భారత దేశంలో వైష్ణవ, శైవ క్షేత్రాలు వేర్వేరుచోట్ల ఉంటాయి. అయితే ఒకే చోట ఈ రెండు మతాలకు చెందిన విశిష్ట దేవాలయాలు ఉండటం చాలా అరుదైన విషయం. అటువంటి అరుదైన క్షేత్రమే కంచి. ఇక్కడే పార్వతీ దేవి శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేసిందని చెబుతారు. అంతేకాకుండా ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను ఇక్కడే పెళ్లి చేసుకున్నట్లు పురాణ కథనం. ఇందుకు సాక్షమైన మామిడి చెట్టు ఇప్పటికీ అక్కడే ఉంది.
పంచభూత క్షేత్రాల్లో ఒకటైన ఏకాంబరేశ్వర దేవాలయం కంచిలోనే ఉంది. ఇక 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన వరదరాజ స్వామి దేవాలయం ఇక్కడే ఉంది. అంతేకాకుండా చారిత్రాత్మకంగా కూడా కంచి ఎంతో ప్రాముఖ్యతను చెందింది. ఈ నేపథ్యంలో ఆ చెట్టుతో పాటు కంచిలో ఉన్న ముఖ్యమైన దేవాలయాల గురించిన క్లుప్త సమాచారం మీ కోసం.
కామాక్షి దేవాలయం
P.C: You Tube
తమిళనాడులోని కంచి పట్టణంలో ఉన్న కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. మధుర మీనాక్షి, తిరువనైకవల్లీలోని అఖిలాండేశ్వరీ, కాశీలో ఉన్న విశాలక్ష్మీతో పాటు కంచిలో ఉన్న కామాక్షి ఒక్కరేనని చెబుతారు. కామాక్షి అమ్మవారు ఇక్కడ ఉన్న మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి వేల ఏళ్ల పాటు తపస్సు చేసిందని చెబుతారు. ఆమె తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను ఇక్కడే పెళ్లి చేసుకొన్నాడని చెబుతారు. ఈ మామిడి చెట్టు కాండాన్ని ఇప్పటికీ మనం ఆ దేవాలయంలో చూడవచ్చు.
మూడు వేల ఐదు వందల ఏళ్లు
P.C: You Tube
దాని వయస్సు దాదాము మూడు వేల ఐదు వందల ఏళ్లు ఉండవచ్చునని చెబుతారు. గతంలో ఈ చెట్టుకు వేర్వేరు రుచుల్లో గల మామిడి పళ్లు కాసేవని వాటిని తింటే సంతానం కలుగుతుందని చెబుతారు. అయితే ప్రస్తుతం ఆ ఎండిన చెట్టు స్థానంలో కొత్తమొక్కను ఆలయ నిర్వాహకులు నాటారు. ఇక్కడ అమ్మవారికి ఉగ్రరూపాన్ని చల్లార్చడానికి ఆదిశంకరాచార్యుల వారు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. ఇక ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది.
గోపూజ తర్వాత మొదటి పూజ
P.C: You Tube
ప్రతి రోజూ ప్రాత:కాలంలోనే గోపూజ చేస్తారు. ఈ పూజ తర్వాత అమ్మవారికి ఉన్న తెరను తొలిగించి మొదటి హారతిని ఇస్తారు. ఆ సమయంలో అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకోవడం కోసం ప్రజలు పోటెత్తుతారు. ఈ దేవాలయం ఆవరణ చాలా విశాలంగా ఉంటుంది. అంతే కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కంచిలో కామాక్షి అమ్మవారి ఆలయంలో పాటు వరదరాజస్వామి దేవాలయం, ఏకాంబరేశ్వరదేవాలయం, అత్యంత పురాణ ప్రాధాన్యత కలిగిన, ప్రాచూర్యం చెందిన దేవాలయాలు.
వాటి ప్రాముఖ్యత తెలుసుకోండి
P.C: You Tube
వరదరాస్వామి దేవాలయంలోనే బంగారు, వెండి బల్లుల విగ్రహాలు ఉన్నాయి. బల్లి శరీరం పై పడిన దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రజలు కంచిలోని ఈ వరదరాజస్వామి దేవాలయానికి వచ్చి ఈ బంగారు వెండి బల్లుల విగ్రహాలను తాకుతూ ఉంటారు. ఇక ఇదే ఆలయంలోని ఆనంద సరోవరంలో ఉన్న అత్తి చెక్కతో చేయబడిన దేవతా మూర్తి విగ్రహాలను 40 ఏళ్లకు ఒకసారి కోనేరు నుంచి వెలికి తీసి 40 రోజుల పాటు ప్రజల సందర్శన కోసం ఉంచుతారు. రానున్న 2019 జూన్ లో ఈ అత్తిచెక్క దేవతామూర్తి విగ్రహాన్ని బయటకు తీయనున్నారు. ఇది ఏకాంబరేశ్వర దేవాలయం దేశంలోని పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి శివలింగాన్ని భూమికి ప్రతీకగా భావిస్తారు.
ఎక్కడ ఉంది
P.C: You Tube
చెన్నై నుంచి కంచికి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు గంటల ప్రయాణం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు రైలు సర్వీసులు ఉన్నాయి. చెన్నై వరకూ విమానయాన సర్వీసులు ఉన్నాయి. బస్సు సౌకర్యం కూడా బాగా ఉంది.