మనదేశంలోని గుర్రపుస్వారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను చూద్దాం!
పెంపుడు జంతువులలో గుర్రాలు ఒకటి. రవాణాతోపాటు స్వారీ వంటి వివిధ ప్రయోజనాల కోసం వీటిని వినియోగిస్తూ ఉంటారు. అంతేకాదు, ఇటీవల కాలంలో గుర్రపుస్వారీ ఒక ప్రసిద్ధ క్రీడగా అభివృద్ధి చెందింది. కొన్ని ప్రాంతాలలో ప్రధాన రవాణాగా, గుర్రపు స్వారీ నైపుణ్యం పోలీసు పనికి, సాంస్కృతిక వ్యాయామాలలో భాగంగా, నక్కల వేట, ట్రైల్ రైడింగ్ వంటి అనేక సందర్భాలలో ఇవి మనకు సహకరిస్తూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని సాంప్రదాయ వేడుకలు మరియు ఆచార వ్యవహారాలలో భాగంగా మనకు సేవలను అందిస్తూనే ఉన్నాయి. భారతదేశంలో గుర్రపు స్వారీ చేసే ప్రాంతాలలో పేరుపొందిన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
ఉదయపూర్, రాజస్థాన్
అద్భుతమైన గుర్రపు స్వారీ అనుభవం కోసం భారతదేశంలోని అందమైన ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో అడుగుపెట్టాల్సిందే. అక్కడి ఉదయపూర్ నగరంలో గుర్రపు స్వారీ చేస్తూ విలాసవంతమైన కోటలు మరియు గంభీరమైన కొండలతో హాయిగా విహరించేందుకు అవకాశం ఉంది. ఇక్కడ అనేక గడ్డి భూములు సందర్శకులను మంత్రముగ్దులను చేస్తాయి. ఆరావళి పర్వత శ్రేణులను అన్వేషించడానికి ఈ సవారీలను వినియోగిస్తున్నారు. పురాతన రాజభవనాలకు నిలయమైన ఉదయపూర్లోని అద్భుతమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఇది ఉత్తమమైన మార్గం.
లడఖ్, జమ్మూ మరియు కాశ్మీర్
జమ్మూ & కాశ్మీర్లోని ఆనందభరితమైన లడఖ్ ప్రాంతంలాంటి పర్యాటక ప్రాంతం మరొకటి లేదేమో అనిపిస్తుంది. లడఖ్ భారతదేశంలోని గుర్రపు స్వారీకి ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా పేరుపొందింది. లడఖ్ యొక్క గ్రామీణ మనోహర స్వభావాన్ని అన్వేషించడానికి గుర్రపుస్వారీ ఉత్తమ ఎంపిక.
చాంగ్తాంగ్ పీఠభూమి లేదా " టిబెటన్ వైల్డాస్ అనేది గుర్రపు స్వారీకి ఒక అసాధారణమైన ప్రదేశం. జంస్కర్ వ్యాలీ, త్సోమోరిరి సరస్సు మరియు పాంగోంగ్ సరస్సును ఈ రైడ్తో చుట్టేందుకు అవకాశం ఉంది. అలాగే లడఖ్లోని జాంగ్లా, పెన్జెలా పాస్, పనిఖర్ కోట మరియు జోంగ్ఖుల్, స్టోంగ్డే, గెలుగ్పాలోని మఠాలను కూడా గుర్రాలపై సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు.
సోన్మార్గ్, జమ్మూ మరియు కాశ్మీర్
ఇది జమ్మూ & కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో ఉన్న అందమైన హిల్ స్టేషన్. ఈ ప్రాంతం యొక్క పచ్చని పచ్చికబయిళ్లతో చుట్టుముట్టబడిన కఠినమైన భూభాగంలో ఎత్తయిన పర్వతాలను అన్వేషించడానికి హార్స్ రైడ్ ఉపకరిస్తుంది. గంభీరమైన మంచుతో నిండిన ఇక్కడి పర్వతాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా అభివర్ణించవచ్చు. కాశ్మీర్ లోయలోని కొన్ని గొప్ప హిమాలయ పరిసరాల్లో విశ్రాంతి తీసుకుంటూ, సోన్మార్గ్లో గుర్రంపై కొల్హోయ్ మరియు మచోయ్ గ్లేసియర్లను అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది.
షిల్లాంగ్, మేఘాలయ
ప్రయాణీకులకు ఎంతో ఇష్టమైన పర్యాటక ప్రదేశం షిల్లాంగ్. అంతేకాదు, మేఘాలయ రాష్ట్రం గుర్రపు స్వారీకి కూడా అనువైనది. షిల్లాంగ్ నగరం చుట్టూ దాగిన పట్టణాలు, దట్టమైన పచ్చని కొండ శ్రేణులను గుర్రంపై అన్వేషించవచ్చు. ఈ నగరం ఇప్పటికీ దాని నిర్మాణంలో బ్రిటిష్ కాలం నాటి అపురూపమైన జ్ఞాపకాలను మిలితం చేసుకుంది. చుట్టూ కొండలతో చుట్టుముట్టబడిన ఈ నగరాన్ని గుర్రంపై చుట్టుముట్టడంతోపాటు 1965 మీటర్ల ఎత్తులో ఉన్న ఎత్తయిన శిఖరాన్ని చేరుకోవచ్చు. ఈ శిఖరం నుండి ఆవిష్కృతమయ్యే అద్భుతమైన దృశ్యాన్ని గుర్రంపై ఉల్లాసంగా ప్రయాణించిన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మూటగట్టుకోవచ్చు.
దిఘా, పశ్చిమ బెంగాల్
తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఉంది దిఘా. ఇది పశ్చిమ బంగాల్లోని ఒక అందమైన మరియు అత్యంత ప్రసిద్ధ రిసార్ట్ పట్టణం. ప్రకాశవంతమైన నీలిరంగు సూర్యకిరణాల అనుభూతిని ఆస్వాదిస్తూ.. తీరప్రాంతం అందాలను గుర్రపు స్వారీచేస్తూ వీక్షించేందుకు అనువైన గమ్యస్థానంగా దిఘా. బంగాళాఖాతంలో హుగ్లీ నది సంగమానికి ఎదురుగా, ఈ ప్రదేశం గుర్రపు స్వారీ క్రీడను చేపట్టేందుకు ప్రశాంతమైన ప్రదేశాన్ని అందిస్తుంది.