చుట్టూ సముద్రపు కెరటాల హొయలు. మధ్య మధ్యలో పచ్చని ప్రకృతి అందాల నడుమ కనిపించే ఇసుకతిన్నెల మెరుపులు, జనసంచారం తక్కువగా కనిపించే ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు. చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాలు. ఉప్పునీటి అడుగున కనిపించే ఎన్నో జీవరాసులు.
ఇవన్నీ చూడాలంటే అండమాన్ దీవులకు వెళ్లాల్సిందే! ఈ అందమైన దీవులను చూసేందుకు ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఔత్సాహిక పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు. చెన్నెయి నుంచి సముద్ర మార్గంలో సుమారుగా 1800 కిలోమీటర్లు దూరంలో ఈ అండమాన్ దీవులు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఈ దీవుల చరిత్ర, అక్కడి ప్రకృతి పర్యాటక విశేషాలు తెలుసుకుందాం!!
అండమాన్ దీవుల అందాలు చూసోద్దామా!
సరదాగా కుటుంబ సమేతంగా ఎక్కడికైనా టూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అందుకోసం అండమాన్ నికోబార్ దీవులను ఎంపిక చేసుకున్నాం. ఓ ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఐదురోజుల పాటు అక్కడ సందర్శనకు ప్లాన్ చేశాం. ఉదయాన్నే అనంతపురం నుంచి బెంగళూరుకు చేరుకున్నాం. అక్కడి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 11.30 గంటలకు విమానం ఎక్కి, రెండు గంటల సమయంలో పోస్ట్ బ్లెయిర్ ప్రాంతంలోని విమానాశ్రయం చేరుకున్నాం. విమానాశ్రయానికి ఒకటిన్నర కిలోమీటర్లు దూరంలోని ఓ త్రీస్టార్ హోటల్లో బస చేశాం. ఓ గంట విశ్రాంతి అనంతరం పోర్ట్ బ్లెయిర్లో ఉన్న కార్బైన్స్ కేవ్ బీచ్ను సందర్శించి, సుదీర్ఘమైన సముద్రతీరం వెంబడి వెళ్ళి సెల్యులార్ జైలును సందర్శించాం. అక్కడి స్వాతంత్య్ర సమరయోధుల వీరగాథలను తెలుసుకున్నాం.
స్వాతంత్య్రానంతరం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఫోర్ప్లే ప్రాంతంలో సెల్యూలార్ జైలులో ఫ్రీడమ్ ఫైటర్లు ఉండడానికి అనుకూలంగా దీనిని మార్చారట! ఈ ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ ప్రతిమలు, భారతీయ జెండాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి.
పోర్ట్ బ్లేయిర్
అండమాన్ దీవులలో జనసంచారం బాగానే ఉంది. అండమాన్ ఐలాండ్ ప్రజలు తీరానికి అతి సమీపంలో నివాసం ఉంటారు. సుందరమైన తీరప్రాంతాలు, సహజ ద్వీపాలు, అందమైన ప్రకృతి దృష్యాలు అండమాన్ సొంతం. భారతీయులకు అండమాన్ దీవులను సందర్శించేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అయితే, కొన్ని గిరిజన ప్రాంతాలను సందర్శించాలంటే మాత్రం ప్రత్యేక అనుమతుల తప్పనిసరి. నికోబార్ దీవులలో మాత్రం మిలిటెంట్లు మాత్రమే ఉంటారు. ఈ ప్రాంతంలో చొరబాటుకు అవకాశం ఉండటంతో మిలిటరీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మాల్దీవులు శ్రీలంకకు ఆనుకుని ఉంటాయి.
మరుసటిరోజు హావలక్ ద్వీప తీరం, సముద్రపు అంచున కట్టబడిన రిసార్టులు, వందేళ్లకు పైన చరిత్ర కలిగిన చెట్లతో నిండిన అరణ్యాలు, సుప్రసిద్ధమైన రాధానగర్ బీచ్ సందర్శించాం. మూడవ రోజు ఎలిఫెంట్ బీచ్, పక్క ప్రాంతాలు, నాల్గవ రోజు రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం, కారల్ దీవిలో సముద్ర అడుగుభాగంలో చేసిన ప్రయాణం జీవితంలో మర్చిపోలేం.
రోస్ ఐలాండ్
అక్కడికి దగ్గరలో ఉంది రోస్ ఐలాండ్. ఈ దీవిలో పోలీసుల పర్యవేక్షణలో జెట్టీలు నడపబడతాయి. ఈ జట్టీ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. ఈ దీవిలో తమ పరిపాలన సాగించటానికి కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు.
ఇక్కడి నుంచి బ్రిటీష్ వారు సెల్యులార్ జైలు నిర్మాణాన్ని పర్యవేక్షించేవారని స్థానిక గైడ్ వివరించారు. ఇటీవల సునామీ వచ్చిన సమయంలో పోర్టు బ్లెయిర్ను ఈ దీవే కాపాడిందని చెప్పారు. ఈ దీవి లేకుంటే అండమాన్ లోని ప్రముఖ ప్రాంతాలు సునామీలో కలిసిపోయి ఉండేవట! అందుకే అండమాన్కు ఓ రక్షణగోడలా దీనిని స్థానికులు సైతం భావిస్తారు. అంతేకాదు, రోస్ ఐలాండ్ బ్రిటీష్ కాలంలో వారి పరిపాలనా కేంద్రాలలో ఒకటి. ఇదీ ప్రస్తుతం పోలీసులు పర్యవేక్షణలోనే ఉంది. మా పర్యటనలో మరిన్ని విశేషాలు రోండో భాగంలో తెలుసుకుందాం.