పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగు సముద్రం లక్ష ద్వీప్. వెండి వెన్నెల చిన్నబోయేలా .. మిరుమెట్లు గొలిపే తెల్లని ఇసుక తిన్నెలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి.
ఎటుచూసినా దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తాయి. సందర్శకుల సాహస క్రీడలకు స్వర్గధామంలాంటిది లక్షద్వీప్. స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలిని వర్ణించడానికి మాటలు చాలవు.
విహార దీవుల సమ్మేళనం.. లక్షద్వీప్!
పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగు సముద్రం లక్ష ద్వీప్. వెండి వెన్నెల చిన్నబోయేలా .. మిరుమెట్లు గొలిపే తెల్లని ఇసుక తిన్నెలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. ఎటుచూసినా దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తాయి. సందర్శకుల సాహస క్రీడలకు స్వర్గధామంలాంటిది లక్షద్వీప్. స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలిని వర్ణించడానికి మాటలు చాలవు. నిజానికి అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలే దీవులుగా పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లక్షద్వీప్ పర్యాటక విశేషాలు మీకోసం..!
మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్నది లక్షద్వీప్లు. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలో మీటర్లకు మించదు. ఇక్కడ 36 దీవులున్నప్పటికీ పది దీవులే జనావాసాలు ఉంటాయి. పది సబ్ డివిజన్లు కలిగిన ఒకే ఒక జిల్లా ఇది. పది దీవుల్లో జనాభా సంఖ్య లక్షకు మించి మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళం. అయితే చాలా మంది హిందీ మాట్లాడతారు. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు కనిపిస్తుంది. ప్రజల జీవనశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. పురుషులు మలయాళీల వస్త్రధారణలో, స్త్రీలు రంగురంగుల బుర్ఖాలు ధరిస్తారు. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ.
పర్యాటకమే పెద్ద పరిశ్రమ..
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కవరట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన 'ట్యూనా ఫిష్' ఇక్కడి నుండి పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం పర్యాటకమే పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు.
ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే. ది ఆమీన్ గ్రూప్ ద్వీపాలు, లక్షద్వీప దీవులు ఈ రెండింటి మధ్య సముద్రాంతర భాగ సంబంధం ఉంది. 200 కిలోమీటర్ల వెడల్పైన నైన్ డిగ్రీ కెనాల్ దక్షిణ భాగంలో ఉన్న మినికారు ద్వీపంలో ఉన్న ద్వీపాలన్నీ పగడపు రాళ్ళతో నిర్మితమై ఉంటాయి. ఇవి భారతీయ పగడపు దీవులుగా ప్రసద్ధి చెందాయి. లక్షద్వీప్ దీవుల్లో మనుషుల సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగు పెడు తుంటారు.
జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ..
అగట్టి, బంగారు దీవుల్లో స్కూబా డైవింగ్ స్కూళ్లున్నాయి. ఫెర్రీ క్రూయిజ్లో ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే చాలు అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్కి సిద్ధమవుతుంటారు. వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం అనే ఆలోచన కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సముద్రం లోపలికి దూసుకెళ్లే స్కూబా డ్రైవింగ్ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్లో వెళ్లి సంతోషపడుతుంటే... యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకొని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు
అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయమేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు 'సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...' వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసేందుకు శిక్షణపొందిన డైవర్స్ అందుబాటులో ఉంటారు. మరిన్ని లక్షద్వీప్ విశేషాలను రెండో భాగంలో చూద్దాం.