హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.
ఇక్కడ స్వామి వారు నిత్యం పెరుగుతూ ఉంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుందని ప్రసిద్ధి. ఇంతటి విశిష్టతలు కలిగిన కాణిపాకం మరెన్నో రహస్యాలకు నిలయం వాటి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...
1. ఆ పేరు ఎలా వచ్చిందంటే
Image source:
కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు.
2. రాతి నుంచి రక్తం
Image source:
ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు.
3. స్వయంభువుడు
Image source:
కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు.
4. అనుకున్న కోరిక తప్పక
Image source:
ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుందని ప్రసిద్ధి.
5. అలా మాత్రం చేయకూడదు
Image source:
అంటే మనకు ఇష్టమైన ఆహార పాదార్థాన్ని త్యజిస్తున్నట్లు ఇక్కడ స్వామి వారి ముందు ప్రమాణం చేయాలి. అటు పై జీవితంలో ఆ ఆహార పదార్థాన్ని ఎప్పటికీ తినకూడదు. తద్వారా మనకు ఏమైన తీరని కోరికలు ఉంటే తప్పక నెరవేరుతాయని స్థానిక ప్రజలు, ఇక్కడి పూజారులు చెబుతారు. ఒక వేళ మన కోరిన కోరిక తీరిన తర్వాత చేసిన ప్రమాణాన్ని మరిచి త్యజించిన ఆహారాన్ని తిరిగి తినడం ప్రారంభిస్తే కీడు జరుగుతుందని భక్తుల నమ్మకం.
6. నిత్యం పెరుగుతూ ఉంటుంది.
Image source:
కాణిపాకంలో కొలువు తీరిన వినాయకుడి సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఆకారంలో స్వామి వారు నిత్యం పెరుగుతూ ఉంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు.
7. అబద్ధాలు చెప్పేవారు భయపడుతారు
Image source:
స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు.
8. అనేక ఆలయాలు ఉన్నాయి.
Image source:
ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.
9. పడగ పై మణి ఉన్న పాము
Image source:
శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ఉంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం (నాగుపాము) తిరుగుతూ వుంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
10. జనమేజయుడు కట్టించాడు
Image source:
శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంది.పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. వరసిద్ధి వినాయకుడి పూజ తర్వాత భక్తులు తప్పక ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
11. చుట్టు పక్కల గ్రామాల వారు
Image source:
చుట్టుపక్కల గ్రామాలు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పోప్పుకుంటారని ప్రసిద్ది. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. అందువల్లే ఇక్కడ అబద్ధాలు చెప్పేవారు స్వామి వారి ముందు ప్రమాణం చేయడానికి వెనకడుగు వేస్తారు. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కి.మీ ల దూరంలో వుంది.
12. బస్సు సౌకర్యములు
Image source:
తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. రైలు సౌకర్యములు: ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.
13. విమాన సౌకర్యములు
Image source:
తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి. భారత దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి రేణిగుంటకు విమానయాన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రభుత్వ, లేదా ప్రైవేటు బస్సుల్లో కాణిపాకం చేరుకోవచ్చు. లేదా ప్రైవేటు ట్యాక్సీలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రైవేటు ట్రావెల్స్ వారు కూడా కాణిపాకం, తిరుపతితో పాటు చుట్టు పక్కల ఉన్న పర్యాటకప్రాంతాలకు తీసుకువెళ్లడానికి ప్రత్యేక ప్యాకేజీలను అందజేస్తుంటారు.
చిత్తూరు జిల్లాలోని ఈ క్షేత్రం గురించి కూడా చదవండి
శివుడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం...ఇక్కడ ఆయనకు అభిషేకం ఉండదు?