అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది.
అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం 'పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ' కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు.
విహార దీవుల సమ్మేళనం.. లక్షద్వీప్! (రెండోభాగం)
అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది. అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం 'పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ' కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు.
కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం.
సాహసోపేతమైన ఆటలు...
దీవిలోకి అడుగుపెడితే అక్కడ కొంతమంది పర్యాటకులు కేయాకింగ్ (తెడ్డు పడవ)తో గాలికంటే వేగంగా నీటి మీద సాగిపోతుంటారు. ఎన్నో సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు మాత్రం నీలిరంగులో స్వచ్ఛంగా కనిపిస్తుంది. చిన్న చిన్న దీవులైన అగట్టి, అమిని, అండ్రాట్, బిట్రా, చెట్లాట్, కాడ్మాట్, కాల్పెనీ, కవరట్టి, కిల్టాన్, మినికోరు... దీవులన్నింటినీ ఒక రోజులో చుట్టేయొచ్చు. సాహసాలకు నెలవు... కామత్ ఐలాండ్లో కానోయింగ్, యాచింగ్, కాయాకింగ్, స్నోర్కెలింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్. స్కూబా డైవింగ్ వంటి చాలా రకాల స్పోర్ట్స్ ఉన్నాయి.
చేపల మ్యూజియం..
కవరట్టి దీవి అన్నింటికన్నా పెద్దది. ఈ దీవిలో 11 వేల జనాభా ఉంటుంది. ఇళ్లు అధునాతనంగా ఉంటాయి. ఇక్కడ స్కూ బా డైవింగ్ ఫెమస్. సముద్రంలోని రకరకాల జీవరాసులు కనిపిస్తాయి. చేపల్లో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోవడం ఖాయం. స్కూ బా డైవింగ్లో ముఖ్యంగా సముద్రం అడుగున ఉన్న జీవరాశుల్ని చూపించడానికి తీసుకెళ్తారు. రంగురంగుల చేపలు చాలా కనిపిస్తాయి. సముద్రం అడుగున ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. స్కూ బా డైవింగ్ చేయని వాళ్లు తీరందగ్గరే ఉండి వాటర్ స్కూటర్, నీబోర్డు క్రీడలతో
ఆడుకుంటారు. ఇక్కడికి దగ్గర్లో ఫి షరీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన మ్యూజియంలో వందల రకాల చేపల్ని ప్రదర్శనకు ఉంచారు. పక్కన మరో భవనంలో సొరచేపల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళలో జానపద నృత్య కార్యక్రమాలు పర్యాటకులను అలరిస్తాయి.
సముద్రతీర వృక్షసంపద ..
సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హౌమ్, లక్షద్వీప్ హౌమ్స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల నుండి ఐదు వేలు చార్జ్ చేసే రిసార్టులు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశం కేరళకు దగ్గరకు ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ.
వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూ లక్ష సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. పర్యాటకరంగం నుండి వచ్చే ఆదాయం క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. స్థలాభావంచేత ఈ ద్వీపాలలో ప్యాక్టరీలు నడపడానికి వీలుకాదు కనుక ప్రభుత్వం కూడా పర్యాటరంగాన్ని ప్రోత్సహిస్తుంది. బంగరమ్, కడ్మట్ ద్వీపాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా బంగరమ్ ద్వీపం నిలుస్తోంది. సముద్రతీర వృక్షసంపద పర్యాటకులకు కనువిందు చేస్తున్నది.
చేరుకోవడం ఎలా?
కేరళలోని కొచ్చి నగరానికి దగ్గరగా ఉన్న తీరం లక్షద్వీప్, కొచ్చి నుండి అగట్టి దీవికి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్ బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్లు ఉంటాయి. రైలు మార్గంలో అయితే, కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుండి విమానం లేదా షిప్లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది. షిప్ ప్రయాణం చేయాలనుకునేవారు లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుండి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది.