దట్టంగా కమ్ముకున్న పొగమంచు...ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరులు...ఈడ్చికొట్టే అతిచల్లని గాలులు...ఒకవైపు వలస పూల సోయగాలు...మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు.... అంతా ప్రకృతి సోయగాల మయం...వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం...ఇవన్నీ చూడాలంటే ఏ స్విట్జర్లాండ్కో...కనీసం కాశ్మీర్ కో వెళ్లాలనుకుంటున్నారో...అవసరం లేనేలేదు...మన ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ప్రదేశం ఒకటుంది...అందుకే దీనిని దీనినే పర్యాటక ప్రియులు ముద్దుగా 'కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్' గా లేదా 'ఆంధ్రా ఊటీ' గా పిలుస్తారు. ఈ గ్రామానికే 'కొర్రబొయలు' అనే పేరుకూడా ఉంది.
మన్యం అందాలు అనగానే అందరికీ అరకులోయ గుర్తుకొస్తుంది. లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యటించే ఒక్కరిని మైమరపిస్తాయి. లంబసింగి ఘాట్రోడ్డులో కాఫీ తోటలు విస్తారంగా వున్నాయి. లంబసింగి చేరుకునే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది. దీనికి అర కిలోమీటరు దిగువన జలపాతం వుంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. అక్కడి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం వుంది.
ఎక్కడ ఉంది ఈ లంబసింగి
విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది ఈ లంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం దాటిన తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. నాలుగేళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లొచ్చాయి దీనికి. ఇక్కడి ఉష్ణోగ్రతలు శీతాకాలంలో 0 డిగ్రీలు లేదా అంతకంటే అంత కంటే తక్కువగా నమోదైతాయి. మిగితా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదైతాయి.
pc: Bdmshiva
పర్యాటకుల సందడే సందడి...
దాంతో ఎక్కడెక్కడి ప్రకృతి ప్రేమికులు లంబసింగి దారిపడుతున్నారు. ఇక లంబసింగి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే పర్యాటకులతో జాతరని తలపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ కొంతమంది పర్యాటకులు కట్టెలు, కిరోసిన్ వెంట తెచ్చుకుని మరీ చలిమంట వేసుకుంటారు. యువతీయువకులు ఆ నెగళ్ల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు. ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో పర్యాటకులు తమ సెల్ఫోన్లలో ప్రకృతి అందాల బ్యాక్ డ్రాప్ తో సెల్ఫీలు , గ్రూప్ ఫొటోలు తీసుకుంటూ హడావుడి చేస్తారు.
సుదూర ప్రాంతాల నుంచి....
విశాఖ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు లంబసింగికి తరలిరావడంతో ఈ మార్గంలో రహదారులు కిక్కిరిసిపోతాయి. విశాఖపట్నం ,విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో లంబసింగికి పర్యాటకులు వచ్చారంటే ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
కాశ్మీరాన్ని తలపించే లోయలు
కాశ్మీరాన్ని తలపించే లోయలు ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు, కాశ్మీరాన్ని తలపించే లోయలు పర్యాటకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. మన్యం ఏరియాలో ఉంది కనుక కొండలు, అడవులు దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇరువైపులా లోయలు ... మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
అందాలను చూసి కొత్త ఉత్సాహం
ఎన్నో మలుపులు తిరుగుతూ సాగే లంబసింగి ప్రయాణం రసవత్తరంగా ఉంటుంది. కాఫీ తోటలు, పసుపు రంగులో కనిపించే వలిసెపూల తోటలు, తాజంగి రిజర్వాయర్, వాతావరణం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.
pc: Abhishek SingerVerma
దక్షిణ భారతదేశంలో
దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా శీతాకాలంలో లంబసింగి లో మంచు వర్షం కురుస్తుంది. రెగ్యులర్ గా ఉదయం 6 అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10 గంటలకు దర్శనం ఇస్తాడు. వేసవిలో మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడు. లంబసింగిలో ప్రతిరోజూ 3 pm కు సూర్యుడు సన్నబడిపోతాడు. సాయంత్రం 5-6 అయ్యేసరిగి చలి ప్రారంభమవుతుంది.
pc: oneindia telugu
యాపిల్ సాగు కాఫీ తోటల పెంపకం
యాపిల్ సాగు కాఫీ తోటల పెంపకం బ్రిటీష్ వారి కాలం నుండే ఉంది. ఇక్కడి కాఫీ గింజలను, మిరియాలను అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అమెరికాలోని ఫ్లోరిడా తరహా వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో యాపిల్ సాగు చేయాలన్న ఆలోచన పరిశీలనలో ఉన్నది.
చూడదగ్గ ఇతర ఆకర్షణలు
తాజంగి రిజర్వాయర్ వద్ద పర్యాటక శాఖ తాజాగా బోట్ షికారును ఏర్పాటుచేశారు. చక్కటి అనుభూతులను పంచే ఈ ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడకొండమ్మ దేవాలయం వద్ద మొన్నీమధ్య ఒక జలపాతం కూడా కనిపించింది. దేవాలయం వద్ద కనిపించింది కాబట్టి 'బోడకొండమ్మ జలపాతం' అని పేరు పెట్టారు. అలాగే 40 కి. మీ ల దూరంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్, 75 కి. మీ ల దూరంలో ధారకొండ వాటర్ ఫాల్స్ చూడదగ్గవి.
pc: Bdmshiva
ఎలా చేరుకోవాలి ?
లంబసింగి కి చేరువలో వైజాగ్ ఎయిర్ పోర్ట్ (106 KM), వైజాగ్ రైల్వే స్టేషన్ (114 KM), నర్సీపట్నం రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ప్రభుత్వ బస్సులలో వచ్చేవారు నర్సీపట్నం, వైజాగ్, చింతపల్లి (19 KM) తదితర ప్రాంతాల నుంచి బస్సులలో రావొచ్చు.