో ప్రధాన దేవతను ఆడ ఏనుగులపై ఊరేగిస్తారు.
చిత్ర కృప : telugu native planet
ఆది శంకరాచార్యుల కీర్తి స్తంభం, కాలడి
కాలడి గ్రామం లో ప్రవేశించగానే కంచికామకోటి పీఠం వారు నిర్మించిన ఎనిమిది అంతస్తుల " కీర్తి స్థంభం " అనే బృహత్ భవనం కనిపిస్తుంది. ఆది శంకరుల జీవిత చరిత్ర అంతా చిత్రాలలో ప్రదర్శించారిక్కడ. మండపంలో శ్రీ శంకరాచార్య, గణపతి విగ్రహాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో అన్ని మతాల వారికి అనుమతి ఉంది. పై అంతస్తుకు వెళ్లి నగర దర్శనం చేయవచ్చు.
చిత్ర కృప : Diljeet Nair
శ్రీ కాత్యాయిని మత ఆలయం, కాలడి
కాలడికి కిలోమీటర్ దూరం లో ఉన్న మాణిక్యమంగళం లో శ్రీ కాత్యాయిని మాత దేవాలయం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం దుర్గా మాత. ఇక్కడే శంకరాచార్యుల చిన్నతనంలో తండ్రి శివశర్మ పని మీద బయటికి వెళుతూ కొడుక్కి అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టిరమ్మని పంపాడు.
చిత్ర కృప : S.Siva 1
శ్రీ కాత్యాయిని మత ఆలయం, కాలడి
తండ్రి మాటప్రకారం శంకరాచార్యులు అమ్మవారి ముందు పాల చెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు. అమ్మవారు ఎంతసేపటికీ తాగక పోయేసరికి ఏడుపులంకించుకొన్నాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆ పాలను తాగి శంకరులకు ఆనందాన్ని కలిగించింది.
చిత్ర కృప : GaneshSB
మట్టూర్ తిరువెల్ల మాన్ శివ దేవాలయం, కాలడి
కాలడికి 2 కి.మీ దూరంలో మట్టూర్ తిరువేలు మాన్ శివ దేవాలయం ఉంది. దీన్ని శంకరుల తండ్రి శివశర్మ ప్రతిష్టించాడు. వృద్ధదశ వచ్చాక శంకరుని తల్లితండ్రులు ఇంతదూరం వచ్చి పూజాదికాలు చేయలేక శివుడిని ప్రార్ధించేవారు. అప్పుడు శివుడు కలలో కన్పించి " నాట్యం చేసే తెల్ల జింక (మలయాళంలో 'తిరువెల్ల మాన్ మల్లి')" ను అనుసరించి వెళితే తన లింగం వద్దకు చేరుస్తుందని చెప్పాడు. అలానే రోజూ చేసేవారు.
చిత్ర కృప : Sethupathi Arunachalam
శంకర నారాయణ దేవాలయం, కాలడి
శంకర నారాయణ దేవాలయం కాలడికి 3 కి.మీ. దూరంలో ఉంది. ఈ శివాలయం లో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివునిలో కలిసిపోయి శివ కేశవులకు భేదంలేదని రుజువుచేశాడు. ఇక్కడ ముందు శివుడికి తర్వాత విష్ణువుకు అర్చన నిర్వహిస్తారు.
చిత్ర కృప : S.Siva 1
కుజుప్పిల్లిర్కవే జలదుర్గ దేవాలయం, కాలడి
పురాతనమైన కుజుప్పిల్లిర్కవే జలదుర్గ దేవాలయం అన్నివైపుల నుండి నీటితో కప్పబడి ఉంటుంది. ఈ నీరు ఎప్పటికి ఎండిపోదని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. గుడి లోపల జలదుర్గ ఉత్సవాన్ని 16 రోజులపాటు నిర్వహిస్తారు ఆలయ ధర్మకర్తలు. ఫాల్గుణమాసం మొదటిరోజు ప్రారంభమయ్యే ఈ ఉత్సవ వేడుకలకు వేలాది భక్తులు హాజరవుతారు.
చిత్ర కృప : Eskayem
వామన మూర్తి దేవాలయం, కాలడి
కాలడి లో విష్ణుమూర్తి అవతారం అయిన వామనుడికి దేవాలయం ఉండటం అరుదైన విషయమనే చెప్పాలి. గుడిని పురాతన కేరళ శిల్పశైలిలో త్రిక్కకారలో కట్టించినారు. ఈ ఆలయం పైభాగాన గల రాతి శాసనాలు క్రీ.శ 10 - క్రీ.శ. 13వ శతాబ్ధం నాటివిగా చెబుతారు. ఈ దేవాలయ సందర్శనకు ఉత్తమ సమయం ఓనం పండుగ. వామనుడు ఓనం పండుగకు సంబంధించినవాడుగా స్థానికులు, పూజారులు చెపుతారు.
చిత్ర కృప : telugu native palnet
మహదేవ దేవాలయం, కాలడి
తిరువాణికులం మహదేవ దేవాలయం ఎర్నాకుళం జిల్లాలో అలూవాకు దక్షిణంగా, కలాడీ సమీపంలో కలదు. ఇక్కడ శివుడు ప్రధాన దైవం. ఇక్కడే శివుడి భార్య మాత పార్వతి కి గూడా ఒక గుడి కలదు. ఈ దేవాలయంలో గణేశ, అయ్యప్ప, విష్ణు విగ్రహాలు కూడా కలవు. గర్భగుడిని సంవత్సరంలో 12 రోజులు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.
చిత్ర కృప : Arunachala Gopalsamy
శృంగేరి మఠ సముదాయం, కాలడి
శ్రింగేరి మఠ సముదాయం పెరియార్ నదికి ఉత్తరం వైపుగా కలదు. ఈ ఆశ్రమం శ్రీ ఆది శంకరాచార్యుల తల్లికి అంకితం చేయబడినది. ఈ మఠంలో నిరంతరం వేదాంత చర్చలు, గోష్టులు జరుగుతాయి. ప్రముఖ పండితులు, పీఠాధిపతులు ఇందులో పాల్గొంటారు. ఆశ్రమం లోపల శంకరాచార్య, మాత శారదాంబ మరియు గణేశ విగ్రహాలు కలవు. ఇక్కడ నవరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి.
చిత్ర కృప : Arunachala Gopalsamy
రామకృష్ణ ఆశ్రమం, కాలడి
రామకృష్ణ ఆశ్రమం కాలడి లో కలదు. ఇందులో ప్రార్థన లు చేసుకోవటానికి ఒక పెద్ద హాలు మరియు రామకృష్ణ దేవాలయం నమూనాలో ఒక ఆలయం ఉన్నాయి. ఇక్కడి పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండి, ప్రార్థన లు, ధ్యానం, యోగ చేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. ఉపశమనం పొందటానికి వీలైతే మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ సైతం చేయవచ్చు.
చిత్ర కృప : telugu native planet
మంజప్ప శివాలయం, కాలడి
కాలడి కి సమీపంలో ఉన్న మంజప్పకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం లో మంజప్ప కార్విల్లి కావు శివ టెంపుల్ ఉన్నది. ఇక్కడే శంకరాచార్యుల తండ్రి శివశర్మ పూజారిగా పనిచేసినాడు.
చిత్ర కృప : S.Siva 1
శంకరాలయం, కాలడి
శంకరులు తన తల్లి ఆర్యాంబ కోసమై పూర్నా నదిని ఇంటి వరకు మళ్లించిన ప్రదేశం శంకరాలయానికి దగ్గరలోనే ఉంది. దాని తీరం మీదనే శంకరులు శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించారు. ఈ ప్రాంతాన్ని ‘'కపిల్లమన'' అంటారు. గుడిలో శంకర,శారదాంబ, వినాయకుని విగ్రహాలు కనిపిస్తాయి. శంకరుల తల్లి ఆర్యాంబ సమాధి కూడా ఇక్కడే ఆలయం లో ఉంది. అక్కడ నిత్యం జ్యోతి వెలుగుతూనే ఉండటం విశేషం.
చిత్ర కృప : Arunachala Gopalsamy
మొసలి ఘాట్, కాలడి
" మూతలల కడవు " అంటే మొసలి ఘాట్ ( క్రోకడైల్ ఘాట్ )అంటారు. ఇక్కడే నదిలో స్నానం చేస్తుంటే బాల శంకరుని మొసలి పట్టుకోంది. తల్లి అనుమతి తో నీటిలోనే ఆపద్ధర్మ సన్యాస దీక్ష తీసుకొన్నాడు బాల శంకరులు.
చిత్ర కృప : Arunachala Gopalsamy
కాలడి ఎలా చేరుకోవాలి ??
వాయు మార్గం
కలాడికి సమీప విమానాశ్రయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 44 కి.మీ.ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం దేశంలోని ఇతర విమానాశ్రయాలకు, విదేశాలకు కలుపబడి ఉంది. విమానాశ్రయం నుండి ప్రవేట్ టాక్సీలు కూడా లభ్యమవుతాయి.
రైలు మార్గం
కాలడి కి సమీప రైల్వే స్టేషన్ ఆలువ ( 18 కి. మీ. దూరంలో). ఇక్కడి నుండి దేశంలోని చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. అన్ని ప్రధాన నగరాల కు వెళ్లే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.
రోడ్డు మార్గం
ఎర్నాకులం, గురువాయూర్ నుండి కలాడికి నేరుగా ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు కలవు. రాష్ట్రంలోని మిగితా అన్ని పట్టణాలనుండి కూడా ఉత్సవాల సమయాల్లో బస్సులు నడుపుతుంటారు.
చిత్ర కృప : കാക്കര